లైవ్ పేజీ అప్డేట్స్ సమాప్తం
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్స్ను ఇంతటితో ముగిస్తున్నాం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్డేట్స్తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
ధన్యవాదాలు.
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కరోనావైరస్ మహమ్మారికి ముందే ఈ టెక్నాలజీపై ప్రయోగాలు చేపట్టారు. కానీ, ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రజలకు ఈ సాంకేతికతతో తయారు చేసిన కరోనా టీకాలను అందించారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్స్ను ఇంతటితో ముగిస్తున్నాం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్డేట్స్తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
ధన్యవాదాలు.
మహారాష్ట్రలోని నాందేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటల్లో 24 మంది చనిపోయారు.
ఇందులో 12 మంది అప్పుడే పుట్టిన పిల్లలు కూడా ఉన్నారు.
“చిన్న పిల్లల మరణాలను పక్కన పెడితే మిగతావన్నీ పాము కాటు వల్ల జరిగినవే” అని హాస్పిటల్ డీన్ వకోడే చెప్పారు.
సకాలంలో మందులు ఇవ్వకపోవడం వల్లనే రోగులు చనిపోయినట్లు ఆసుపత్రిలో కొంతమంది చెబుతున్నారు.
అయితే వకోడే దీన్ని కొట్టిపారేస్తున్నారు. మందుల కొరత ఉన్న మాట వాస్తవమేనని అయితే ప్రస్తుతం ఎమర్జెన్సీలో ఉన్న పేషంట్లకు సరిపోయినన్ని ఉన్నాయని ఆయన చెప్పారు.
చనిపోయిన 24 మంది పేషంట్లు ఎమర్జెన్సీ కేసులుగా ఆసుపత్రికి వచ్చారని హాస్పిటల్ వర్గాలు చెప్పాయి.
“ఈ ఆసుపత్రికి చుట్టు పక్కల 70-80 కిలోమీటర్ల పరిధిలో మరో ప్రభుత్వ ఆసుపత్రి లేదు. ఎమర్జెన్సీ అయితేనే రోగులు ఆసుపత్రికి వస్తున్నారు” అని డాక్టర్ శంకర్రావు చవాన్ చెప్పారు. ఈ మరణాలపై విచారణ జరిపిస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాద్ శిందే చెప్పారు.
బ్రిటన్ రాజధాని లండన్లోని భారత హైకమిషన్ బయట ఖలిస్తాన్ మద్దతుదారులు నిరసనలు చేపట్టారు.
హైకమిషన్ బయట నిరసనలు చేస్తోన్న వారిని పోలీసులు రోడ్డుకి అవతల వైపే నిర్బంధించారు.
నిరసనకారులు హర్దీప్ సింగ్ నిజ్జర్ ఫోటోతో ఉన్న ప్లకార్డులను పట్టుకుని ఆందోళన చేశారు.
కెనడా ప్రభుత్వం మాదిరి బ్రిటన్ ప్రభుత్వం కూడా వ్యవహరించాలని ఖలిస్థాన్ అనుకూలదారులు డిమాండ్ చేశారు.
సిక్కుల విషయంలో భారత జోక్యాన్ని ఆపేలా పనిచేయాలని కోరారు.
‘‘కెనడా ప్రభుత్వం పార్లమెంట్లో భారత్ గురించి మాట్లాడిన తీరును చూస్తే, అక్కడభారత ప్రభుత్వం జోక్యం ఉన్నట్లు కనిపిస్తుంది. సిక్కుల పరువు తీసేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది’’ అని అన్నారు.
‘‘గత 40 ఏళ్లుగా దేశ, విదేశాల్లో భారత ప్రభుత్వ జోక్యం బాగా ఎక్కువైంది. అలా జరగకూడదు’’ అని తెలిపారు.
గత రెండు రోజుల క్రితం, స్కాట్లాండ్లోని గ్లాస్గోలో గురుద్వారా దగ్గర భారత దౌత్యవేత్తను సిక్కు ఆందోళనకారులు అడ్డుకున్నారు. ఈ ఘటనపై భారత ప్రభుత్వం బ్రిటన్ విదేశాంగ శాఖకు ఫిర్యాదు చేసింది.
స్థానిక సిక్కుల సమస్యలు, ఇతర వ్యవహారాల గురించి చర్చించేందుకు విక్రమ్ దొరైస్వామిని గురుద్వారా వద్దకు ఆహ్వానించారని, అయితే అక్కడికి వెళ్లాక ఆయనను కొంతమంది ఆందోళనకారులు అడ్డుకోవడంతో వెనుదిరగాల్సి వచ్చిందని భారత హైకమిషన్ తెలిపింది.
