ధన్యవాదాలు
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.
ముస్లిం అనే కారణంతో అమెరికాలో 71 ఏళ్ళ వృద్ధుడు ఒక మహిళ మీద, బాలుడి మీద కత్తితో దాడి చేశారని పోలీసులు తెలిపారు. ఈ దాడిలో ఆరేళ్ళ బాలుడు చనిపోయాడు.
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచకప్లో భాగంగా లక్నో వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్లో శ్రీలంకపై ఆస్ట్రేలియా జట్టు ఐదు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 43.3 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటైంది.
పతుల్ నిశాంక (61 పరుగులు), కుశాల్ పెరీరా (78 పరుగులు) మంచి ఆరంభాన్నిచ్చినా తర్వాత వచ్చిన లంక బ్యాటర్లు చేతులెత్తేయడంతో తక్కువ స్కోరుకే పరిమితమైంది.
ఆసీస్ బౌలర్లలో ఆడం జంపా 4 వికెట్లు తీశాడు.
అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్ ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. అయితే మిచెల్ మార్ష్, లబుషేన్, జోష్ ఇంగ్లిస్ రాణించడంతో 35.2 ఓవర్లలో టార్గెట్ ఛేదించింది.

ఫొటో సోర్స్, APSSDC
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కేసులో కిలారి రాజేశ్ను సీఐడీ సోమవారం విచారించింది.
టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సన్నిహితుడైన కిలారి రాజేశ్ ద్వారానే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధులు దారి మళ్లించారని సీఐడీ గతంలో ఆరోపించింది.
మాజీ సీఎం చంద్రబాబునాయుడి రిమాండ్ రిపోర్టులో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించింది సీఐడీ.
విజయవాడలోని సీఐడీ ప్రధాన కార్యాలయంలో రాజేశ్ను సీఐడీ సుమారు ఆరు గంటలపాటు విచారించింది.

ఫొటో సోర్స్, Getty Images
సేమ్ సెక్స్ మ్యారేజెస్ (స్వలింగ్ వివాహాల) చట్టబద్ధతపై ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం అక్టోబర్ 17, మంగళవారం తీర్పును వెల్లడించనుంది.
స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కోరుతూ దాఖలైన వివిధ పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు మే 11న ప్రకటించింది. ఐదు నెలల తర్వాత ఇప్పుడు తీర్పు చెప్పనుంది.
ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, ఎస్ రవీంద్ర భట్, హిమా కోహ్లీ, పీఎస్ నరసింహలతో కూడిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ కీలకమైన అంశంపై తీర్పు వెలువరించనుంది.
స్వలింగ సంపర్క జంటల వివాహాలకు చట్టబద్దత కల్పించేలా ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని సుప్రీం కోర్టులో 21 పిటిషన్లు దాఖలయ్యాయి. 40 మందికి పైగా లాయర్లు వాదనలు వినిపించారు.
స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ 1954ని సవరించడం ద్వారా స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని, కేవలం ఆడ, మగ మాత్రమే వివాహం చేసుకోవాలనే ఈ చట్టంలోని సెక్షన్ 4సీ రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని వాదనలు జరిగాయి.
అయితే, ఈ వాదనలను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకిస్తోంది. ఎన్నో చట్టాలతో ముడిపడి ఉన్న ఈ ముఖ్యమైన అంశంపై నిర్ణయం జరగాల్సింది పార్లమెంట్లోనని కేంద్రం వాదిస్తోంది.
స్వలింగ వివాహాల చట్టబద్ధతను ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, అస్సాం రాష్ట్రాలు వ్యతిరేకించాయి.

ఫొటో సోర్స్, Getty Images
తన 26 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు (అబార్షన్కు) అనుమతి ఇవ్వాలని కోరుతూ ఓ వివాహిత దాఖలు చేసుకున్న పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేపీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
తన అనారోగ్య కారణాల రీత్యా అబార్షన్కు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
''అబార్షన్ చట్టం (మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నన్సీ యాక్ట్) ప్రకారం,24 వారాల్లోపు అబార్షన్ చేయించుకునేందుకు వీలుంది. పిటిషన్ దాఖలు చేసిన మహిళ ప్రస్తుతం 26 వారాల గర్భంతో ఉన్నారు. అందువల్ల గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతించలేం'' అని సుప్రీంకోర్టు తెలిపింది.
ఇద్దరు బిడ్డల తల్లి అయిన ఆమె రెండో బిడ్డ పుట్టిన తర్వాత పోస్ట్ పార్టమ్ సైకోసిస్ సమస్యతో బాధపడుతున్నట్లు పిటిషన్లో పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతం బిడ్డకు, తల్లికి ఎలాంటి ఇబ్బంది లేదని ఎయిమ్స్ వైద్యులు ఇచ్చిన నివేదికను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు, అబార్షన్కు అనుమతిని నిరాకరించింది. ఈ మహిళ పిటిషన్పై అక్టోబర్ 9న విచారణ జరిపిని జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన బెంచ్, అబార్షన్కు తొలుత అంగీకరించింది. అయితే, ఆ మరుసటి రోజు కోర్టు ఆదేశాలను సమీక్షించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది.
గర్భంలోని పిండం ఎదుగుదల, ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులూ లేవని, ఒకవేళ అబార్షన్ చేయాలంటే శిశువు గుండె కొట్టుకోకుండా ఆపేసేందుకు ప్రత్యేకంగా అనుమతి ఇవ్వాల్సి ఉంటుందంటూ ఎయిమ్స్ వైద్యులు ఇచ్చిన ఈమెయిల్ నివేదికను పిటిషన్కు జతచేసింది.
కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ మేరకు తన ఆదేశాలను సమీక్షించేందుకు జస్టిస్ హిమా కోహ్లీ సమ్మతించగా, జస్టిస్ నాగరత్న దానితో విభేదించారు. దీంతో ఈ పిటిషన్ చీఫ్ జస్టిస్ బెంచ్ ముందుకు వచ్చింది.

