తెలంగాణ రాష్ట్ర బడ్జెట్: మాంద్యం దెబ్బకు తగ్గిన బడ్జెట్ సైజు

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. తొలి ఐదేళ్ల పరిపాలనలో అద్భుతమైన ప్రగతి సాధించామని బడ్జెట్ ప్రసంగం సందర్భంగా కేసీఆర్ అన్నారు.

పేదలకు ఆరోగ్య భద్రత కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా కేసీఆర్ ప్రకటించారు. తాము ప్రవేశపెట్టిన వినూత్న ప్రజాప్రయోజన పథకాలు యావత్‌ దేశాన్నే ఆశ్చర్యపరిచాయని, అన్ని రంగాల్లోనూ పురోగతి సాధిస్తున్నామని చెప్పారు.

ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు ముందు తెలంగాణ జీఎస్‌డీపీ సగటు వృద్ధి రేటు 4.2 శాతం ఉండేదని, 2018-19 నాటికి ఇది రెండున్నర రెట్లు పెరిగి 10.5 శాతంగా నమోదైందని అన్నారు.

గడిచిన 18 నెలలుగా దేశంలో ఆర్థిక మాంద్యం కొనసాగుతోందని, ఆ ప్రభావం రాష్ట్రంపై కూడా పడిందని, అందువల్ల వాస్తవ పరిస్థితుల ఆధారంగానే రాష్ట్ర బడ్జెట్ రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని కేసీఆర్ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు.

ఆర్థిక మంత్రి హరీశ్ రావు మండలిలో రాష్ట్ర బడ్టెట్ ప్రవేశపెట్టారు.

బడ్జెట్‌లోని ముఖ్యాంశాలు

  • రైతుబంధుకు రూ. 12వేల కోట్లు కేటాయింపు
  • రైతు బీమాకు రూ. 1137 కోట్లు
  • పంటల రుణమాఫీకి రూ. 6 వేల కోట్లు
  • విద్యుత్ సబ్సిడీల కోసం రూ. 8వేల కోట్లు
  • ఆసరా పెన్షన్ల కోసం రూ. 9402 కోట్లు
  • గ్రామ పంచాయతీలకు రూ. 2714 కోట్లు
  • మున్సిపాలిటీలకు రూ. 1764 కోట్లు కేటాయింపు
  • తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన మొదటి ఏడాది నెలకు రూ. 6247 కోట్లు ఖర్చు పెడితే... ప్రస్తుతం రూ. 11305 కోట్లు ఖర్చు జరుగుతోంది.
  • 2018-19 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధిరేటు రెండున్నర రెట్లకు పెరిగి 10.5 శాతంగా నమోదైంది.
  • 2013-14 ఆర్థిక సంవత్సరంలో స్థూల రాష్ట్రీయ దేశీయోత్పత్తి విలువ రూ. 451580 కోట్లు ఉంటే 2018-19 నాటికి రాష్ట్ర సంపద రూ. 865688 కోట్లకు పెరిగింది.

2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.182017 కోట్లను ప్రతిపాదితవ్యయంగా ఓట్-ఆన్-అకౌంట్‌లో ప్రభుత్వం అంచనా వేసింది.

కానీ ఆర్థిక మాంద్యం పరిస్థితుల కారణంగా అన్ని ప్రధాన రంగాలు దేశవ్యాప్తంగా తిరోగమనంలో ఉన్నాయని, ఆదాయాలు పడిపోయాయని కేసీఆర్ అన్నారు.

  • వార్షిక బడ్జెట్: రూ. 1,46,492.30 కోట్లు
  • రెవెన్యూ వ్యయం: రూ. 111,055.84 కోట్లు
  • మూలధన వ్యయం: రూ. 17274.67 కోట్లు
  • మిగులు: రూ. 2044.08 కోట్లు
  • ఆర్థిక లోటు: రూ. 24081 కోట్లు

ఆర్థిక మాంద్యం పరిస్థితులున్నప్పటికీ వ్యవసాయ రంగం, రైతుల జీవితాల్లో వెలుగులు నింపాలనే లక్ష్యంతోనే ప్రస్తుత బడ్జెట్ రూపొందించామని కేసీఆర్ వ్యాఖ్యానించారు. మాంద్యంపై మేధోమథనం చేస్తూ తెలంగాణ ఆర్థిక శాఖ ముందుకు కదులుతోందని కేసీఆర్ అన్నారు.

అన్ని రంగాలకూ 24గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని, వ్యవసాయ రంగంలో 8.1శాతం వృద్ధిరేటు సాధించామని అన్నారు.

పరిశ్రమల రంగంలో 5.8శాతం వృద్ధి, ఐటీ ఎగుమతుల విలువ రూ.1.10 లక్షల కోట్లకు చేరిందని కేసీఆర్ తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)