ధన్యవాదాలు
బీబీసీ తెలుగు లైవ్ పేజ్ ఇంతటితో సమాప్తం. మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం....గుడ్ నైట్
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఇప్పటి వరకు మృతి చెందిన వారిలో వేలాదిచిన్నారులు కూడా ఉన్నారని గాజాలో పనిచేస్తున్న ఐక్యరాజ్యసమితి సహాయక ఏజెన్సీ తెలిపింది.
బీబీసీ తెలుగు లైవ్ పేజ్ ఇంతటితో సమాప్తం. మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం....గుడ్ నైట్
ఇజ్రాయెల్ బాంబుల వర్షం కారణంగా అక్టోబరు 7 నుంచి గాజాలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉందని, తాజాగా ఈ సంఖ్య 10,222కి చేరుకుందని హమాస్ నేతృత్వంలోని ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
గాజాలో ఆదివారం రాత్రి ఇజ్రాయెలీ దళాలు భారీ ఎత్తున వైమానిక దాడులు చేశాయి. హమాస్ మిలటరీ కాంపౌండ్ సహా అనేక వందల లక్ష్యాలను ధ్వంసం చేసినట్టు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.
ఈ దాడుల్లో రెండు వందలమంది మృత్యువాతపడ్డారని గాజాలోని అతిపెద్ద ఆస్పత్రి డైరక్టర్ అంతకుముందు బీబీసీకి చెప్పారు.
ఇప్పటి వరకు మృతి చెందిన వారిలో వేలాదిచిన్నారులు కూడా ఉన్నారని గాజాలో పనిచేస్తున్న ఐక్యరాజ్యసమితి సహాయక ఏజెన్సీ తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ సంఖ్యను నమ్మదగినివిగా చెప్పింది.
గాజాలో ఇతర ప్రభుత్వ శాఖల్లానే ఆరోగ్య మంత్రిత్వశాఖ కూడా హమాస్ నియంత్రణలోనే ఉంది.
ఉత్తర గాజాపై దాడులను ఇజ్రాయెల్ తీవ్రతరం చేసింది. ఆదివారం భారీ స్థాయిలో దాడులు, వైమానిక దాడులు చేసినట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి.
ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్- ఐడీఎఫ్) గాజా నగరాన్ని చుట్టుముట్టాయని, ఉత్తర గాజా, దక్షిణ గాజాగా విభజించాయని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.
గాజా తీరప్రాంతమైన మధ్యదరా సముద్ర తీరానికి ఇజ్రాయెలీ బలగాలు చేరుకున్నాయి.
గాజాపై తీవ్రమైన దాడులు కొనసాగుతాయని, ఉత్తర గాజా, గాజా నగరంపై సైనిక దాడులు కొనసాగిస్తామని ఇజ్రాయెల్ తెలిపింది. ఉత్తర గాజా, గాజా నగర పౌరులు దక్షిణ గాజాకి వెళ్లేందుకు ఇజ్రాయెల్ ఇప్పటికీ ఒక కారిడార్ను అనుమతిస్తోంది.
అక్టోబర్ 7న వివాదం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకూ గాజాలో 10 వేల మంది చనిపోయారని గాజాలోని హమాస్ ఆరోగ్య శాఖ తెలిపింది.
శ్రీలంక క్రికెట్ బోర్డును ఆ దేశ క్రీడా శాఖ మంత్రి రోషన్ రణసింఘె సస్పెండ్ చేశారు. దానితో పాటు అర్జున రణతుంగ నేతృత్వంలో ఓ కమిటీని నియమించారు.
రణతుంగ నేతృత్వంలో నియమించిన కమిటీలో సుప్రీం కోర్టు జస్టిస్ ఎస్.ఐ ఇమామ్, రోహిణి మరసింఘె, రిటైర్డ్ హైకోర్టు జడ్జి ఇరాంగణి పెరెరా, ఉపాలి ధర్మదాస, అటార్నీ ఎట్ లా రకిత రాజపక్స, హిషాం జమాల్దీన్ సభ్యులుగా ఉన్నారు.
ప్రపంచ కప్ పోటీల్లో ఇప్పటివరకూ ఏడు మ్యాచ్లు ఆడిన శ్రీలంక జట్టు రెండు మ్యాచ్లలోనే విజయం సాధించింది.
ఇటీవల భారత్తో జరిగిన మ్యాచ్లో శ్రీలంక జట్టు కేవలం 55 పరుగులకే ఆలౌటైంది.
