You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
నల్లమల: సంపర్కం, ఆవాసం కోసం పులుల మధ్య పోరాటం
- రచయిత, డీఎల్ నరసింహ
- హోదా, బీబీసీ కోసం
అడవుల్లో పెద్దపులులు చాలా భీకరంగా పోట్లాడుకుంటాయి. కొన్నిసార్లు ఏదో ఒకటి చనిపోయేదాకా ఆ పోరు సాగుతుంది. మరి వాటి కొట్లాటకు దారితీసే పరిస్థితులు ఏంటి?
గత నెలలో నాగార్జునసాగర్ - శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలోని ఆత్మకూరు అటవీ డివిజన్ పెచ్చెర్వు సెక్షన్ నరమామిడి చెరువు సమీపంలో ఓ పెద్దపులి కళేబరాన్ని అటవీ శాఖ సిబ్బంది గుర్తించారు.
ఆ పులి దేహంపై ఉన్న గాయాలను పరిశీలించిన ఉన్నతాధికారులు, తనకంటే పెద్దదైన మరో పులి చేసిన దాడిలో అది మృతి చెందిందని నిర్ధారించారు.
వేటగాళ్ల దాడిలోగాని మరే ఇతర కారణాలవల్లగాని చనిపోయిన ఆనవాళ్లు లేవని తెలిపారు.
ఇటీవల రాజస్థాన్లోని రాంతంబోర్ జాతీయ పార్క్లో రెండు పులులు పోట్లాడుకుని చనిపోయాయి.
గతంలో కర్నాటకలోని బండీపూర్, మధ్యప్రదేశ్ కన్హా, ఉత్తరాఖండ్లోని జిమ్ కార్బెట్ జాతీయ పార్కు, ఉత్తర్ప్రదేశ్లోని పిలిభిట్ టైగర్ రిజర్వ్లోనూ ఇలాగే పలు పులులు మరణించాయి.
మరి అభయారణ్యాల్లో పులుల మధ్య ఈ ఘర్షణలకు కారణమేంటని తెలుసుకునే ప్రయత్నం చేసింది బీబీసీ.
"చంపటం లేదంటే చావటం"
అటవీ శాఖ అధికారులు చెప్పిన వివరాల ప్రకారం పులుల మధ్య రెండు విషయాల్లో పోట్లాట జరుగుతుంది.
ఒకటి ఆవాసం కోసం, రెండోది సంపర్కం(సెక్స్) కోసం.
సహజంగా పులులు పుట్టిన తరువాత రెండు నుంచి మూడు సంవత్సరాల వరకే తల్లితో కలిసి ఉంటాయి. ఆ సమయంలో అడవిలో ఎలా జీవించాలి..? ఎలా వేటాడాలి..? తమనుతాము ఎలా రక్షించుకోవాలి? అనేది నేర్చుకుంటాయి.
తరువాత అవి తల్లిని వదిలి సొంతంగా ఆవాసం ఏర్పాటు చేసుకుంటాయి. ఒక్కోసారి అప్పటికే మరోపులి ఏర్పాటు చేసుకున్న ఆవాసంలోకి వెళ్లి ఆక్రమించే ప్రయత్నం చేస్తాయి. ఆసమయంలో రెండింటి మధ్య ఘర్షణ జరుగుతుంది.
"ఆవాసం కోసం పోరాటం"
అడవిలో ఒక్కోపులి తన ఆవాస ప్రాంతాన్ని దాదాపు 40 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించుకుంటుంది. కొన్ని ఇంకా ఎక్కువ ప్రాంతాన్ని తమ పరిధిగా ఏర్పాటు చేసుకుంటాయి.
తన ఆవాస పరిధిలోకి మరో పులి రాకుండా జాగ్రత్త పడుతుంది. వస్తే అడ్డుకుంటుంది. పోరాడుతుంది.
తనకంటే చిన్నది, బలహీనమైనది వస్తే కొన్నిసార్లు చంపుతుంది. అదే తనకంటే బలమైన దానితో ఘర్షణ జరిగితే చనిపోతుంది. లేదంటే పారిపోయి మరోచోట ఆవాసం ఏర్పాటు చేసుకుంటుంది.
"సంపర్కం కోసం పోట్లాట"
సంపర్కం సమయం(మేటింగ్ పీరియడ్)లో కూడా పులుల మధ్య భీకర పోరు జరుగుతుంది.
సంపర్కం కోసం ఒక మగపులి ఐదు లేదా అంతకంటే ఎక్కువ ఆడపులులతో జతకడుతుంది.
