అంబేడ్కర్ జయంతి: అణగారిన వర్గాల కోసం అంకితమైన జీవితం

భారత రాజ్యాంగ నిర్మాత, దళిత ఉద్యమ నేత డాక్టర్ బాబాసాహెబ్ భీమ్‌రావ్ రామ్‌జీ అంబేడ్కర్ 128వ జయంతి నేడు.

ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగానికి పితామహుడైన అంబేడ్కర్ ఒక న్యాయవేత్త, ఆధ్యాత్మిక నాయకుడు.

అణగారిన వర్గాల హక్కుల కోసం ఎనలేని కృషి చేసిన ఆయన తన జీవితం, రచనల ద్వారా నేటికీ ఎందరికో స్ఫూర్తినిస్తున్నారు. నేటి భారత రాజకీయాలపైనా ఆయన ప్రభావం ఎంతగానో ఉంది.

నేడు ఆయన జయంతి సందర్భంగా ఆయన ప్రయాణం ఎలా సాగిందో చూద్దాం.

  • 1891 ఏప్రిల్‌ 14న మధ్యప్రదేశ్‌లోని మౌ(ప్రస్తుతం అంబేడ్కర్ నగర్)లో రామ్‌జీ మలోజీ సక్పాల్‌, భీమాబాయిల దంపతులకు అంబేడ్కర్‌ జన్మించారు. ఆయన తండ్రి రామ్‌జీ ఒక మిలిటరీ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు.
  • 1904లో వారి కుటుంబం బొంబాయికి మారింది.
  • 1906లో రామ్‌బాయితో వివాహమైంది. అప్పుడు అంబేడ్కర్‌కు 15 ఏళ్లు, రమాబాయికి తొమ్మిదేళ్లు మాత్రమే. అయితే, పెళ్లి ఆయన చదువుకు అడ్డురాలేదు.
  • 1907లో అంబేడ్కర్ మెట్రిక్యులేషన్‌ పూర్తి చేశారు. ఆ తర్వాత ఏడాది ముంబయిలోని ఎల్ఫిన్‌స్టన్ కళాశాలలో చేరారు. ఆ కళాశాలలో చేరిన తొలి దళిత విద్యార్థి అంబేడ్కర్ మాత్రమే.
  • 1912లో బాంబాయి విశ్వవిద్యాలయం నుంచి ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీ పట్టా అందుకున్నారు. తర్వాత బరోడా రాజ్యంలో ప్రభుత్వం ఉద్యోగం పొందారు.
  • 1913లో బరోడా మహారాజు సాయాజీరావ్ గైక్వాడ్ ప్రభుత్వం ఉపకార వేతనంతో అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్య అభ్యసించేందుకు అంబేడ్కర్ వెళ్లారు. మూడేళ్లపాటు బరోడా ప్రభుత్వం స్కాలర్‌షిప్ ఇచ్చింది.
  • 1913లో ఎంఏ పట్టా అందుకున్నారు.
  • 'భారతదేశంలో కులాలు' అనే అంశంపై 1916లో కొలంబియా విశ్వవిద్యాలయానికి ఒక వ్యాసాన్ని సమర్పించారు. అదే ఏడాది లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌‌లో చేరారు.
  • బరోడా ప్రభుత్వం ఇస్తున్న స్కాలర్‌షిప్ కాలపరిమితి పూర్తవ్వడంతో 1917లో భారత్‌ రావాల్సి వచ్చింది.
  • 1918లో ముంబయిలోని ఒక కళాశాలలో ప్రొఫెసర్‌గా చేరారు. అక్కడ వివక్ష ఎదురైంది.
  • 1920లో ఛత్రపతి షాహు మహరాజ్, కొల్హాపూర్ మహారాజా సాయంతో 'మూక్‌నాయక్‌' అనే వార పత్రికను ప్రారంభించారు.
  • 1923లో బొంబాయి(ముంబయి)లో న్యాయవాదిగా పనిచేయడం ప్రారంభించారు.
  • 1927లో బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యునిగా నామినేట్ అయ్యారు.
  • 1930లో మొదటి రౌండ్‌టేబుల్‌ సమావేశంలో పాల్గొనేందుకు లండన్‌ వెళ్ళారు.
  • 1935 నుంచి 1938 వరకు లా కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేశారు.
  • 1936లో ఇండిపెండెంట్ లేబర్ పార్టీని స్థాపించారు.
  • 1942 నుంచి 1946 వరకు వైస్రాయి కౌన్సిల్‌లో లేబర్ మెంబర్‌గా ఉన్నారు.
  • 1947లో భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. దేశ మొదటి న్యాయశాఖ మంత్రిగా, రాజ్యాంగ ముసాయిదా కమిటీకి ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు.
  • అంబేడ్కర్ నేతృత్వంలో రూపుదిద్దుకున్న భారత రాజ్యాంగం 1950 జనవరి 26 నుంచి అమలులోకి వచ్చింది.
  • 1956 డిసెంబర్‌ 6న దిల్లీలోని అలీపూర్‌ రోడ్డులో ఉన్న నివాసంలో అంబేడ్కర్‌ తుదిశ్వాస విడిచారు.
  • వీపీ సింగ్‌ ప్రభుత్వం 1990లో అంబేడ్కర్‌కు దేశ అత్యున్నత పౌర పురస్కారమైన 'భారత రత్న'ను ప్రకటించింది.

(గమనిక: ఈ కథనంలోని ఫొటోలన్నీ దీక్ష భూమి, నాగ్‌పూర్ అండ్ లోక్వాంగమే పబ్లికేషన్స్ నుంచి సేకరించాం)

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.