కశ్మీర్‌: 33 ఏళ్ల తర్వాత తిరిగి మొదలైన సూఫీల సంప్రదాయ ‘పడవల యాత్ర’

వీడియో క్యాప్షన్, పడవలతో ప్రయాణం చేస్తూ గత అనుభవాలను గుర్తు చేసుకుంటున్న యాత్రికులు

కశ్మీర్‌లో 1990లో చెలరేగిన హింస కారణంగా పడవల మీద ప్రయాణిస్తూ గాందర్‌బల్‌లోని ఖమర్ షా బుఖారీ పవిత్ర దర్గాను సందర్శించే యాత్రను అప్పుడు తాత్కాలికంగా నిలిపివేశారు. తిరిగి 33 ఏళ్ల తర్వాత ఈ యాత్రను తిరిగి ప్రారంభించారు. ప్రభుత్వం ఈ సంప్రదాయాన్ని పునరుద్ధరించినప్పటికీ గత వైభవం ఇప్పుడు లేదంటున్నారు ప్రజలు. బీబీసీ ప్రతినిధులు రియాజ్ మస్రూర్, ఫఫత్ ఫారూఖ్ అందిస్తున్న కథనం.

సూఫీ పాటలు పాడుతూ, ఈ ఆరాధకులు శ్రీనగర్ నుండి గాందర్‌బల్‌కు జీలం నది గుండా వెళుతున్నారు.

1989లో హింస చెలరేగడంతో ఈ సంప్రదాయ యాత్ర నిలిచిపోయింది.

33 ఏళ్ల తర్వాత గాందర్‌బల్‌లోని ఖమర్ షా బుఖారీ పవిత్ర దర్గాను సందర్శించేందుకు పెద్ద పడవల మీద గాయకులతో కలిసి భక్తులంతా బయల్దేరారు.

కానీ గతంతో పోల్చితే ఇప్పుడు జనం పలుచగా కనిపిస్తున్నారు.

14వ దశాబ్దంలో మధ్య ప్రాచ్య దేశాల నుంచి వచ్చిన వందల మంది సూఫీ ముస్లిం ప్రబోధకుల్లో సయిద్ ఖమర్ షా బుఖారీ ఒకరు.

పెద్ద సంఖ్యలో మహిళలు కూడా ఈ ప్రార్థనా స్థలాన్ని సందర్శిస్తారు.

ఏర్పాట్లు సరిగ్గా లేకపోవడం వల్లనే ఈ సంప్రదాయ ఉత్సవానికి గత వైభవం లేకుండా పోయింది.

ఈ ఏడాది ఉర్సుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినా గత వైభవం, ఉత్సాహం ఇప్పుడు కోల్పోయాయి.

''ఆ పవిత్ర స్థలం వైపు వెళ్లే వందలాది పడవలతో ఈ నది సందడిగా కనిపించాలి. వివిధ ప్రాంతాలకు చెందిన మహిళలు, పురుషులు, పిల్లలు పడవల్లో ఎక్కేవారు. సింగర్స్, డాన్సర్లు ఆ క్షణాలకు మరింత శోభ తీసుకొచ్చేవారు. రాజ్ బేగం, జూన్ బేగం వంటి వాళ్లు దైవ కీర్తనలు పాడుతూ ఉండేవాళ్లు'' అని స్థానికుడైన అబ్దుల్ వాహిద్ చెప్పారు.

''సూఫీ సంగీతాన్ని ఇష్టపడే వారు ఈ పడవలను ఎక్కాలనుకుంటారు. నదిలో పడవలు వరుసగా ప్రయాణించేవి. ఈరోజు మూడు పడవలే ఉన్నాయి. ప్రభుత్వం ఈ సంప్రదాయాన్ని పునరుద్ధరించిన తర్వాత భవిష్యత్తులో దీనికి వైభవం వస్తుందని ఆశిస్తున్నాం'' అని సూఫీ గాయకుడైన ఫారూఖ్ గనానీ అన్నారు.

''నేను జమ్మూలోని ఉత్సవాలకు వెళ్లాను. కానీ ఇది గొప్పగా ఉంది. మా నాన్నతో కలిసి శ్రీనగర్ నుంచి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఉయ్యాలతోపాటు చాలా ఉన్నాయి. ఇక్కడికి పడవలు వస్తాయని నాకు తెలీదు. ఈ సారి పడవ మీద వస్తాను'' అని మహనూర్ అన్నారు.

ఒక మహిళ మాట్లాడుతూ.. ''ఖమర్ షా దర్గావైపు అన్నీ మార్గాలు ఉండేవి. ముందు దర్గాను సందర్శించిన తర్వాత ఉత్సవానికి వెళ్లాలని అనుకున్నాను'' అని తెలిపారు.

''నా కుటుంబంతో వచ్చినప్పుడు నేను చాలా చిన్నదానిని. ఆరోజుల్లో అదే గొప్పగా అనిపించేది. 10 రోజుల పాటు ఉత్సవాలు జరిగేవి. ఆ రోజులు చాలా సందడిగా అనిపించేవి. గతంలా ఇప్పుడు అనిపించడం లేదు'' అని మరొక మహిళ వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)