'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' పోస్టర్‌లో నెహ్రూ ఫొటో లేకపోవడంపై కాంగ్రెస్ ఆగ్రహం

భారత 75వ స్వాతంత్ర్య సంబరాలను పురస్కరించుకుని 'ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్' (ఐసీహెచ్‌ఆర్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌లో దేశ తొలి ప్రధాని నెహ్రూ చిత్రం లేకపోవడంపై కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మహాత్మాగాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, బీఆర్ అంబేడ్కర్, వల్లభాయ్ పటేల్, బాబూ రాజేంద్రప్రసాద్, మదన్ మోహన్ మాలవీయ, వీర సావర్కర్‌ల ఫొటోలు ఉన్న పోస్టర్‌ ఐసీహెచ్ఆర్ వెబ్‌సైట్‌లో ఉంది.

కాంగ్రెస్ నాయకులు దాని స్క్రీన్ షాట్లను షేర్ చేస్తూ.. ఆ పోస్టర్‌లో నెహ్రూ చిత్రం ఎందుకు లేదని ప్రశ్నిస్తున్నారు.

నెహ్రూను విస్మరించి ఐసీహెచ్ఆర్ తన పరువు తానే తీసుకుందని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అన్నారు.

''భారత స్వాతంత్ర్యోద్యమంలో కీలక పాత్ర పోషించిన నెహ్రూను విస్మరించడం చిన్న విషయం కాదు. ఐసీహెచ్ఆర్ మరోసారి తన పరువు తానే తీసుకుంది. ఐసీహెచ్ఆర్‌కు ఇది అలవాటుగా మారిపోయింది'' అంటూ శశిథరూర్ ట్వీట్ చేశారు.

థరూర్ ట్వీట్‌ను చాలామంది కాంగ్రెస్ నాయకులు రీట్వీట్ చేశారు.

మరో కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ కూడా ఈ విషయంలో ప్రభుత్వ తీరును తప్పుపట్టారు.

కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శామా మొహమ్మద్ కూడా దీనిపై స్పందించారు.

''అజాదీ కా మహోత్సవ్‌లో ఈ దేశ ప్రథమ ప్రధాని నెహ్రూ ఫొటో లేనంత మాత్రాన అది ఆయన స్థాయినేమీ తగ్గించదు. నెహ్రూ లెగసీని చూసి మోదీ, బీజేపీ ఎంతగా భయపడుతున్నారనేది దీన్ని బట్టి అర్థమవుతోంది'' అన్నారు శామా మొహమ్మద్.

కాంగ్రెస్ మరో అధికార ప్రతినిధి గౌరవ్ గొగోయ్ దీనిపై ట్వీట్ చేస్తూ.. ''ఇంకే దేశం కూడా ఇలా తమ ప్రథమ ప్రధాని చిత్రాన్ని స్వాతంత్ర్య సంబరాల నుంచి తొలగించదు. పండిట్ నెహ్రూ, అబుల్ కలామ్ ఆజాద్‌ల చిత్రాలను తొలగించడం అన్యాయం'' అన్నారు.

కాంగ్రెస్ నేతలే కాకుండా చాలామంది ఇతరులు కూడా దీనిపై స్పందించారు.

సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయి ''ఐసీహెచ్ఆర్ పోస్టర్ నుంచి నెహ్రూ చిత్రం తీసేయొచ్చు కానీ స్వాతంత్ర్య ఉద్యమంలో ఆయన పాత్రను మాత్రం మర్చిపోలేరు. అలాగే, నవ భారత నిర్మాణంలో ఆయన వేసిన ముద్రనూ చెరపలేరు'' అన్నారు.

దీనిపై ఐసీహెచ్ఆర్ అధ్యక్షుడు ఓం ఉపాధ్యాయ 'టైమ్స్ నౌ'తో మాట్లాడుతూ... ఇప్పటివరకు ఆ పోస్టర్‌లో 8 మందికే స్థానమిచ్చామని, 16 కానీ, 24 మంది ఫొటోలను కానీ తీసుకోవాలనుకుంటే నెహ్రూ చిత్రానికి కూడా స్థానం కల్పిస్తామని చెప్పారు.

ఎవరినీ తక్కువ చేయడం ఐసీహెచ్ఆర్ ఉద్దేశం కాదని అన్నారు.

మరోవైపు బీజేపీ నేత, కేంద్ర మంత్రి వి.మురళీధరన్ ఈ వ్యవహారంపై స్పందిస్తూ శశి థరూర్‌పై విమర్శలు చేశారు.

''థరూర్ మర్చిపోయినట్లున్నారు. మొన్న ఆగస్ట్ 15న ప్రధాని మోదీ స్వాతంత్ర్యోద్యమంలో నెహ్రూ పాత్ర గురించి మాట్లాడారు. పోస్టర్లలో ఫొటో ఉంటేనే స్మరించుకున్నట్లుగా థరూర్ భావిస్తున్నట్లున్నారు'' అన్నారు మురళీధరన్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)