ధన్యవాదాలు
బీబీసీ తెలుగు లైవ్ పేజీ అప్డేట్స్ ఇంతటితో సమాప్తం.
రేపు ఉదయం మళ్లీ కలుద్దాం
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు సంజయ్ సింగ్ ఆధ్వర్యంలోని ఫెడరేషన్ నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్నందుకు క్రీడా శాఖ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.
బీబీసీ తెలుగు లైవ్ పేజీ అప్డేట్స్ ఇంతటితో సమాప్తం.
రేపు ఉదయం మళ్లీ కలుద్దాం
క్రికెట్ ఆడుతుండగా తలెత్తిన వివాదంలో 14 ఏళ్ల బాలుడు మృతిచెందాడు.
నెల్లూరులోని జాకీర్ హుస్సేన్నగర్లో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది.
ఆటలో గొడవ తలెత్తి బాధిత బాలుడిని మరో బాలుడు గొంతు, గుండెపై కొట్టడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
తీవ్రంగా గాయపడిన బాలుడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
మృతి చెందిన బాలుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
మధ్యప్రదేశ్లోని రత్లాంలో తమ్ముడి భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు బావ. ఘటనలో ఆమె చనిపోయారని, నిందితుడిని అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పారు.
కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అందులో చావు బతుకుల్లో ఉన్న మహిళ సాయం కోసం వేడుకోవడం కనిపిస్తోంది.
అయితే ఆమెను కాపాడేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఆమె మంటల్లో కాలుతుంటే వీడియో తీశారు అక్కడున్నవారు.
అసలేం జరిగింది?
నిర్మలా బలాయ్ను ఆమె బావ సురేశ్ బలాయ్ రాడ్తో కొట్టాడని, అనంతరం ఆమె శరీరంపై పెట్రోల్ పోసి తగులబెట్టాడని రత్లాం ఎస్పీ రాహుల్ కుమార్ లోధా విలేకరులతో చెప్పారు.
సురేశ్ తమ్ముడి భార్య నిర్మల. కొద్ది రోజుల క్రితమే ఆమె భర్త ఆత్మహత్య చేసుకున్నారు.
అయితే, నిర్మల వల్లే తన తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నట్లు సురేశ్ భావించారని పోలీసులు తెలిపారు.
నిర్మల క్యారెక్టర్ మంచిది కాదంటూ సురేశ్ ఆరోపించేవారని స్థానికులు చెబుతున్నారు.
ఆమెతో సురేశ్ రోజూ గొడవపడేవాడని తెలిపారు.
హత్య సమయంలో స్థానికులు తీసిన వీడియోలో నిర్మల నొప్పితో సాయం కోసం అర్థించడం కనిపించింది.
ఆ సమయంలో సురేశ్ చేతిలో రాడ్డు పట్టుకొని ఉన్నాడు. దీంతో, ఎవరూ ముందుకు రాలేదు.
చనిపోయిన నిర్మలకు ఇద్దరు పిల్లలున్నారు.
భారత క్రికెట్లో మరో ప్రీమియల్ లీగ్ మొదలుకానుంది.
'ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్' పేరుతో పిలుస్తున్న ఈ లీగ్లో దేశవ్యాప్తంగా పలు జట్లు పాల్గొనున్నాయి.
ఈ లీగ్లోని హైదరాబాద్ జట్టును కొనుగోలు చేసినట్లు సినీ హీరో రామ్చరణ్ తేజ్ ఎక్స్(ట్విటర్) వేదికగా ఆదివారం ప్రకటించారు.
ఈ టోర్నీలో గ్రౌండ్ లెవల్ నుంచి క్రికెటర్లను గుర్తించి అంతర్జాతీయ స్థాయికి పంపడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
టెన్నిస్ బాల్తో ఆడే ఈ ఆటలో పది ఓవర్లు ఉంటాయి. పోటీలో పాల్గొనాలనుకొనే ఔత్సాహిక ఆటగాళ్లు http://ispl-t10.com వెబ్సైట్లో తమ వివరాలు నమోదు చేసుకోవాల్సిందిగా రామ్చరణ్ కోరారు.
ఆస్ట్రేలియాతో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్లో భారత మహిళల జట్టు విజయం సాధించింది. ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు 8 వికెట్ల తేడాతో గెలిచింది.
ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్లో 219 పరుగులు చేయగా, బదులుగా భారత్ 406 పరుగులు చేసింది. దీంతో భారత్కు 187 పరుగుల ఆధిక్యం లభించింది. అయితే రెండో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 261 పరుగులు చేసి భారత్ ముందు 75 పరుగల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది.
ఈ లక్ష్యాన్ని భారత మహిళల జట్టు కేవలం 2 వికెట్లు కోల్పోయి సాధించింది. స్మృతి మంథాన 61 బంతుల్లో 35 పరుగులు చేసి నాటాట్గా నిలిచింది. లక్ష్యాన్ని చేధించే క్రమంలో షెఫాలీ వర్మ 4 పరుగులకే వెనుదిరిగింది. దీంతో నాలుగు పరుగులకే భారత్ ఒక వికెట్ను కోల్పోయింది.
వన్డౌన్లో వచ్చిన రిచాఘోష్ కూడా 13 పరుగులు మాత్రమే చేసినా, మంథానకు మంచి సహకారం అందించింది. వీరిద్దరూ రెండో వికెట్ కు 51 పరుగల భాగస్వామ్యాన్ని అందించారు.
