You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

ప్రపంచ కప్: ఇంగ్లండ్‌పై తొమ్మిది వికెట్ల తేడాతో న్యూజీలాండ్ విజయం

భారత్ వేదికగా జరుగుతున్న క్రికెట్ ప్రపంచ కప్-2023 మొదటి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్‌ ఇంగ్లండ్‌పై న్యూజీలాండ్ ఘనవిజయం సాధించింది.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.

  2. వరల్డ్ కప్-2023: డిఫెండింగ్ చాంపియన్‌పై న్యూజీలాండ్ ఘన విజయం

    భారత్ వేదికగా జరుగుతున్న క్రికెట్ ప్రపంచ కప్-2023 మొదటి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్‌ ఇంగ్లండ్‌పై న్యూజీలాండ్ ఘనవిజయం సాధించింది.

    గురువారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కివీస్ బౌలింగ్ ఎంచుకుంది. ఇంగ్లండ్ 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 282 పరుగులు చేసింది.

    ఇంగ్లండ్ జట్టులో జో రూట్ 77 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ మూడు వికెట్లతో సత్తా చాటాడు.

    అనంతరం బ్యాటింగ్‌కు దిగిన న్యూజీలాండ్ జట్టు కేవలం 36.2 ఓవర్లలోనే ఒక వికెట్ మాత్రమే కోల్పోయి టార్గెట్ చేధించింది.

    కివీస్ బ్యాటర్లలో డేవాన్ కాన్వే 121 బంతుల్లో 152 పరుగులు, రచిన్ రవీంద్ర 96 బంతుల్లో 123 పరుగులు సాధించి జట్టుకు విజయాన్ని అందించారు.

  3. ఈశాన్య యుక్రెయిన్‌లో రష్యా క్షిపణి దాడి, 50 మంది మృతి

    ఈశాన్య యుక్రెయిన్‌లో రష్యా జరిపిన క్షిపణి దాడిలో 50 మంది చనిపోయినట్లు యుక్రెయిన్ తెలిపింది.

    ఖార్కీవ్ ప్రాంతంలోని కుపియాన్స్క్‌ నగరానికి సమీపంలో హరోజా గ్రామంలో ఒక దుకాణంపై స్థానిక కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం ఈ క్షిపణి దాడి జరిగింది.

    ఈ దుకాణాన్ని లక్ష్యంగా చేసుకుని రష్యా ఈ దాడి చేసిందని జెలియెన్‌స్కీ చెప్పారు.

    ఈ దాడిని క్రూరమైన చర్యగా ఆయన అభివర్ణించారు.

    2022 ఫిబ్రవరిలో యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యా-యుక్రెయిన్ సైనికుల మధ్య దాడులకు ఖార్కీవ్ ప్రాంతం కేంద్రంగా మారింది.

    నెలల తరబడి పోరాడిన తర్వాత ఖార్కీవ్‌లోని కొన్ని ప్రాంతాలను తాము తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు గత ఏడాది సెప్టెంబర్‌లో యుక్రెయిన్ చెప్పింది.

  4. సాహిత్యంలో నార్వే రచయిత ఫోస్సా‌కు నోబెల్ పురస్కారం

    సాహిత్యంలో ఈ ఏడాది నోబెల్ బహుమతి నార్వే రచయిత యున్ ఫోస్సాను వరించింది.

    ఫోస్సా సృజనాత్మక డ్రామా, వచన సాహిత్యం నోరువిప్పలేని వారికి స్వరంగా మారాయని నోబెల్ బహుమతులు అందజేసే స్వీడిష్ అకాడమీ తెలిపింది.

    1959లో పుట్టిన యున్ ఫోస్సా, 40కి పైగా నాటకాలు, పలు నవలలు, కథలు, పిల్లల పుస్తకాలు రాశారు. వీటితోపాటు అనువాదంలోనూ విశేషంగా కృషి చేశారు.

