You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ట్రంప్: మాకు మద్దతు ఇస్తేనే పాలస్తీనాకు నిధులు
శాంతి ప్రక్రియకు పాలస్తీనా సహకరించడం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు.
ఇలా అయితే ఆర్థిక సహాయాన్ని నిలిపి వేసే అంశాన్ని పరిశీలిస్తామని ఆ దేశాన్ని హెచ్చరించారు.
ఇటీవల పాకిస్తాన్కు ఆర్థిక సహాయం నిలిపివేసిన అమెరికా తాజాగా పాలస్తీనాను హెచ్చరించడం కీలక పరిణామంగా భావించవచ్చు.
పాకిస్తాన్, పాలస్తీనా వంటి దేశాలకు తాము ఏటా వేల కోట్ల రూపాయలు ఇస్తుంటే ఆ దేశాలు మాత్రం తమను మోసం చేస్తూ, అబద్ధాలు చెబుతున్నాయని ట్రంప్ ఆరోపించారు.
"పాకిస్తాన్కు మాత్రమే కాదు మరెన్నో దేశాలకు మేం వేల కోట్ల రూపాయలు ఉదారంగా ఇస్తున్నాం. వీటిలో పాలస్తీనా కూడా ఒకటి. కానీ వారు మా నిర్ణయాలను గౌరవించరు. మా విధానాలను మెచ్చుకోరు. పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య శాంతిని నెలకొల్పాలని ఎప్పటి నుంచో పోరాడుతున్నాం. మా ప్రయత్నాలకు పాలస్తీనా ఏ రకంగానూ సహకరించడం లేదు. అలాంటప్పుడు ఆ దేశానికి మేం ఎందుకు సహాయం చేయాలి?" అని ట్రంప్ ట్వీట్ చేశారు.
నిధులు నిలిపేస్తాం
ఐక్యరాజ్య సమితి (యూఎన్) శరణార్థుల విభాగానికి నిధులు నిలిపివేస్తామని యూఎన్లో అమెరికా రాయబారి నిక్కీ హెలీ అన్నారు.
పాలస్తీనా శరణార్థులకు విద్య, వైద్యం వంటి అవసరాలకు యూఎన్ నుంచి నిధులు అందుతున్నాయి. 2016లో దాదాపు 370 మిలియన్ డాలర్లు అమెరికా సహాయం చేసింది.
"పాలస్తీనా శాంతి చర్చలకు సహకరించేంత వరకు వారికి ఆర్థిక సహాయం చేయకూడదని అధ్యక్షుడు ప్రాథమికంగా నిర్ణయించారు" అని విలేకరుల సమావేశంలో నిక్కీ తెలిపారు.
ఇజ్రాయెల్ రాజధానిగా జెరూసలెంను గుర్తించాలన్న అమెరికా తీర్మానాన్ని యూఎన్ వ్యతిరేకించడం మంచిది కాదని ఆమె అన్నారు.
"శాంతి చర్చలకు రాకుండా పాలస్తీనా మమ్మల్ని సహాయం అడుగుతోంది. వారు చర్చలకు వస్తేనే సహాయం చేస్తాం" అని నిక్కీ తెలిపారు.
అమెరికా సహాయం నిలిపివేస్తే యూఎన్ కార్యకలాపాలపై ఇది ఎంతో ప్రభావం చూపే అవకాశం ఉంది. యూఎన్కు దాదాపు 30 శాతం నిధులను అమెరికానే సమకూరుస్తోంది.
మా ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)