ఆస్ట్రేలియా బౌలర్లలో కిమ్ గర్త్ 1 వికెట్, గార్డనర్ 1 వికెట్ తీశారు. మొత్తం 7 వికెట్లు తీసిన భారత బౌలర్ స్నేహా రాణా మ్యాన్ ఆప్ ది మ్యాచ్గా నిలిచింది. కిందటివారం నవీముంబాయిలో ఇంగ్లండ్తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో కూడా భారత్ 347 పరుగుల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే.
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రం అబద్ధాలపుట్ట అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు విమర్శించారు. ఆదివారం ఉదయం తెలంగాణ భవన్లో తమ ఆరున్నరేళ్ళ పాలనలో (కరోనా కాలం రెండేళ్ళు, కొత్త రాష్ట్రం కుదురుకోవడానికి తీసుకున్న సమయాన్ని తీసివేసి తాము పాలించింది ఆరున్నర సంవత్సరాలే అని కేటీఆర్ చెప్పారు) సాధించిన ప్రగతిని, చేసిన అప్పుల వివరాలు ఇవీ అంటూ స్వేదపత్రం రూపంలో వివరించారు.
కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం రూ. 6,71,757 కోట్లు అప్పులు చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడాన్ని ఆయన ఖండించారు. తమ పాలనలో కేవలం రూ. 3,17,015 కోట్లు మాత్రమే అప్పులు చేశామన్నారు.
ఇందులో తెలంగాణ ఏర్పడే నాటికి అప్పటి ప్రభుత్వం చేసిన 72,658 కోట్ల రూపాయలు కూడా ఉన్నాయన్నారు.
ఎఫ్ఆర్ఎంబి పరిమితి మేరకు అప్పులు చేశామని కేటీఆర్ చెప్పారు. తెలంగాణను అన్నిరంగాలలోనూ అభివృద్ధి చేశామంటూ కేటీఆర్ పవర్పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.
ఆర్టీసీ, సివిల్ సప్లైస్, విద్యుత్ రంగాలలోని పరిస్థితులను ఆయన వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బట్టకాల్చి మీద వేసే పని చేస్తోందని విమర్శించారు.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు కొత్త ఎన్నికైన కార్యవర్గాన్ని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ సస్పెండ్ చేసినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ నిర్ణయం అమలులో ఉంటుందని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.
కొత్త కార్యవర్గంతోపాటు, అది ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలు కూడా రద్దవుతాయని కేంద్రం ప్రకటించింది.
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల రెజ్లర్లు బజరంగ్ పునియా, వినేశ్ ఫోగట్లు సంతోషం వ్యక్తం చేశారు. ఓ ప్రైవేట్ చానెల్తో మాట్లాడుతూ ‘ఇది శుభవార్త’ అని వినేశ్ ఫోగట్ అన్నారు.
కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు సంజయ్ సింగ్ ఆధ్వర్యంలోని ఫెడరేషన్ అండర్ 15, అండర్ 20 నేషనల్ టోర్నీ ప్రకటించడం పై ఆగ్రహం వ్యక్తం చేసిన క్రీడా శాఖ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ జట్లు ఈ ఏడాది చివర్లో ఉత్తర ప్రదేశ్లోని నందిని నగర్లో జరగనున్న ఈ టోర్నిలో ఆడాల్సి ఉంది.
ఎన్నికైన వెంటనే రెజ్లింగ్ ఫెడరేషన్ కొత్త కార్యవర్గం టోర్నీని ఉత్తర ప్రదేశ్ గోండాలో టోర్నీ నిర్వహించాలని నిర్ణయించింది. ఇది ఫెడరేషన్ రాజ్యాంగానికి విరుద్ధమని, ఫెడరేషన్ ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకుందని మంత్రిత్వ శాఖ భావించినట్లు ఇండియా టుడే వెబ్ సైట్ ఒక కథనంలో పేర్కొంది.
క్రీడాకారులు పోటీలలో పాల్గొనేందుకు కనీసం 15 రోజుల గడువు ఇవ్వాలన్న ప్రోటోకాల్ను ఫెడరేషన్ పట్టించుకోనందుకు క్రీడాశాఖ ఆగ్రహించినట్లు ఇండియా టుడే కథనం పేర్కొంది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన శ్వేతపత్రానికి ప్రతిగా ‘స్వేదపత్రం’ పేరుతో బీఆర్ఎస్ పార్టీ ఆదివారంనాడు ఒక పవర్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల ఆర్థిక, ఇంధన రంగాలపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసింది. అయితే ఈ శ్వేతపత్రం తప్పుల తడకని, అబద్ధాలను నిజాలుగా నమ్మించేందుకు ప్రయత్నించారని కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ పార్టీ విమర్శలు చేసింది.
స్వేదపత్రంలో తమ పార్టీ గత తొమ్మిదిన్నరేళ్ళ పాలనలో తెలంగాణలో సాధించిన ప్రగతిని గురించి వివరిస్తామని ఆ పార్టీ నేత కేటీఆర్ అన్నారు.
నిజానికి ఈ కార్యక్రమం శనివారమే జరగాల్సి ఉన్నప్పటికీ ఆదివారానికి వాయిదా వేశారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.