పవన్ కల్యాణ్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
గన్నవరానికి విమానంలో రావడానికి అనుమతి లభించకపోవడంతో రోడ్డు మార్గంలో విజయవాడ వైపు బయలుదేరిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ను ఎన్టీఆర్ జిల్లా అనుమంచి పల్లి వద్ద పోలీసులు అడ్డుకున్నారు.
లైవ్ కవరేజీ
బీబీసీ తెలుగు లైవ్ పేజీ అప్డేట్స్కు విరామం
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్, ఆయన విచారణ.. పవన్ కల్యాణ్ నిరసనకు సంబంధించిన అప్డేట్స్.. జీ20 అప్డేట్స్ మీకు మళ్లీ ఎప్పటికప్పుడు అందించేందుకు రేపు ఉదయం కలుద్దాం.
పవన్ కల్యాణ్ను పోలీస్ వ్యాన్ ఎక్కిస్తున్న చిత్రాలు

ఫొటో సోర్స్, janasena
పవన్ కల్యాణ్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయన్ను కోదాడ వైపు తీసుకెళ్తున్నారు.
పవన్ను అడ్డుకోవడం, తదనంతర పరిణామాలతో హైదరాబాద్-విజయవాడ హైవేలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది.
పవన్ను అదుపులోకి తీసుకోవడం, ఆయన పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును టీడీపీ నేత లోకేశ్ ఖండించారు.

ఫొటో సోర్స్, janasena
పవన్ కల్యాణ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు: జనసేన నాయకులు

ఫొటో సోర్స్, janasena
అనుమంచిపల్లిలో పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్లను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇద్దరినీ పోలీసు వాహనంలో తీసుకెళ్తున్నారని.. ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పలేదని జనసేన వర్గాలు చెప్తున్నాయి.
పవన్ను అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు

ఫొటో సోర్స్, janasena
పోలీసులు తనను ముందుకు కదలనివ్వకపోవడంతో పవన్ కల్యాణ్ ఇంకా రోడ్డుపైనే నిరసన తెలుపుతున్నారు.
ఆయన తన కారుపై కూర్చుని నిరసన తెలుపుతుండగా పెద్ద ఎత్తున అభిమానులు, జనసేన కార్యకర్తలు అక్కడకు చేరడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

ఫొటో సోర్స్, janasena
చంద్రబాబు అరెస్ట్ పై హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు
చంద్రబాబు అరెస్టుపై టీడీపీ తరఫు న్యాయవాదులు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
రాత్రి 11 గంటల సమయంలో న్యాయమూర్తి ఇంటి వద్దకు వెళ్లి న్యాయవాదులు ఈ పిటిషన్ దాఖలు చేశారు.
చంద్రబాబును అరెస్ట్ చేసి చాలా సమయమైందని వారు తమ పిటిషన్లో పేర్కొన్నారు.
వయసు, ఆరోగ్య రీత్యా 24 గంటల్లో చంద్రబాబును కోర్టులో హాజరుపరచాలని పిటిషన్లో కోరారు.
పవన్ కల్యాణ్ను అడ్డుకున్న పోలీసులు.. రోడ్డుపై పడుకుని నిరసన తెలిపిన పవన్

ఫొటో సోర్స్, janasena
గన్నవరానికి విమానంలో రావడానికి అనుమతి లభించకపోవడంతో రోడ్డు మార్గంలో విజయవాడ వైపు బయలుదేరిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ను ఎన్టీఆర్ జిల్లా అనుమంచి పల్లి వద్ద తరువాత పోలీసులు అడ్డుకున్నారు.
దీంతో ఆయన రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లేందుకు ప్రయత్నించారు.
అయినా, పోలీసులు అడ్డుకోవడంతో ఆయన రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు.

ఫొటో సోర్స్, janasena

ఫొటో సోర్స్, janasena
ఇంకా సిట్ కార్యాలయంలోనే చంద్రబాబు
నంద్యాలలో శనివారం ఉదయం అరెస్ట్ చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును విజయవాడ సమీపంలోని కుంచనపల్లిలో ఉన్న సిట్ కార్యాలయంలో ఉంచారు.
శనివారం సాయంత్రం ఆయన్ను సిట్ కార్యాలయానికి తీసుకొచ్చినప్పటి నుంచి అక్కడే విచారణ కొనసాగుతోంది.
న్యాయ సహాయం కోసం తన లాయర్లను విచారణ వద్దకు అనుమతించాలంటూ చంద్రబాబు సీఐడీ అధికారులకు లేఖ రాసినా అనుమతించలేదు.
మరోవైపు చంద్రబాబు కుటుంబ సభ్యులు కూడా సిట్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు.
చంద్రబాబు భార్య భువనేశ్వరి, కుమారుడు నారా లోకేశ్తో పాటు కోడలు బ్రహ్మణి, వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ అక్కడకు చేరుకున్నారు.
వీరందరినీ సిట్ కార్యాలయంలోనే వేరే అంతస్తులో ఉండేందుకు అనుమతించారు. చంద్రబాబును వేరే అంతస్తులో విచారిస్తున్నారు.
చంద్రబాబును ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తారని తొలుత భావించడంతో ఆయన తరఫున వాదించేందుకు దిల్లీ నుంచి వచ్చిన సిద్ధార్థ లూథ్రా కూడా విజయవాడలో సిద్ధంగా ఉన్నారు.
అయితే, చంద్రబాబును ఏసీబీ కోర్టులో ఎప్పుడు హాజరుపరుస్తారనే విషయంలో సీఐడీ అధికారుల నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు.
పవన్ కల్యాణ్: జనసేన అధినేత ఫ్లైట్కు అనుమతి నిరాకరణ, ఎందుకంటే..
జీ 20 అతిథులకు రాష్ట్రపతి విందులో కొర్రలు, సామలు, పనస కాయతో చేసిన వంటకాలు
జీ20 శిఖరాగ్ర సమవేశాలకు హాజరైన ప్రపంచ దేశాల నేతలు, ఇతర అతిథులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విందు ఏర్పాటుచేశారు.
ఈ విందులో విదేశీ అతిథులతో పాటు ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.
అతిథుల కోసం ప్రత్యేకమైన వంటకాలు వడ్డించారు.
ఈ మేరకు విందులో ఏమేం ఉన్నాయనేది ఏఎన్ఐ వార్తాసంస్థ ట్విటర్ వేదికగా తెలిపింది.
పనస కాయతో చేసిన గాలెట్ట్, గ్లేజ్డ్ ఫారెస్ట్ మష్రూమ్స్, కేరళరెడ్ రైస్తో పాటు కొర్రలు, సామలతో చేసిన వంటకాలు డార్జిలింగ్ టీ వంటి అనేక రకాలు అందుబాటులో ఉంచారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్ల కంటెంట్కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
G 20: ప్రపంచ నాయకులకు ఆహ్వానం పలికిన ఈ నటరాజ విగ్రహం ప్రత్యేకత ఏమిటి?
‘‘దిల్లీ డిక్లరేషన్లో గట్టి భాషే ఉపయోగించారు’’, సమర్థించిన బ్రిటన్ ప్రధాని రిషి సునక్

ఫొటో సోర్స్, Getty Images
యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించి దిల్లీ డిక్లరేషన్లో గట్టి భాషను ఉపయోగించారని బ్రిటన్ ప్రధాని రిషి సునక్ అన్నారు. ఈ సదస్సులో రష్యాను విడిగా పెట్టినట్లు అయిందని ఆయన అన్నారు.
‘‘మీరు చూస్తున్న ఈ డిక్లరేషన్లో చాలా గట్టి భాష ఉపయోగించారు. ఆహార ధరలపై యుద్ధం చూపుతున్న ప్రభావాన్ని దీనిలో ప్రధానంగా ప్రస్తావించారు’’ అని సునక్ చెప్పారు.
యుక్రెయిన్ ఆహార ధాన్యాలు ప్రపంచ మార్కెట్లలోకి వచ్చేందుకు ‘బ్లాక్ సీ గ్రైన్ ఇనీషియేటివ్’ను పక్కాగా అమలు చేయాలని ఈ డిక్లరేషన్లో పిలుపునిచ్చారు. ఈ ఆహార ధాన్యాలు పేదలకు చేరాల్సిన అవసరముందని చెప్పారు.
‘‘ప్రాదేశిక సమగ్రతపై ఐరాస నిబంధనలను అనుసరించాలని కూడా ఆ డిక్లరేషన్లో సూచించారు. ఇది చాలా మంచి, గట్టి డిక్లరేషన్’’ అని సునక్ అన్నారు.
దిల్లీ పరిస్థితి బాలీ కంటే భిన్నమైనది, బీబీసీ ప్రశ్నకు జైశంకర్ సమాధానం

ఫొటో సోర్స్, Getty Images
జాయింట్ డిక్లరేషన్లో యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన పేరాలు నేటి పరిస్థితికి అద్దంపట్టేలా ఉన్నాయని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు.
నిరుడు బాలీ డిక్లరేషన్తో పోలిస్తే ప్రస్తుతం కాస్త మెతక వైఖరిని అనుసరించారా? అని బీబీసీకి చెందిన సమీరా హుస్సేన్ అడిగిన ప్రశ్నకు ఆయన స్పందించారు.
‘‘నేను మీకు ఒక విషయం చెబుతాను. బాలీ అంటే బాలీనే.. దిల్లీ అంటే దిల్లీనే’’ అని ఆయన అన్నారు.
‘‘బాలీ ఏడాది క్రితం జరిగింది. నేటి పరిస్థితి వేరు. బాలీ తర్వాత చాలా పరిణామాలు చోటుచేసుకున్నాయి’’ అని జైశంకర్ అన్నారు.
భౌగోళిక రాజకీయ పరిణామాలకు సంబంధించిన ఎనిమిది పేరాల్లో ఏడు యుక్రెయిన్ గురించే ఉన్నాయని ఆయన చెప్పారు.
‘‘మేం ప్రస్తావించిన సమస్యలు నేటి పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. వీటిలో ఆహార ధాన్యాలు, ఎరువుల సరఫరా, మౌలిక సదుపాయాలపై దాడులు కూడా ఉన్నాయి’’ అని ఆయన అన్నారు.
‘దిల్లీ డిక్లరేషన్లో కాస్త మెతక భాష ఉపయోగించారు’, వికాస్ పాండే విశ్లేషణ

