హీరో నానిపై సెటైర్లు: ‘పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల ధరలు తగ్గిస్తే వినియోగదారులను అవమానించినట్లే’

మొన్నటివరకూ ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ధరల తగ్గింపుపై థియేటర్ల ఓనర్లు, ప్రభుత్వం మధ్య నడిచిన వివాదం ఒకే ఒక్క రోజులో, ఒక్క వ్యాఖ్యతో సినీ హీరో నానికి చుట్టుకుంది.

తన కొత్త సినిమా 'శ్యామ్ సింగరాయ్' విడుదలకు ఒక్క రోజు ముందు హీరో నాని ఏపీలో టికెట్ల ధరలపై చేసిన వ్యాఖ్యలతో సోషల్ మీడియా నానికి అనుకూలంగా, వ్యతిరేకంగా పోస్టులు మొదలయ్యాయి.

కొందరు నాని వ్యాఖ్యల మీద సీరియస్‌గా స్పందిస్తుంటే, మరికొందరు హీరో వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు. కొందరేమో ఈ వివాదంపై సోషల్ మీడియాను సెటైర్లతో నింపేస్తున్నారు.

ఈ వివాదంపై ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. తనకు హీరో నాని ఎవరో తెలియదని, తనకు తెలిసింది కొడాలి నాని మాత్రమేనని అన్నారు.

ఇంతకీ నాని ఏమన్నారు

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ధరలను నియంత్రిస్తూ ప్రభుత్వం జీవో నంబర్ 35 విడుదల చేసింది. దీనిపై సినీ థియేటర్ల యాజమాన్యాలు కోర్టులను ఆశ్రయించాయి. దీనిపై విచారణ జరగాల్సి ఉంది.

అయితే, ఈ లోపు నిబంధనలు పాటించడం లేదంటూ అధికారులు పలు థియేటర్లను సీజ్ చేశారు. నిరసనగా యజమానులు కొందరు తమ థియేటర్లను స్వచ్ఛందంగా మూసివేశారు.

ఇదంతా కొనసాగుతుండగానే తన కొత్త సినిమా శ్యామ్ సింగరాయ్ ప్రమోషన్ కోసం గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో చిత్రబృందంతో కలిసి పాల్గొన్న నాని దీనిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

"పది మందికి ఉద్యోగం ఇచ్చి, ఒక పెద్ద థియేటర్ నడిపే వ్యక్తి కౌంటర్లో కంటే పక్కనున్న కిరాణా షాపులో ఎక్కువ ఆదాయం వస్తుంటే అందులో అసలు లాజిక్ లేదు. సినిమా, రాజకీయాలు అన్నీ పక్కన పెడితే ఇది ప్రేక్షకులను అవమానించినట్లే" అన్నారు.

నాని దీనికి ఒక ఉదాహరణ కూడా చెప్పారు. "స్కూల్లో ఉన్నప్పుడు ఈ ఆదివారం మీ అందర్నీ పిక్నిక్ తీసుకెళ్తున్నాం. ప్రతి ఒక్కరూ వంద రూపాయల చొప్పున తీసుకురావాలని చెప్పి, ఆ నాని నువ్వు ఇవ్వలేవు, నీకంత లేదు, నువ్వు మాత్రం పది రూపాయలు తెస్తే సరిపోతుందిలే అంటే, అది నన్ను అవమానించినట్లే" అన్నారు.

సరిగ్గా ఈ మాటతో ఏపీలో థియేటర్లు, ప్రభుత్వం మధ్య ఉన్న గొడవ కాస్తా హీరో నాని చుట్టూ తిరగడం మొదలైంది. ఇప్పుడు సోషల్ మీడియాలో నాని వ్యాఖ్యల గురించి చేస్తున్న పోస్టులతో నిండిపోయింది.

చాలా మంది నాని థియేటర్ల ఆదాయాన్ని, కిరాణా షాపు ఆదాయంతో పోల్చడంపై సీరియస్ అయ్యారు.