  5. తినకుండానే బరువు పెరుగుతున్నారా? కారణం ఇదే

  6. తెలంగాణలో కొత్తగా ఓటేయబోతున్న 8 లక్షల మంది, అమరేంద్ర యార్లగడ్డ, బీబీసీ ప్రతినిధి

    తెలంగాణలో 18 నుంచి 19 ఏళ్ల మధ్య వయస్సున్న 8.1 లక్షల మంది మొదటిసారిగా తమ ఓటు హక్కు నమోదు చేసుకున్నారని ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) రాజీవ్ కుమార్ అన్నారు.

    ఎన్నికల సన్నద్ధతపై ఈసీ అధికారులు రాష్ట్రంలో మూడు రోజులపాటు పర్యటించారు.

    గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో కమిషనర్ మాట్లాడారు.

    3.17 కోట్ల మంది ఓటర్లు

    తెలంగాణలో 3.17 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని రాజీవ్ కుమార్ ప్రకటించారు.

    ఇందులో పురుషులు, మహిళలు సమానంగా ఉండటం మరో ప్రత్యేకత అని ఆయన చెప్పారు.

    పురుష, మహిళ ఓటర్లు చెరో 1.58 కోట్ల మంది ఉన్నారన్నారు.

    అలాగే 100 ఏళ్లు దాటిన ఓటర్లు 7,689 మంది ఉన్నారని చెప్పారు.

    రాష్ట్రంలో వివిధ కారణాలతో 22 లక్షల ఓట్లను తొలగించినట్లు సీఈసీ తెలిపారు.

    అయితే, ఫారం-7 దరఖాస్తును స్వీకరించిన తర్వాతనే ఈ ఓటర్ల తొలగింపు జరిగిందని, ఎక్కడా సుమోటోగా తొలగించలేదని చెప్పారు.

  7. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కేసు: చంద్రబాబుకు 19 వరకు రిమాండ్ పొడిగింపు, శంకర్ వడిశెట్టి

    ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఏసీబీ కోర్టు ఈ నెల 19 వరకు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించింది. సెప్టెంబర్ 9న ఆయన అరెస్టయ్యారు .

    ఆయన రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

    ఇదే కేసులో బెయిల్ కోరుతూ ఆయన తరఫు న్యాయవాదులు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై విచారణను కోర్టు రేపు (శుక్రవారం) మధ్యాహ్నానికి వాయిదా వేసింది.

    చంద్రబాబును కస్టడీకి అప్పగించాలంటూ సీఐడీ పిటిషన్ దాఖలు చేయగా, గురువారం దీనిపై కోర్టు విచారణ జరిపింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.

    ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో ఇరు పక్షాల వాదనలు పూర్తయ్యాయి. న్యాయమూర్తి తీర్పు రిజర్వ్ చేశారు.

  8. తెలంగాణ: ఇంటి నుంచే ఓటు.. ఎవరు అర్హులు? ఎలా ఉపయోగించుకోవాలి?

  9. న్యూస్‌క్లిక్ కేసు: జర్నలిస్టులు ప్రభుత్వానికి ‘సాఫ్ట్ టార్గెట్’ అయ్యారా?

  10. వంట గ్యాస్ సిలిండర్ సబ్సిడీ రూ. 200 నుంచి రూ. 300కు పెంపు

    ఉజ్వల పథకం పరిధిలోని వంట గ్యాస్‌ సిలిండర్లకు ఇస్తున్న సబ్సిడీని కేంద్రం రూ.200 నుంచి రూ. 300కు పెంచింది.

    సబ్సిడీ పెంపు నిర్ణయానికి బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

    దీనివల్ల లక్షల మంది లబ్ధిదారులకు ప్రయోజనం కలుగనుంది.

  11. ఏషియన్ గేమ్స్: ఈ ఫోటోను చైనా ఎందుకు సెన్సార్ చేసింది?

  12. భారత క్రికెటర్ శిఖర్ ధవన్‌కు విడాకులు మంజూరు

    దిల్లీలోని ఒక ఫ్యామిలీ కోర్టు భారత స్టార్ క్రికెటర్ శిఖర్ ధవన్, ఆయన భార్య అయేషా ముఖర్జీకి విడాకులు మంజూరు చేసింది.

