వ్యవసాయ చట్టాలు: నరేంద్ర మోదీ ప్రభుత్వ తీరుపై ఆర్ఎస్ఎస్ రైతు సంఘం అసంతృప్తి, సెప్టెంబర్ 8న ధర్నా

నరేంద్ర మోదీ సర్కార్ కొత్తగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు నిరసనగా సెప్టెంబర్ 8న దేశవ్యాప్తంగా ధర్నాలు చేయాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌ - ఆర్ఎస్ఎస్‌కు సంబంధించిన భారతీయ కిసాన్ సంఘ్ (బీకేఎస్) నిర్ణయించింది.

మూడు వ్యవసాయ చట్టాలు, కనీస మద్దతు ధరపై ఆగస్టు 31 వరకు తాము ఇచ్చిన అల్టిమేటంపై చర్యలు తీసుకోవడంలో కేంద్రం విఫలమైందని సంఘ్ చెప్పినట్లు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.

కనీస మద్దతు ధర - ఎంఎస్‌పీని పంటల వ్యయంపై నిర్ణయించాలి. కొత్త వ్యవసాయ చట్టాలపై కొనసాగుతున్న వివాదాలు పరిష్కరించడానికి ఒక కొత్త చట్టం తీసుకురావాలి అని సంఘ్ చెప్పింది.

ఈ డిమాండ్లపై సెప్టెంబర్ 8న దేశవ్యాప్తంగా ధర్నా చేస్తామని భారతీయ కిసాన్ సంఘ్ - బీకేఎస్ కోశాధికారి యుగళ్ కిశోర్ మిశ్రా బుధవారం ఉత్తర్‌ప్రదేశ్ బలియాలో మీడియాతో చెప్పారు.

"మా డిమాండ్ల అమలుకు ఆగస్టు 31 వరకు మేం మోదీ ప్రభుత్వానికి గడువు ఇచ్చాం. ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాకపోవడంతో సెప్టెంబర్ 8న మేం ధర్నా చేస్తాం" అని ఆయన అన్నారు.

ఆ రోజు అన్ని జిల్లా ప్రధాన కార్యాలయాల్లో ప్రెస్ కాన్ఫరెన్సులు నిర్వహిస్తాం. రైతుల సమస్యల గురించి చెబుతాం అన్నారు.

మా భవిష్యత్ కార్యాచరణ ఏంటో సెప్టెంబర్ 8 తర్వాత నిర్ణయిస్తామని ఆయన తెలిపారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులర్పించిన జగన్, షర్మిల

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులు అర్పించారు.

కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ వద్ద ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

జగన్‌తో పాటు సతీమణి వైఎస్ భారతి, తల్లి విజయమ్మ, సోదరి వైఎస్‌‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల కూడా నివాళులర్పించారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మాజీ ముఖ్యమంత్రికి నివాళులర్పించారు.

అంతకుముందు గురువారం ఉదయం జగన్ ట్విటర్ వేదికగా తన తండ్రి స్మృతులను పంచుకున్నారు.

తన తండ్రి భౌతికంగా దూరమై పన్నెండేళ్లయినా ప్రజల గుండెల్లో ఇంకా ఉన్నారని, తాను వేసే ప్రతి అడుగులోనూ, చేసే ప్రతి ఆలోచనలోనూ ఆయన స్ఫూర్తే ఉందని అన్నారు.

సయ్యద్ అలీ షా గిలానీ: కశ్మీర్ వేర్పాటువాద నాయకుడు మృతి

కశ్మీర్ వేర్పాటువాద నాయకుడు సయ్యద్ అలీ షా గిలానీ (92) మృతి చెందారు.

తీవ్రమైన అనారోగ్యంతో శ్రీనగర్‌లోని ఇంటిలోనే గిలానీ మరణించినట్లు ఆయన కుటుంబం ధ్రువీకరించిందని బీబీసీ ప్రతినిధి రియాజ్ మస్రూర్ తెలిపారు.

కశ్మీర్‌లో వేర్పాటువాద సంస్థల కూటమి ‘‘హురియత్ కాన్ఫెరెన్స్’’ను స్థాపించిన వారిలో గిలానీ ఒకరు. ప్రస్తుతం ఈ కూటమి క్రియాశీలంగా లేదు.

‘‘గిలానీ మరణ వార్త నన్ను కలచివేసింది. మాకు కొన్ని విభేదాలు ఉన్నాయి. అయినప్పటికీ ఆయన అంటే నాకెంతో గౌరవం’’అని జమ్మూకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ ట్వీట్‌చేశారు.

15 ఏళ్లుగా ఎమ్మెల్యే

జమ్ముకశ్మీర్ అసెంబ్లీలో గత 15 ఏళ్లుగా గిలానీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. సోపోర్ నుంచి 1972, 1977, 1987 ఎన్నికల్లో ఆయన గెలిచారు.

ప్రస్తుతం నిషేధాన్ని ఎదుర్కొంటున్న జమాతే ఇస్లామీ పార్టీ నుంచి ఆయన పోటీచేసేవారు.

1989లో ఈ సంస్థ సాయుధ పోరాటాన్ని మొదలుపెట్టినప్పుడు, సంస్థకు గిలానీ రాజీనామా చేశారు.

1993లో 20కిపైగా మతపరమైన పార్టీలు కలిసి ‘‘ఆల్ పార్టీస్ హురియత్ కాన్ఫెరెన్స్’’ను ఏర్పాటుచేశాయి.

ఈ కూటమికి మిర్వాయిజ్ ఉమర్ ఫరూఖ్ తొలి ఛైర్మన్. ఆ తర్వాత కాలంలో గిలానీ కూడా ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు.

2003లో గిలానీ, ఆయన మద్దతుదారులు హురియత్ కాన్ఫెరెన్స్ నుంచి బయటకొచ్చారు. అనంతరం వారంతా గిలానీ నేతృత్వంలో హురియత్ (గిలానీ) పార్టీని ఏర్పాటుచేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)