దిల్లీలో కరోనావైరస్‌ ఒమిక్రాన్ వేరియంట్ తొలి కేసు నమోదు – Newsreel

దిల్లీలో కరోనావైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తొలి కేసు వెలుగులోకొచ్చింది.

టాంజానియా నుంచి దిల్లీకి తిరిగొచ్చిన 37 వ్యక్తిలో ఒమిక్రాన్ ఇంఫెక్షన్ బయటపడిందని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ వెల్లడించారు. ఆ వ్యక్తి ప్రస్తుతం ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇప్పటివరకు భారత్‌లో అధికారికంగా ధృవీకరించినవాటిల్లో ఇది అయిదవ కేసు.

ఇంతవరకు బెంగళూరులో రెండు, ముంబయి, గుజరాత్‌లలో ఒక్కో కేసు బయటపడ్డాయి.

ఇప్పటివరకు 17 మందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్థారణ అయిందని, వారందనీ ఆస్పత్రిలో చేర్చామని ఆరోగ్య మంత్రి తెలిపారు.

గతవారం దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఒమిక్రాన్ వేరియంట్‌పై ఆందోళన వ్యక్తం చేశారు. భారత్‌కు వచ్చే వారిపై ప్రయాణ ఆంక్షలు విధించాలని ప్రధానమంత్రి నరేంద్ర్ మోదీకి విజ్ఞప్తి చేశారు.

"ఒమిక్రాన్ ప్రభావిత దేశాల నుంచి వచ్చే విమానాలను చాలా దేశాలు నిలిపివేసాయి. మనం ఎందుకు ఆలస్యం చేస్తున్నాం? మొదటి వేవ్‌లో కూడా ప్రయాణ ఆంక్షలు విధించడంలో మనం ఆలస్యం చేశాం. అధిక భాగం విదేశీ విమానాలు దిల్లీకే వస్తాయి. అందుకే దిల్లీపై ఎక్కువ ప్రభావం కనిపిస్తుంది. ప్రధానమంత్రి గారూ దయచేసి విదేశీ విమానాల రాకను ఆపండి" అంటూ ట్వీట్ చేశారు.

ఇప్పటివరకు ప్రపంచంలోని 23 దేశాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.

దక్షిణాఫ్రికాలో తొలుత కనిపించిన ఈ కొత్త వేరియంట్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ నవంబర్ 26న ఒమిక్రాన్ అని పేరు పెట్టింది.

ఒమిక్రాన్‌లో భారీ స్థాయిలో ఉత్పరివర్తనం చెందిందని నిపుణులు తెలిపారు.

బ్రిటన్, అమెరికా, కెనడాతో సహా పలు దేశాలు దక్షిణాఫ్రికాతో పాటు ఇతర ఆఫ్రికా దేశాల నుంచి విమానాల రాకను నిలిపివేశాయి.

ఒమిక్రాన్‌పై వ్యాక్సీన్ ప్రభావం తక్కువగా ఉండవచ్చని బ్రిటన్‌కు చెందిన ఒక ఆరోగ్య అధికారి హెచ్చరించారు.

ఆర్‌టీపీసీఆర్ పరీక్షలో ఒమిక్రాన్‌ను గుర్తించవచ్చని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. జీనోం సీక్వెన్సింగ్ పరీక్ష జరిపితే ఇతర వేరియంట్ల గురించి తెలుస్తుంది.

అయితే ఆర్‌టీ పీసీఆర్ పరీక్షలు చాలావరకు ఒమిక్రాన్‌కు, ఇతర వేరియంట్లకు మధ్య తేడాను గుర్తించలేవని నిపుణులు అంటున్నారు.

అయితే, ఒమిక్రాన్ ఎంత ప్రమాదకరమని చెప్పడానికి తగినంత డాటా లేదని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)