జైరా వసీం: ఇస్లాంతో, అల్లాతో నా బంధానికి సినీ రంగం ఆటంకంగా మారింది.. అందుకే నటనను వదిలేస్తున్నా

'దంగల్' చిత్రంతో సుపరిచితురాలైన కశ్మీర్‌కు చెందిన నటి జైరా వసీం నటనను వదిలేస్తున్నట్లు చెప్పారు. ఇస్లాం మతంతో తన బంధానికి ఈ వృత్తితో ముప్పుందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.

ఈ వృత్తిలో కొనసాగుతూ చాలా సంఘర్షణను ఎదుర్కొన్నానని, ఈ పోరాటంలో అలసిపోయానని జైరా ఆదివారం ఫేస్‌బుక్‌లో రాసిన ఒక పోస్టులో చెప్పారు.

18 ఏళ్ల జైరా, సినీ పరిశ్రమలో తన పోరాటం గురించి కూడా ప్రస్తావించారు.

జైరా నిర్ణయంపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వ్యక్తమైంది.

సినీ రంగం నుంచి తప్పుకోవడానికి జైరా చెప్పిన కారణాలను చాలా మంది యూజర్లు తప్పుబట్టారు.

జైరా పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వేల మంది కామెంట్ల రూపంలో తమ స్పందన వ్యక్తంచేశారు.

సినీ రంగానికి తాను సరిపోవచ్చని, కానీ తాను ఇక్కడ కొనసాగాలనుకోవడం లేదని ఆమె తన పోస్టులో చెప్పారు.

సినీ రంగం తనకెంతో ప్రేమను, అండను, ప్రశంసలను అందించిందని, కానీ ఇదే రంగం తనను అజ్ఞాన బాటలోకి తీసుకెళ్లిందని, తనకు తెలియకుండానే తాను మత విశ్వాసానికి దూరమైపోయానని జైరా విచారం వ్యక్తంచేశారు. తన మత విశ్వాసాలకు సరిపోని రంగంలో తాను పనిచేస్తూ వచ్చానని, తన మతంతో తన బంధానికి ఈ రంగం ముప్పు కలిగిస్తోందని చెప్పారు.

సినీ రంగం తనకు మనశ్శాంతి లేకుండా చేసిందని, తన విశ్వాసానికి, అల్లాతో తన బంధానికి భంగం కలిగించిందని, సినీ వాతావరణం ప్రభావానికి తాను గురవుతూ వచ్చానని జైరా వివరించారు.

జైరా తన నిర్ణయానికి మతాన్ని కారణంగా చెప్పడాన్ని చాలా మంది ప్రశ్నించారు.

"సినిమాలను వదిలేయాలనే జైరా నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం. కానీ, సినిమాలకు, మతానికి ముడిపెట్టడం సరికాదు" అని ఇంతియాజ్ హుస్సేన్ ట్వీట్ చేశారు.

"మతం ఎప్పుడూ కళలకు, సంస్కృతికి, వినోదానికి అడ్డంకి కాదు. వాటికి మద్దతునిస్తుంది. జైరా వసీం వ్యాఖ్యలు చూస్తే నవ్వొస్తోంది"అని అతికా ఫారూఖీ అనే ట్విటర్ యూజర్ పోస్ట్ చేశారు.

అయితే జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ఇతరులు ఆమెకు మద్దతు పలికారు.

"జైరా వసీం నిర్ణయాలను ప్రశ్నించడానికి మనం ఎవరు? ఇది ఆమె జీవితం, ఆమెకు నచ్చినట్లు చెయ్యొచ్చు. మనం చేయగలిగిందల్లా ఆమెకు మంచి జరగాలని కోరుకోవడమే, ఏ వృత్తిలో ఉన్నా ఆమె ఆనందంగా ఉండాలనుకోవడమే" అని ఒమర్ ట్వీట్ చేశారు.

"తన నమ్మకానికి, కెరియర్‌కు సంబంధించి ఓ 18 ఏళ్ల అమ్మాయి ఓ నిర్ణయానికి వచ్చింది. మీరు ఇలాంటి నిర్ణయం తీసుకోకూడదు, లేదా ఆమె ఇలాంటి నిర్ణయం తీసుకోవాలని మీరు కోరుకోలేదు. కానీ ఇది పూర్తిగా ఆమె వ్యక్తిగత నిర్ణయం. ఆమె కృషికి ధన్యవాదాలు తెలుపుతూ, ఆమెకు శుభాకాంక్షలు చెబుదాం. అంతే" అని కాలమిస్ట్ సదానంద్ ధూమె ట్విటర్లో వ్యాఖ్యానించారు.

జైరా నటించిన చివరి చిత్రం 'ద స్కై ఈజ్ పింక్' ఈ ఏడాది విడుదల కానుంది.

ప్రముఖ నటి ప్రియాంకా చోప్రా, సిద్ధార్థ్ రాయ్ కపూర్, ఇతరులు ఇందులో కనిపించనున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)