దీనికి ముందు, లండన్లోని భారత హైకమిషన్ ప్రాంగణంలో ఉన్న త్రివర్ణ పతాకాన్ని తొలగించేందుకు ప్రయత్నించారు.
దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. భారత హైకమిషన్కు తగిన భద్రతను కల్పించకపోవడం గురించి వివరణ ఇవ్వాలని యూకేను కోరింది.
కెనడా మాదిరి, బ్రిటన్లో కూడా చాలా మంది సిక్కులున్నారు. న్యూస్ ఏజెన్సీ ఏఎఫ్పీ ప్రకారం, బ్రిటన్లో సిక్కు కమ్యూనిటీకి చెందిన 5 లక్షల మంది నివసిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇటీవల ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆర్కే రోజాపై ఆయన చేసిన ‘‘అభ్యంతరకర’’ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
అనకాపల్లి జిల్లా వెన్నెలపాలెంలో ఆయన నివాసముంటున్న ఇంటి వద్దనే బండారు సత్యనారాయణకు 41ఏ, 41బీ నోటీసులు ఇచ్చి పోలీసులు అరెస్టు చేశారు.
అనకాపల్లిలోని ఎన్టీఆర్ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేసి ఆయన్ను మంగళగిరి తరలిస్తున్నారు.
రోజాపై వ్యాఖ్యల విషయంలో సత్యనారాయణపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఏపీ డీజీపీకి లేఖ రాశారు.
ఆదివారం రాత్రి నుంచి బండారు సత్యనారాయణ ఇంటి వద్ద హైడ్రామా కొనసాగింది. ఆయన ఇంటి వద్దకు భారీగా పోలీసులు చేరుకున్నారు. టీడీపీ శ్రేణులు కూడా బండారు ఇంటికి వెళ్లాయి. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
అప్పట్నుంచి ఇవాళ సాయంత్రం వరకు బండారు సత్యనారాయణ ఇంటి వద్ద ఉద్రిక్తత కొనసాగింది.
చివరకు ఇవాళ సాయంత్రం బండారు సత్యనారాయణను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 32 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు జనసేన పార్టీ ప్రకటించింది.
జనసేన విడుదల చేసిన జాబితాలో కూకట్ పల్లి, ఎల్బీనగర్, నాగర్ కర్నూలు, వైరా, ఖమ్మం, మునుగోడు, కుత్బుల్లాపూర్, శేర్లింగంపల్లి, పటాన్ చెరు, సనత్ నగర్, ఉప్పల్, కొత్తగూడెం, అశ్వరావుపేట, పాలకుర్తి, నర్సంపేట, స్టేషన్ ఘన్పూర్, హుస్నాబాద్, రామగుండం, జగిత్యాల, నకిరేకల్, హుజూర్ నగర్, మంథని, కోదాడ, సత్తుపల్లి, వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్, మల్కాజిగిరి, ఖానాపూర్, మేడ్చల్, పాలేరు, ఇల్లందు, మధిర నియోజకవర్గాలు ఉన్నాయి.
ఆసియా క్రీడల్లో భారత హాకీ జట్టు హవా కొనసాగుతోంది.
బంగ్లాదేశ్ను 12-0 తేడాతో ఓడించి, ఇండియా సెమీ ఫైనల్కు దూసుకెళ్లింది. సెమీఫైనల్ బుధవారం జరుగనుంది.
భారత జట్టు పూల్-ఏలో ఉంది. ఇంతవరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు.
బంగ్లాదేశ్తో మ్యాచ్లో భారత జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్, మన్దీప్ సింగ్ హ్యాట్రిక్ గోల్స్ సాధించారు.
హర్మన్ ప్రీత్ రెండో నిమిషంలో, నాలుగో నిమిషంలో, 32వ నిమిషంలో గోల్ చేశాడు. మూడు పెనాల్టీ కార్నర్లను గోల్స్గా మలిచాడు.
మన్దీప్ 18, 24, 46 నిమిషాల్లో గోల్స్ చేశాడు.
ఎంఆర్ఎన్ఏ కోవిడ్ టీకాల తయారీకి దోహదపడ్డ టెక్నాలజీని అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు వైద్య రంగంలో నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యారు.
ప్రొఫెసర్ కాటలిన్ కరికో, ప్రొఫెసర్ డ్రూ వాయిస్మన్ నోబెల్ బహుమతిని పంచుకోనున్నారు.
కరోనావైరస్ మహమ్మారికి ముందే ఈ సాంకేతికతపై ప్రయోగాలు చేపట్టారు. కానీ, ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రజలకు ఈ సాంకేతికతతో తయారు చేసిన కరోనా టీకాలను అందించారు.
ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీని క్యాన్సర్ వంటి ఇతర వ్యాధులపై పరిశోధనకు కూడా ఉపయోగిస్తున్నారు.
‘‘ఆధునిక కాలంలో మానవ ఆరోగ్యానికి అతిపెద్ద ముప్పుగా తలెత్తిన కరోనా మహమ్మారి టీకాల అభివృద్ధికి ఈ ఇద్దరు అనూహ్య రీతిలో సహకరించారు’’ అని నోబెల్ ప్రైజ్ కమిటీ తెలిపింది.
ఈ ఇద్దరికి ఫోన్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేసినట్లు చెప్పింది.
వైరస్లు లేదా బ్యాక్టీరియాలు వంటి వాటిని గుర్తించి, వాటితో పోరాడేలా రోగనిరోధక వ్యవస్థను టీకాలు సిద్ధం చేస్తాయి.
సంప్రదాయ టీకాల టెక్నాలజీని చనిపోయిన లేదా బలహీనపడిన అసలైన వైరస్ లేదా బ్యాక్టీరియాల ఆధారంగా తయారు చేసేవారు.
కానీ, దానికి పూర్తి భిన్నంగా ఎంఆర్ఎన్ఏ టీకాల టెక్నాలజీని అభివృద్ధి చేశారు.
కరోనా మహమ్మారి సమయంలో, మోడెర్నా, ఫైజర్/బయోఎన్టెక్ టీకాలను ఎంఆర్ఎన్ఏ సాంకేతికత ఆధారంగానే రూపొందించారు.
ఉమెన్స్ టేబుల్ టెన్నిస్ డబుల్స్ విభాగంలో భారతీయ క్రీడాకారిణులు సుతీర్థ ముఖర్జీ, ఐహిక ముఖర్జీ జంట రజత పతాకం సాధించింది.
క్వార్టర్ ఫైనల్స్లో సుతీర్థ, ఐహిక జంట ప్రపంచ చాంపియన్స్ చెగ్ మెంగ్, యీదీ వాంగ్ని ఓడించింది.
అయితే, సెమీఫైనల్స్లో కొరియన్ జోడీ సుగ్యోంగ్ ప్యాక్, సుయోగ్ చా చేతిలో 3-4తో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.
మ్యాచ్లో ఇద్దరు క్రీడాకారిణులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. మ్యాచ్లో ఒక దశలో పూర్తిగా వెనుకబడినప్పటికీ.. మ్యాచ్ని 2-3కి తీసుకొచ్చారు. ఈ సీజన్ ఏసియన్ గేమ్స్లో టేబుల్ టెన్నిస్లో భారత్కు ఇదే తొలి పతకం.
ఇప్పటి వరకూ ఏసియన్ గేమ్స్లో భారత్ 56 పతకాలు సాధించింది. అందులో 13 స్వర్ణాలు, 21 వెండి, 22 రజత పతకాలు.
పతకాల పట్టికలో చైనా అగ్రస్థానంలో ఉంది. మొత్తం 251 పతకాలు సాధించగా, వాటిలో 139 స్వర్ణాలు, 73 వెండి, 39 రజత పతకాలు సాధించింది.
మెక్సికోలో చర్చి పైకప్పు కూలి ఏడుగురు మృతి చెందారు. సుమారు 30 మంది ళిథిలాల కింద చిక్కుకుని ఉంటారని, వారిలో చిన్నారులు కూడా ఉండొచ్చని భావిస్తున్నారు.
శిథిలాల తొలగింపు ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకూ పది మందిని శిథిలాల కింద నుంచి బయటకు తీసి ఆస్పత్రికి తరలించినట్లు స్థానిక మీడియా తెలిపింది.
మెక్సికోలోని సియుడాడ్ మాదెరొ నగరంలో ఉన్న శాంటా క్రూజ్ చర్చిలో ఈ ప్రమాదం జరిగింది. పైకప్పు కూలిన సమయంలో దాదాపు 100 మంది చర్చిలో సామూహిక ప్రార్థనల్లో ఉన్నారని టమౌలిపస్ పోలీసులు తెలిపారు.
సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన చిత్రాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు ఉంది. అత్యవసర సేవల విభాగాలకు చెందిన సిబ్బంది, వాహనాలు చర్చి వద్దకు చేరుకున్నట్లు ఆ చిత్రాల్లో కనిపిస్తోంది.
చుట్టుపక్కల ప్రాంతాల్లో నిశ్శబ్దంగా ఉండాలని, తద్వారా శిథిలాల కింద కూరుకుపోయిన వారి అరుపులు, లేదా శబ్దాలు వినపడేందుకు వీలవుతుందని అధికారులు సూచిస్తున్నారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ అంశాల తాజా సమాచారం కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.