    శిఖర్ ధవన్, ఆయన భార్య అయేషా ముఖర్జీ వేర్వేరుగా ఉంటున్నారు.

    శిఖర్ ధవన్‌ను కొన్నేళ్లుగా కుమారునికి దూరం చేయడం ద్వారా ధవన్ మానసిక హింసకు అయేషా ముఖర్జీ కారణమయ్యారని కోర్టు నమ్మింది.

    మానసిక వేదనను కారణంగా చూపిస్తూ 37 ఏళ్ల ధవన్‌కు దిల్లీలోని పాటియాలా హౌజ్ కోర్ట్ విడాకులు మంజూరు చేసిందని బీబీసీ ప్రతినిధి సుచిత్ర మొహంతి చెప్పారు.

    శిఖర్ చేసిన చాలా వాదనలను కోర్టు అంగీకరించింది.

    అయితే, శిఖర్-అయేషాల కుమారుడు జొరావర్‌ శాశ్వత కస్టడీకి సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.

    జొరావర్‌ను భారత్, ఆస్ట్రేలియాల్లో ధవన్ కలిసేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ధవన్ ఇప్పుడు తన కుమారుడితో వీడియో కాల్‌లో కూడా మాట్లాడవచ్చు.

    ప్రతీ ఏడాది పాఠశాల సెలవుల సమయంలో అయేషా భారత్‌కు రావాలని, కనీసం సగం సెలవులు ధవన్, అతని కుటుంబంతో జోరావర్ గడిపేలా అయేషా ముఖర్జీ సహకరించాలని కోర్టు ఆదేశించింది.

    భారత్‌లో తనతో పాటే ఉంటానని చెప్పిన అయేషా తర్వాత మాట తప్పారని తన పిటిషన్‌లో ధవన్ పేర్కొన్నారు.

    అయేషాకు గతంలోనే మరో వ్యక్తితో వివాహం అయింది. మాజీ భర్తకు ఇచ్చిన మాట ప్రకారం తాను ఆస్ట్రేలియాలో ఉండాల్సి ఉంటుందని అయేషా చెప్పారు.

    అయేషాకు మొదటి వివాహంలో ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ప్రస్తుతం ఇద్దరు కూతుర్లు, కుమారుడితో కలిసి ఆమె ఆస్ట్రేలియాలో ఉంటున్నారు.

  13. పారిస్‌పై నల్లుల దండయాత్ర, భయపడిపోతున్న జనం, ఎక్కడ చూసినా నల్లులే..

  14. సిక్కిం ఆకస్మిక వరదలు: 22 మంది జవాన్లు సహా 102 మంది గల్లంతు.. క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటి?

  15. ఆసియా క్రీడలు: సెమీస్‌కు హెచ్‌ఎస్ ప్రణయ్‌, కనీసం కాంస్యం ఖాయం

    ఆసియా క్రీడల్లో భారత షట్లర్ హెచ్‌ఎస్ ప్రణయ్ ముందడుగు వేశాడు.

    పురుషుల సింగిల్స్‌లో సెమీస్‌కు చేరుకొని కనీసం కాంస్య పతకం ఖాయం చేశాడు.

    గురువారం జరిగిన బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ క్వార్టర్స్ మ్యాచ్‌లో హెచ్ ఎస్ ప్రణయ్ (భారత్) 21-16, 21-23, 22-20తో లీ జిల్ జియా (మలేసియా)పై తుదివరకు పోరాడి గెలిచాడు.

  16. ఆసియా క్రీడలు: ఆర్చరీలో జ్యోతి సురేఖ జట్టుకు స్వర్ణం

    ఆసియా క్రీడల్లో తెలుగు అమ్మాయి జ్యోతి సురేఖ సభ్యురాలిగా ఉన్న భారత ఆర్చరీ బృందం విజేతగా నిలిచి స్వర్ణాన్ని సాధించింది.

    గురువారం జరిగిన ఆర్చరీ మహిళల కాంపౌండ్ టీమ్ ఈవెంట్‌లో జ్యోతి సురేఖ, అదితి, పర్ణీతలతో కూడిన భారత జట్టు చాంపియన్‌గా నిలిచింది.