ఫొటో సోర్స్, CMO Andhra Pradesh
డిసెంబర్ నాటికి విశాఖపట్నానికి పరిపాలనను బదిలీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చెప్పారు.
విశాఖపట్నం నుంచే పరిపాలన కొనసాగిస్తామని తెలిపారు. తాను కూడా ఇక్కడికే షిఫ్ట్ అవుతున్నానన్నారు.
విశాఖపట్నంలో ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ను జగన్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన జగన్.. త్వరలో విశాఖ ఐటీ హబ్గా మారబోతుందన్నారు.
ఇన్ఫోసిస్కు తాము అన్ని విధాలుగా సహకరిస్తామని చెప్పారు.
ఇప్పటికే విశాఖ ఎడ్యుకేషన్ హబ్ అయిందన్నారు.
పలు ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు విశాఖలో ఉన్నాయని జగన్ చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, CAIR/HANDOUT VIA REUTERS
అమెరికాలో ఆరేళ్ల బాలుడిని కత్తితో దాడి చేసిన చంపినట్లు 71 ఏళ్ల జోసెఫ్ కజుబా అనే వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ముస్లింలు అనే కారణంతో ఇద్దరిపై ఆ వ్యక్తి దాడి చేశాడు. ఆ దాడిలో ఆరేళ్ల బాలుడు చనిపోయాడు. 32 ఏళ్ల మహిళ తీవ్ర గాయాలు పాలైనట్లు విల్ కౌంటీ షెరిఫ్స్ ఆఫీసు అధికారులు తెలిపారు.
ఇజ్రాయెల్-గాజాల మధ్య ఘర్షణలు కొనసాగుతోన్నందున వీరిని లక్ష్యంగా చేసుకుని దాడిచేసినట్లు విల్ కౌంటీ షెరిఫ్స్ ఆఫీసు తెలిపింది.
బాధితులు పాలస్తీనియన్-అమెరికన్లు అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు.
అమెరికాలో ఇటువంటి దారుణమైన నేరపూరిత చర్యలకు చోటు లేదని స్పష్టంచేశారు.
‘అమెరికన్లుగా మనమంతా కలిసి ఉండాలి. ఇస్లామోఫోబియాను(ఇస్లాం మతం పట్ల, ముస్లింల పట్ల కొందరు చూపే వ్యతిరేకత, వివక్షత), అన్ని రూపాల్లో ఉన్న ద్వేషాన్ని మనం వ్యతిరేకించాలి’’ అని పిలుపునిచ్చారు.

ఫొటో సోర్స్, WILL COUNTY SHERIFF'S OFFICE
ఫస్ట్ డిగ్రీ మర్డర్, ద్వేషపూరిత నేరాలు, తీవ్ర దాడి ఆరోపణల కింద నిందితుడిపై అభిపయోగాలు నమోదయ్యాయి.
శనివారం ఉదయం ఒక మహిళ దగ్గర్నుంచి తమకు కాల్ వచ్చిందని పోలీసులు తెలిపారు.చికాగోకి దగ్గర్లో ఉన్న ఫ్లయిన్ఫీల్డ్లో ఉంటున్నవారు తమ ఇంటి యజమాని దాడి చేస్తానని బెదిరించారని ఆ కాల్లో చెప్పారని విల్ కౌంటీ పోలీసు అధికారులు చెప్పారు.
ఆ మహిళ తాను బాత్రూమ్లో దాక్కున్నానని పోలీసులు చెప్పారు. అధికారులు సంఘటనా స్థలానికి చేరుకోగా, అక్కడ మహిళ, బాలుడు తీవ్ర గాయాల్లో కనిపించారు.
అక్కడికి వెళ్లి బాధితులను ఆస్పత్రికి తరలించామని, అయితే అప్పటికే ఆ బాలుడు చనిపోయాడని పోలీసులు చెప్పారు. ఆ బాలుడిపై 26 సార్లు కత్తితో దాడి చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.
బాధితుల వివరాలను పోలీసులు వెల్లడించలేదు..
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.