జస్టిస్ ఎన్‌వీ రమణ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం

జస్టిస్ నూతలపాటి వెంకట రమణ సుప్రీంకోర్టు 48వ చీఫ్ జస్టిస్‌గా ప్రమాణ స్వీకారం చేశారు.

రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆయనతో ప్రమాణం చేయించారు.

ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

రాజ్యాంగంలోని 124వ అధికరణంలో 2వ క్లాజ్ కింద తనకు లభించిన అధికారాలను ఉపయోగిస్తూ రాష్ట్రపతి.. ఎన్‌వీ రమణను భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు.

సమున్నత న్యాయపీఠంపై తెలుగువాడు

తెలుగువాడైన్ జస్టిస్ ఎన్‌వీ రమణ కృష్ణా జిల్లా పొన్నవరం గ్రామంలో 1957 ఆగస్టు 27న జన్మించారు.

1983 ఫిబ్రవరి 10న న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించారు.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్‌గా పనిచేశారు.

వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన రమణ బీఎస్సీ, బీఎల్ చదివారు.

సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్(క్యాట్), ఉమ్మడి ఏపీ హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో ప్రాక్టీసు చేశారు.

వివిధ ప్రభుత్వ సంస్థలకు పానెల్ కౌన్సిల్‌గా ఉన్నారు. క్యాట్‌లో కేంద్ర ప్రభుత్వం, రైల్వేల తరఫున పనిచేశారు.

2000 జూన్ 27న ఏపీ హైకోర్టు పర్మినెంటు జడ్జిగా నియమితులయ్యారు.

2013 మార్చి 10 నుంచి మే 20 వరకూ ఏపీ హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్‌గా పనిచేశారు.

2013 సెప్టెంబరు 2న దిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా పదోన్నతి పొందారు.

అనంతరం 2014 ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

వ్యవసాయ కుటుంబంలో జన్మించిన జస్టిస్ రమణకు కర్నాటక సంగీతం అంటే ఎంతో ఇష్టం.

ఆయన మంచి అధ్యయనశీలి. తెలుగు సాహిత్యాన్ని విస్తృతంగా చదివారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)