ఆడపులి తన శరీరం పునరుత్పత్తికి అనుకూలంగా మారినపుడు కొన్ని ప్రత్యేకమైన చేష్టలు, శబ్దాల ద్వారా తాను సెక్స్కు సిద్ధంగా ఉన్నట్లు మగపులికి సంకేతాలిస్తుంది.
అప్పుడు మగపులి దానితో జతకడుతుంది. పది నుంచి పదిహేను రోజులపాటు ఆ ఆడపులి ఆవాసంలోనే ఉండి సెక్స్లో పాల్గొంటుంది.
ఆ తరువాత సంపర్కానికి సిద్ధంగా ఉన్న తన గుంపులోని మరో ఆడపులి ఆవాసానికి వెలుతుంది.
ఈ విధంగా ఒక మగపులి తన గుంపులోని ఆడపులులతో ప్రత్యేకమైన అనుబంధం కలిగి ఉంటుంది.
వీటితో కలిసేందుకు ఇతర మగ పులులు ప్రయత్నిస్తే వాటిని అడ్డుకుంటుంది, పోరాడుతుంది. ఆ పోట్లాటలో కొన్నిసార్లు ప్రాణాలు కూడా కోల్పోతాయి.
ఆడపులులు కూడా తమ గుంపులోని మగపులితోనే సంపర్కంలో పాల్గొంటాయి. ఏదైనా ఇతర మగపులి తమ ఆవాసంలోకి వచ్చి సంపర్కం కోసం ప్రయత్నిస్తే ప్రతిఘటిస్తాయి.
ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో సహకరించాల్సి వస్తే దానివల్ల పిల్లలు పుట్టకుండా ఉండేలాగా జాగ్రత్తపడతాయి.
"మలం, మూత్రంతో ఆవాసానికి హద్దులు"
పులులు తమ ఆవాసానికి హద్దులు ఏర్పాటు చేసుకుంటాయి. అందుకోసం ప్రత్యేకమైన పద్ధతులను పాటిస్తాయి.
హద్దులో ఉన్న చెట్లపొదలపైన మూత్రాన్ని చిమ్ముతాయి.
నేలపై అక్కడక్కడా మలవిసర్జన చేస్తాయి. వాటి వాసన బట్టి అది సరిహద్దు అని ఇతర పులులు తేలికగా గుర్తించగలుగుతాయి.
అలాగే చెట్ల బెరడుపై గోర్లతో గీకి గుర్తులు పెట్టుకుంటాయి. పాదముద్రలు పడేలా తన ఆవాసం చుట్టూ తిరిగి సరిహద్దులను ఏర్పాటు చేసుకుంటాయి.
ఇలా ఒకపులి ఏర్పాటు చేసుకున్న హద్దు దాటి మరోపులి వెళ్లదు.
ఒకవేళ ఆక్రమించుకునేందుకు లోనికి వస్తే అప్పుడు ఆ రెండింటి మధ్య పోరాటం జరుగుతుంది.
కొన్నిచోట్ల పులుల సంఖ్యకు తగ్గట్టుగా అడవుల విస్తీర్ణం లేకపోవడం కూడా ఇలాంటి ఘర్షణలకు ఓ కారణమన్న అభిప్రాయం ఉంది.
కొట్లాటలు సహజమే...
పెద్దపులుల మధ్య పోట్లాటలు సహజమేనని కర్నూలు జిల్లా ఆత్మకూరు డీఎఫ్ఓ వెంకటేష్ సంబంగి తెలిపారు.
"ఈ పోట్లాటలో ఏదైనా పులి చనిపోతే దానికి ఎన్టీసీఏ నిబంధనల ప్రకారం పంచనామా, శవపరీక్ష నిర్వహించి ఆ తరువాత ఖననం చేస్తాం. దానిపై ఓ నివేదికను రూపొందించి ఉన్నతాధికారులకు పంపిస్తాం" అని ఆయన చెప్పారు.
"పులుల రక్షణ కోసం అవి నివసించే కోర్ ఏరియా, సంచరించే అవకాశమున్న బఫర్ ఏరియాలలో తాగునీటి సౌకర్యం కల్పిస్తాం. చెట్లను పెంచటం, వేటగాళ్ళను అడవిలోకి వెళ్లకుండా చూడటం ఇతర వన్యప్రాణుల సాంద్రతను పెంచటం ద్వారా పులులకు ఆహారాన్ని కల్పిస్తాం" అని వెంకటేష్ వివరించారు.
నాగార్జునసాగర్ - శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలో రాత్రింబవళ్ళు అటవీ సిబ్బంది విధులు నిర్వహిస్తుండటం వల్ల వేటగాళ్ల నుంచి పులులకు రక్షణ దొరుకుతోందని తెలిపారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)