    ఫైనల్లో భారత జట్టు 230-228తో చైనీస్ తైపీపై విజయం సాధించింది.

    బుధవారం ఆర్చరీ మిక్స్‌డ్ టీమ్ కాంపౌండ్ ఈవెంట్‌లో కూడా భారత్ బంగారు పతకాన్ని గెలుచుకుంది.

    హాంగ్జౌ క్రీడల్లో భారత్ ఇప్పటివరకు 19 స్వర్ణాలతో సహా మొత్తం 82 పతకాలు గెలుచుకుంది.

    ఆంధ్రప్రదేశ్ గర్వపడేలా చేశావు: సీఎం జగన్

    బంగారు పతకం గెలిచిన అర్చరీ జట్టును ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ అభినందించారు.

    ఏపీలోని విజయవాడకు చెందిన సురేఖను ప్రత్యేకంగా ప్రశంసించారు. ఆంధ్రపదేశ్ గర్వపడేలా చేశావని కొనియాడారు.

  17. విజయవాడ: న్యూస్ క్లిక్ జర్నలిస్టుల్ని విడుదల చేయాలంటూ ధర్నా

    న్యూస్ క్లిక్ జర్నలిస్టులను తక్షణమే విడుదల చేయాలంటూ విజయవాడ లెనిన్ సెంటర్‌లో జర్నలిస్టులు, వివిధ సంఘాల ప్రతినిధులు ఆందోళనలు మొదలుపెట్టారు.

    పత్రికా స్వేచ్ఛను హరిస్తూ జర్నలిస్టుల పైన, రచయితలపైన దాడులకు పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు.

    ఉపా చట్టాలను ఉపయోగించి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు.తక్షణమే ఈ దాడులను విరమించుకుని పౌర హక్కులు పరిరక్షించాలని కోరారు.

  18. హైదరాబాద్: లులు మాల్‌లో దొంగలు పడ్డారా? ఆ ట్రెండింగ్‌ వీడియోల్లో ఏముంది?

  19. హైదరాబాద్‌‌లోని పలు ప్రాంతాల్లో ఐటీ దాడులు

    హైదరాబాద్ నగరంలో మరోసారి ఐటీ సోదాలు జరుగుతున్నాయి.

    ఐటీ అధికారులు పెద్ద సంఖ్యలో టీములతో సోదాలు నిర్వహిస్తున్నారు.

    తమిళనాడుతోపాటు హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లోనూ ఐటీ అధికారులు సోదాలను చేపట్టారు. కంపెనీలు, వ్యక్తుల ఇళ్లల్లో విస్తృత తనిఖీలు చేస్తున్నారు.

    అలాగే జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ సోదరుల నివాసంతో పాటు వ్యాపారవేత్తలు ప్రసాద్‌, కోటేశ్వరరావు, రఘ్‌వీర్‌ల ఇళ్లలోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

  20. ఆసియా క్రీడలు: క్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి

    చైనాలోని హాంగ్జౌలో జరుగుతోన్న ఆసియా క్రీడల్లో పీవీ సింధుకు నిరాశ ఎదురైంది.

    బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఈవెంట్‌లో సింధు క్వార్టర్ ఫైనల్లోనే ఓటమి పాలైంది.

    గురువారం ఉదయం జరిగిన క్వార్టర్స్ మ్యాచ్‌లో పీవీ సింధు (భారత్) 16-21, 12-21తో హీ బింగ్ బియావో (చైనా) చేతిలో ఓడిపోయింది.

    ఆర్చరీ ఈవెంట్‌లో మహిళల కాంపౌండ్ టీమ్ ఈవెంట్‌లో భారత్ ఫైనల్‌కు చేరుకుంది.

    వెన్నం జ్యోతి సురేఖ, అదితి, పర్ణీత్‌లతో కూడిన భారత జట్టు సెమీస్‌లో 233-219 తో ఇండోనేసియా జట్టుపై గెలిచింది.