విజయవాడలోని పండిట్ నెహ్రూ ఆర్టీసీ బస్టాండ్లో బస్సు నేరుగా ప్లాట్ఫాం మీదకు దూసుకెళ్లడంతో ముగ్గురు మృతి చెందారు. ప్లాట్ఫాంపై ఉన్న రెయిలింగ్ దాటి దూసుకురావడంతో బస్సు చక్రాల కింద పడి వీరు ప్రాణాలు కోల్పోయారు.
బస్సు కోసం చూస్తున్న కండక్టర్, మహిళ, 10 నెలల చిన్నారి ఈ ప్రమాదంలో మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు.
మృతి చెందిన కండక్టర్ను గుంటూరు-2 డిపోకు చెందిన వీరయ్యగా గుర్తించారు.
బస్సు ఒక్కసారిగా దూసుకురావడంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు.
విజయవాడ నుంచి గుంటూరు వెళ్లాల్సిన ఏసీ సర్వీసు బస్సు అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్లాట్ఫాం నంబర్ 12 వద్ద ఈ ఘటన జరిగింది.
విజయవాడలోని ఆటోనగర్ డిపోకు చెందిన బస్సు గుంటూరు వెళ్లాల్సి ఉంది. ప్లాట్ఫాం వద్దకి వస్తున్న సమయంలో అదుపుతప్పి ముందుకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 11, 12 ప్లాట్ఫాంల వద్ద దిమ్మెలు విరిగి ఫెన్సింగ్, కుర్చీలు ధ్వంసమయ్యాయి.
ఘటనా స్థలాన్ని ఆర్డీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు. బస్సు ప్రమాదం దురదృష్టకరమని ఆయన విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆర్టీసీ కార్పొరేషన్ తరఫున రూ.5 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని, గాయపడిన వారి వైద్య చికిత్సకు అయ్యే ఖర్చులు భరిస్తామని ఆయన తెలిపారు.
ప్రమాదానికి రెండు వాదనలు వినిపిస్తున్నాయని, సాంకేతిక లోపమా, మానవ తప్పిదమా అనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు ఆయన చెప్పారు. 24 గంటల్లో విచారణ పూర్తి చేసి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటామన్నారు. విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.
''ఆటోనగర్ డిపోకి చెందిన బస్సు గుంటూరు వెళ్లేందుకు 24 మందిని ఎక్కించుకుంది. బస్సు రివర్స్ చేసే క్రమంలో ప్లాట్ ఫాం పైకి దూసుకెళ్లింది. బస్సు గేర్ సరిగా పడలేదని చెబుతున్నారు. సాయంత్రానికి వచ్చే నివేదికను బట్టి చర్యలు తీసుకుంటాం'' అని ద్వారకా తిరుమలరావు అన్నారు.
హమాస్పై ఇజ్రాయెల్ సైనిక చర్య ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు గాజా స్ట్రిప్లో 48 ఐక్యరాజ్యసమితి కేంద్రాలు దెబ్బతిన్నాయని పాలస్తీనియన్ శరణార్థుల కోసం పనిచేస్తున్న ఐరాస సంస్థ యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ( యూఎన్ఆర్డబ్ల్యూఏ) తెలిపింది.
సుమారు 15 లక్షల మంది గాజా పౌరులు నిరాశ్రయులయ్యారని సంస్థ తెలిపింది. వీరిలో దాదాపు సగం మంది ఐరాస సహాయ కేంద్రాల్లోనే ఆశ్రయం పొందుతున్నారని చెప్పింది.
సహాయ కేంద్రాలు శరణార్థులతో కిక్కిరిసిపోవడం వల్ల దక్షిణ ప్రాంతంలోని తమ కేంద్రాల్లో కొత్తగా వచ్చేవారికి ఆశ్రయం కల్పించలేకపోతున్నామని, చాలా మంది నిరాశ్రయులు యూఎన్ఆర్డబ్ల్యూఏ కేంద్రాల బయట రోడ్డుపైనే నిద్రిస్తున్నారని వివరించింది.
హమాస్పై సైనిక చర్య ప్రారంభించిన ఇజ్రాయెల్, ఉత్తర గాజా ప్రాంత ప్రజలను అక్కడి నుంచి ఖాళీ చేసి, దక్షిణ గాజా ప్రాంతానికి వెళ్లాలని గతంలో హెచ్చరించింది.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.