టైటాన్ సబ్‌మెర్సిబుల్ శకలాలలో మృతదేహాల భాగాలు - ఎవరివో స్పష్టం చేయని అధికారులు

సముద్ర గర్భంలో పేలిపోయిన టైటాన్ సబ్‌మెర్సిబుల్ శకలాలను ఒడ్డుకు తీసుకురాగలిగారు.

ఏళ్ల కిందట మునిగిపోయిన టైటానిక్ షిప్ శిథిలాలను చూసేందుకు టైటాన్ సబ్‌మెర్సిబుల్‌లో ఐదుగురు వ్యక్తులు సముద్ర గర్భంలోకి వెళ్లి ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.

టైటాన్ సబ్‌కు చెందిన కొన్ని భాగాలను బుధవారం కెనడాలోని సెయింట్ జోన్స్‌ తీరానికి తీసుకొచ్చారు.

ఇప్పటి వరకు ఏ ఏ భాగాలు దొరికాయి? వాటిలో ఏముంది? దర్యాప్తు ఎలా సాగుతోంది.. ఈ వివరాలన్నీ ఇప్పుడు చూద్దాం.

ఏ ఏ శకలాలు దొరికాయి?

టైటాన్ శకలాల్లో ఏముందన్నది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది.

టైటాన్‌ శకలాల్లో మృతుల శరీర అవశేషాలు ఉన్నట్లు అనిపిస్తోందని అమెరికా కోస్ట్‌గార్డ్ తెలిపింది.

అయితే, అవేంటో స్పష్టంగా చెప్పలేదు. వైద్య నిపుణులు వాటిని విశ్లేషిస్తారని మాత్రం చెప్పారు.

తదుపరి పరిశీలన కోసం టైటాన్ భాగాలను అమెరికాలోని ఒక పోర్టుకు తరలిస్తున్నారు.

వీటిని అధ్యయనం చేస్తే టైటాన్ ప్రమాదం ఎలా జరిగిందో తెలిసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

దర్యాప్తు ఎలా సాగుతోంది?

టైటాన్ ప్రమాదంపై దర్యాప్తు ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది.

ప్రమాదానికి అసలు కారణాలు తెలుసుకునేందుకు ఇంకా చాలా అధ్యయనం చేయాల్సి ఉందని మెరైన్ బోర్డ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారి కెప్టెన్ జాసన్ న్యూబాయెర్ చెప్పారు.

ఏం జరిగిందన్నది తెలిస్తే మరోసారి ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా చూసేందుకు వీలుంటుందని ఆయన అన్నారు.

అసలేం జరిగింది?

సుమారు 12,500 అడుగుల లోతులో ఉన్న టైటానిక్ నౌక శిథిలాలను చూసేందుకు జూన్ 18న ఐదుగురు వ్యక్తులు టైటాన్ సబ్‌మెరైన్‌లో సముద్ర గర్భంలోకి వెళ్లారు.

గంటన్నర తర్వాత టైటాన్‌తో కమ్యూనికేషన్ తెగిపోయింది. టైటాన్ పేలిపోయిందని, అందులో ఉన్న ఐదుగురు చనిపోయారని ఆ తర్వాత కోస్ట్ గార్డ్ అధికారులు ప్రకటించారు.

టైటానిక్ ఓడ ముందు భాగానికి 487 మీటర్ల దూరంలో టైటాన్‌కు చెందిన శకలాలను గుర్తించారు. వాటిలో కొన్నింటిని బుధవారం తీరానికి తీసుకొచ్చారు.

ఇవి కూడా చదవండి: