ధన్యవాదాలు
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆంధ్రప్రదేశ్లో సామాజిక పింఛన్ల పంపిణీ మొదలైంది. వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ కుదరదని ఈసీ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది.
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.
బాక్సర్ విజేందర్ సింగ్ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి, బీజేపీలో చేరారు.
దిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో విజేందర్ సింగ్కు కండువా కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు బీజేపీ నేతలు.
‘‘ఇవాళ నేను బీజేపీలో చేరుతున్నాను. సొంతింట్లోకి వస్తున్నట్లు ఈ రోజు నాకు అనిపించింది. క్రీడాకారులకు దేశంలో, విదేశాల్లో గౌరవం పెరుగుతుంది. బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి, ఎక్కడికైనా మేం తేలిగ్గా వెళ్లగలుగుతున్నాం. మేం అందుకుంటున్న గౌరవానికి క్రీడాకారులం ఎంతో కృతజ్ఞత తెలియజేస్తున్నాం. నేను అంతకుముందున్న విజేందర్ సింగ్నే. తప్పు అయితే తప్పని, ఒప్పు అయితే ఒప్పని చెబుతాను’’ అని బీజేపీలో చేరిన తర్వాత విజేందర్ అన్నారు.
ఆయన 2019 లోక్సభ ఎన్నికల్లో దక్షిణ దిల్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి, ఓడిపోయారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కూడా విజేందర్ పాల్గొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీని, బీజేపీని ఆయన అప్పట్లో విమర్శించారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వయనాడ్ లో నామినేషన్ దాఖలు చేశారు.
అంతకు ముందు ఆయన వయనాడ్లో రోడ్షో నిర్వహించారు.
వయనాడ్ ప్రజలు తనను సొంత మనిషిలా చూసుకుని ప్రేమను పంచారని చెప్పారు.
వారి ప్రేమను మరిచిపోలేనని, ఇది ఎన్నికల కోసం చెబుతున్న మాట కాదన్నారు.
రాహుల్ గాంధీతోపాటు ఆయన సోదరి ప్రియాంక గాంధీ, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, దీపాదాస్ మున్షి, కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వీడీ సతీశన్, కేపీసీసీ తాత్కాలిక అధ్యక్షుడు ఎం.ఎం. హసన్ ఉన్నారు.
మరోపక్క సీపీఐ అభ్యర్థి అన్నే రాజా కూడా వయనాడ్లో నామినేషన్ దాఖలు చేశారు.
ఇండియా కూటమిలో కాంగ్రెస్, సీపీఐ భాగస్వాములే అయినప్పటికీ కేరళలో మాత్రం ఆ రెండు పార్టీలు ముఖాముఖి తలపడుతున్నాయి.
ఇరుపక్షాలు బలమైన అభ్యర్థులను బరిలోకి దింపాయి.
2019 ఎన్నికలలో రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి 64.94 శాతం ఓట్లతో 4.31 లక్షల మెజార్టీతో గెలిచారు.
తాజా పార్లమెంట్ ఎలక్షన్స్లోనూ ఆయన వయనాడ్ నుంచే పోటీ చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో సామాజిక పెన్షన్ల పంపిణీ మొదలైంది.
సచివాలయాల వద్ద లబ్దిదారులకు పెన్షన్లు అందిస్తున్నారు.
వలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ కుదరదని ఈసీ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని కోరుతూ కొందరు ఏపీ హైకోర్టుని ఆశ్రయించారు.
దీనిపై స్పందించిన కోర్టు వాలంటీర్ల వ్యవస్థ లేని ఇతర రాష్ట్రాలలో కూడా పెన్షన్లు పంపిణీ అవుతున్న విషయాన్ని గుర్తుచేస్తూ ఈ పిటిషన్కు విచారణార్హత లేదని కొట్టివేసింది.
వలంటీర్లపై వచ్చిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకునే ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఇచ్చిందని కోర్టు అభిప్రాయపడింది.
ప్రభుత్వ కార్యాలయాల వద్ద గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది పెన్షన్లు పంపిణీ చేస్తారని, అక్కడకు రాలేని వారికి, వారి ఇంటికే వెళ్ళిపెన్షన్లు అందించాలని ఈసీ ఆదేశాలు ఇచ్చిన సంగతిని హైకోర్టు గుర్తుచేసింది.
ఈమేరకు ప్రభుత్వం కూడా ఉత్తర్వులు జారీచేసిందని చెబుతూ, పెన్షన్ల పంపిణీలో ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ పిల్ ని కొట్టివేసింది.
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో భద్రతాదళాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇప్పటిదాకా మొత్తం 13 మంది మావోయిస్టుల మృతదేహాలను గుర్తించినట్టు అధికారులు పేర్కొన్నట్టు ఏఎన్ఐ వార్తా సంస్థ బుధవారం తెలిపింది.
‘‘బీజాపూర్ జిల్లాలో కర్చోలీ ప్రాంతంలో ఎదురుకాల్పులు జరిగాకా మొత్తం 13 మంది మావోయిస్టుల మృతదేహాలను గుర్తించాం. వీరిలో 10మంది పురుషులు, ముగ్గురు మహిళా మావోయిస్టులు ఉన్నారు’’ అని అధికారులు తెలిపారు.
మంగళవారం 10 మంది మావోల మృతదేహాలు లభించగా, బుధవారం ఉదయం మరో మూడు మృతదేహాలను అధికారులు కనుగొన్నారు.
బీజాపూర్ జిల్లా బస్తర్ లోక్సభ పరిధిలోకి వస్తుంది. ఏప్రిల్ 19న ఇక్కడ పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి.
తైవాన్ తూర్పు తీరంలో బుధవారం 7.4 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ తీవ్రత కారణంగా తైవాన్తో పాటు పొరుగు దేశాల్లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు.
తైవాన్లోని హువాలిన్ నగరానికి దక్షిణాన 18 కి.మీల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది.
గత 25 ఏళ్లలో తైవాన్లో వచ్చిన భారీ భూకంపం ఇదేనని అధికారులు చెప్పారు.
జపాన్ నైరుతి తీరంలోని ప్రాంతాల్లో 3 మీటర్ల ఎత్తు వరకు సునామీ అలలు వచ్చే ప్రమాదం ఉన్నట్లు జపాన్ వాతావరణ శాఖ పేర్కొంది.
ఫిలిప్పీన్స్ భూకంప హెచ్చరికల కేంద్రం కూడా సునామీ హెచ్చరికలను జారీ చేసింది.
ఫుజియాన్ ప్రావిన్సులోని కొన్ని భాగాల్లోనూ భూప్రకంపనలు వచ్చినట్లు చైనా ప్రభుత్వ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
1999 సెప్టెంబర్ నెలలో తైవాన్లో 7.6 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా 2,400 మంది ప్రజలు చనిపోయారు. 5 వేల భవనాలు ధ్వంసం అయ్యాయి.
స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 7:58 గంటలకు భూమికి 15.5 కి.మీ లోతులో భూకంపం సంభవించింది. ఆ తర్వాత 4 తీవ్రతతో 9సార్లపై పైగా భూమి కంపించింది.
జపాన్ ప్రభుత్వ మీడియా ప్రకారం, సునామీ ఉదయం 9:30 గంటలకు సమీపంలోని ఇరియోమోరట్, ఇషిగాకి ద్వీపాలను తాకుతుందని, 10 గంటలకు మియాకోజిమా, ఓకినావా ముఖ్య ద్వీపాలకు చేరుకుంటుందని అంచనా.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం ఈపేజీని ఫాలో అవ్వండి.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్ను క్లిక్ చేయండి.