కేవీ సుబ్బిరెడ్డి అనే ట్విటర్ హాండిల్లో యూజర్ అయితే సినిమాలు వదిలేసి థియేటర్ల పక్కనే పాన్ షాపు పెట్టుకోవచ్చుగా అని సలహా ఇచ్చారు.

జగన్ కృష్ణ లాంటి చాలా మంది యూజర్లు.. అదే నిజమైతే పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల ధరలు తగ్గిస్తే వినియోగదారులను అవమానపరచడమే కదా అని నానికి ప్రశ్నలు సంధించారు.

వైసీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు కూడా నానిపై పరోక్షంగా చురకలేశారు. పారితోషికాన్ని వెల్లడించకుండా, టికెట్ ధర గురించి మాట్లాడే నైతిక అర్హత ఏ హీరోకూ లేదన్నారు.

టికెట్లు ధరలు పెంచినా ప్రేక్షకులను అవమానించినట్లే అని మధు అనే యూజర్ ట్వీట్ చేశారు. ’నీకు చేతకాదు, నువ్వు చూడలేవని అవమానించినట్లే కదా" అని ప్రశ్నించాడు.

మీ రెమ్యూనరేషన్స్ మీకు వస్తున్నాయి, సినిమా పరిశ్రమకు నష్టం తీసుకొస్తున్నదే మీరని మరో యూజర్ అన్నారు.

అజ్ఞాతవాసి బెనిఫిట్ షో టికెట్ 1000 రూపాయలకు కొన్నానని, పుష్ప సినిమా టికెట్ 150 రూపాయలకు కొన్నానని, తనకు ఎలాంటి అవమానం జరగలేదని నికిత దాడిశెట్టి అనే యూజర్ ట్వీట్ చేశారు.

నానికి మద్దతుగా పోస్టులు

నానికి వ్యాఖ్యలకు వ్యతిరేకంగానే కాదు, హీరోను సమర్థిస్తూ కూడా చాలా మంది ట్వీట్స్ చేశారు.

తన సినిమా రిలీజయ్యే ఒక్క రోజు ముందు ఒక హీరో ఇలా మాట్లాడాలంటే దమ్ముండాలని ట్రెండ్ పీఎస్‌పీకే అనే హాండిల్లో ట్వీట్ చేశారు.

మరికొందరు నాని నుంచి మిగతా హీరోలు నేర్చుకోవాలన్నారు.

తప్పని తెలిశాక ఎదిరించడంలో తప్పులేదని నీరజ్ పత్తెం లాంటి యూజర్లు నానికి అండగా నిలిచారు.

చాలా మంది వియ్ సపోర్ట్ నాని, వియ్ లవ్ నాని అనే హాష్ టాగ్స్‌తో హీరోకు మద్దతు తెలిపారు.

నిర్మాత శోభు యార్లగడ్డ కూడా నానికి మద్దతుగా ట్వీట్ చేశారు..

చాలా థియేటర్లు ఈ టికెట్ల ధరలు తగ్గించడాన్ని తట్టుకోలేవని, ఆ పరిశ్రమను నమ్ముకున్న చాలా మందిపై ఆ ప్రభావం పడుతుందని అన్నారు.

మరో ట్వీట్‌లో ఆయన ఏపీ ప్రభుత్వానికి దీనిపై కొన్ని సూచనలు కూడా చేశారు.

ప్రభుత్వం సినిమాల నుంచి పన్ను వసూళ్లు పెంచాలనుకుంటే అది చేయచ్చన్నారు. ప్రభుత్వం అన్ని థియేటర్లలో కంప్యూటటరైజేషన్ ద్వారా టికెట్ల అమ్మకాలను తప్పనిసరి చేయాలని, అవి ఆటోమేటిక్, రియల్ టైమ్ అప్ డేటింగ్ ఉండాలన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)