You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
#CWG2018 పీవీ సింధు.. పతకం తెస్తుందా?
- రచయిత, రెహాన్ ఫజల్
- హోదా, గోల్డ్ కోస్ట్ నుంచి
మరికొద్ది నిమిషాల్లో గోల్డ్ కోస్ట్లో కామన్వెల్త్ క్రీడలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ క్రీడాకారుల విజయావకాశాలపై బీబీసీ అందిస్తున్న ప్రత్యేక కథనం.
గ్లాస్గో కామన్ వెల్త్ గేమ్స్లో భారత్ అంచనాలకు అనుగుణంగా రాణించలేకపోయి ఉండవచ్చు. కానీ, ఈసారి గోల్డ్ కోస్ట్ గేమ్స్ లో మాత్రం అద్భుత విజయాలు సాధించాలనే కృత నిశ్చయంతో ఉన్నారు భారతీయ అథ్లెట్లు.
షూటింగ్ విభాగంలో భారతీయ క్రీడాకారులు ఎక్కువ పతకాలు సాధించే అవకాశం ఉంది.
మను భకేర్, మేహూలి ఘోష్,లు ఈ మధ్య కాలంలో జరిగిన అంతర్జాతీయ పోటీలలో పతకాలు సాధించారు.
"గత కామన్ వెల్త్ గేమ్స్ కన్నా ఈసారి షూటింగ్ లో భారత్ ఎక్కువ పతకాలు సాధిస్తుందనే నమ్మకం ఉంది. ఎందుకంటే మన షూటర్లు అందరూ అద్భుతమైన ఫామ్ లో ఉన్నారు. ఈ మధ్య జరిగిన వరల్డ్ షూటింగ్ ఛాంపియన్ షిప్ లో వారు అద్భుతంగా రాణించారు. పురుషులే కాదు మహిళల జట్టు కూడా బాగా ఆడాలనే తపనతో ముందుకు వెళ్తోంది. షూటింగ్ ఈవెంట్లలో కనీసం ఒక్క పతకమైనా భారత్ సాధిస్తుందని అనుకుంటున్నా" అని భారత షెఫ్-డి-మిషన్ (ఇంచార్జి) విక్రమ్ సిసోడియా అన్నారు.
ఇక భారత్ కు కచ్చితంగా పతకం వస్తుందనుకునే విభాగాలలో బాడ్మింటన్ ఒకటి.
వరల్డ్ నెంబర్-త్రీ పీవీ సింధు, సైనా నెహ్వాల్ బంగారు పతకం సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు.
"దేశం మొత్తం బాడ్మింటన్ లో పతకం సాధిస్తామనే నమ్మకంతో ఉంది. పీవీ సింధు, సైనా నెహ్వాల్, పురుషులలో శ్రీకాంత్ , ప్రణయ్ లకు పతకాలు సాధించే సత్తా ఉంది. డబుల్స్, మిక్సెడ్ డబుల్స్ ఈవెంట్లలో మన జట్లు చాలా బలంగా ఉన్నాయి" భారత షెఫ్-డి-మిషన్ (ఇంచార్జి) విక్రమ్ సిసోడియా విశ్లేషించారు.
బాక్సింగ్ లో కూడా పతకం సాధించే సత్తా మన అథ్లెట్లలో ఉంది.
ముఖ్యంగా వికాస్ కృష్ణన్, మేరీ కోమ్, మనీష్ కౌశిక్ లు మంచి ఫామ్ లో ఉన్నారు.
భారత్ హాకీ టీం నుంచి స్టార్ ప్లేయర్లు సర్దార్ సింగ్, రమణ్ దీప్ సింగ్ లను తొలగించారు.
కొత్త కోచ్ ఆధ్వర్యంలో ఒక సమతూకం కలిగిన జట్టుకు మన్ ప్రీత్ సింగ్ నాయకత్వం వహిస్తారు.
తమ మొదటి మ్యాచ్ లోనే చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ను భారత్ ఢీకొంటుంది.
అయితే పసిడి పతకం కోసం జరిగే పోటీలో భారత్, ఆస్ట్రేలియా వంటి హేమాహేమీ జట్లను దాటి వెళ్లాల్సి ఉంటుంది.
ఇక భారత్ రెస్లర్లు ఏప్రిల్ తొమ్మిది నాటికి గోల్డ్ కోస్ట్ చేరుకుంటారు.
ఈ పోటీలలో ఉన్న పన్నెండు పతకాలతో కనీసం ఏడింటిని గెలవడానికి భారత్ కుస్తీ వీరులు కసరత్తు చేస్తున్నారు.
సుశీల్ కుమార్, వినేష్ ఫోగట్, బబిత ఫోగట్, సాక్షి మాలిక్ లు భారత్ రెస్లర్ల కు నాయకత్వం వహిస్తారు.
అథ్లెటిక్స్ లో.. జావెలిన్ త్రోవర్ నీరజ్ చోప్రా, హై జంపర్ అర్విందర్ సింగ్ ల పై కూడా భారత్ ఆశలు పెట్టుకుంది.
అయితే, కొంతమంది ఇతర అథ్లెట్లు కూడా పతకం సాధించే సత్తా ఉన్న వారే.
"నేను 2012 లో లండన్ ఒలింపిక్స్ లో పాల్గొన్నాను. ఆ పోటీలలో నేను పదో స్థానంలో నిలిచాను. అలాగే జాతీయ రికార్డు కూడా బద్దలుకొట్టాను. అదే టైమింగ్ ఇక్కడ కొనసాగిస్తే, సునాయాసంగా మెడల్ సాధించగలను" అని 20 కిమీ నడకలో పోటీ పడుతున్న ఇర్ఫాన్ సోడి అన్నారు.
లాంగ్ జంపర్ నైనా జేమ్స్ మాట్లాడుతూ "ఇవి నా మొదటి కామన్ వెల్త్ పోటీలు. ఇండియాకు పతకం సాధించాలనుకుంటున్నాను" అన్నారు.
29 హెక్టార్లలో కామన్ వెల్త్ గేమ్స్ విలేజ్ నిర్మించారు. ఇక్కడ 1257 ఫ్లాట్ లు ఉన్నాయి.
రాబోయే రెండు వారాలలో 6500 మంది అథ్లెట్లు ఇక్కడే ఉండబోతున్నారు.
గ్లాస్గో గేమ్స్ లో భారత్ పదిహేను గోల్డ్ మెడల్స్ సాధించి పతకాల పట్టికలో ఐదవ స్థానంలో నిలిచింది. ఈసారి ఎన్ని పతకాలు సాధిస్తుందో చూడాలి.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)