ఫొటో సోర్స్, ani
దిల్లీ డిక్లరేషన్ను జాగ్రత్తగా గమనిస్తే యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఉపయోగించిన పదాలు కాస్త మెతకగా కనిపిస్తున్నాయి. బాలీ డిక్లరేషన్ తరహాలో రష్యా చర్యలను దీనిలో నేరుగా ఖండించలేదు.
బాలీ డిక్లరేషన్లో యుక్రెయిన్ మీద రష్యా దాడిని కాస్త గట్టిగానే ఖండించారు. అయితే, ఈ విషయంలో కొన్ని విభేదాలు కూడా ఉన్నాయని ఆ డిక్లరేషన్లో పేర్కొన్నారు.
కానీ, దిల్లీ డిక్లరేషన్లో నేరుగా రష్యాను విమర్శించలేదు.‘‘ప్రపంచంలోని భిన్న ప్రాంతాల్లో యుద్ధాల వల్ల ప్రజలు అనుభవించే తీవ్రమైన బాధ, ప్రతికూల ప్రభావాలపై మేం ఆందోళన చెందుతున్నాం’’ అని మాత్రమే పేర్కొన్నారు.
అయితే, ఇక్కడ బల ప్రయోగాలకు దిగకూడదని అనే వ్యాఖ్యలు పరోక్షంగా రష్యాను ఉద్దేశించి చేసినవేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
వాతావరణ మార్పులపై విభేదాలు, నవీన్ సింగ్ ఖాడ్కా, బీబీసీ ఎన్విరాన్మెంట్ కరస్పాండెంట్

ఫొటో సోర్స్, Getty Images
ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల సమావేశాల తరహాలో జీ20 శిఖరాగ్ర సదస్సుల్లో అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య విభేదాలు కనిపించవు.
కానీ, ఈ సారి దీనికి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. శిలాజ ఇంధనాల వినియోగాన్ని క్రమంగా తగ్గించుకోవడం, పునరుత్పాదక ఇంధన లక్ష్యాలను పెంచడం, గ్రీన్హౌస్ వాయు ఉద్గారాల కట్టడి లాంటి అంశాలపై జాయింట్ డిక్లరేషన్లో ప్రస్తుతం విభేదాలు కనిపించాయి.
జీ20 దేశాలు ప్రపంచ గ్రీన్హౌస్ వాయు ఉద్గారాల్లో 75 శాతానికి కారణం. అయితే, 2030 నాటికి పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని మూడు రెట్లు పెంచాలనే అభివృద్ధి చెందిన దేశాల వాదనకు రష్యా, చైనా, సౌదీ అరేబియా, భారత్ ప్రస్తుతం అభ్యంతరాలు వ్యక్తంచేశాయి.
విజయవాడ సమీపంలోని సిట్ కార్యాలయానికి చంద్రబాబు

శనివారం ఉదయం నంద్యాలలో అరెస్టైన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును విజయవాడ సమీపంలోని కుంచనపల్లిలో ఉన్న సిట్ కార్యాలయానికి తరలించారు.
వైద్య పరీక్షల అనంతరం ఆయన్ను విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తారు.
చంద్రబాబును సిట్ కార్యాలయానికి తేవడంతో టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నాయి.
దీంతో పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు చర్యలు చేపట్టారు.
జైశంకర్, నిర్మలా సీతారామన్ ఏం చెప్పారు?

ఫొటో సోర్స్, ani
జీ20 సదస్సుపై కేంద్ర మంత్రులు కూడా విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి వివరాలు వెల్లడించారు.
మొదటగా విదేశాంగ మంత్రి జైశంకర్ మాట్లాడారు. ‘‘ఈ రోజు సదస్సులో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాం. జాయింట్ డిక్లరేషన్లో పటిష్టమైన, అన్నింటికీ సమ ప్రాధాన్యమిచ్చే , సమ్మిళిత వృద్ధికి పెద్దపీట వేశాం’’ అని ఆయన చెప్పారు.
ఆయన తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా మాట్లాడారు. ‘‘ప్రపంచ సమస్యలకు పరిష్కారాలను కనుక్కునే క్రమంలో అన్ని వర్గాలనూ కలుపుకొని వెళ్తాం. ఇక్కడ నిర్ణయాలు తీసుకునే క్రమంలో దక్షిణార్ధగోళంలోని దేశాల గళం కూడా వినిపించేలా చూసేందుకు భారత్ కట్టుబడి ఉంది’’ అని ఆమె అన్నారు.
‘‘గ్రూపులోని ప్రతి ఒక్కరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని, అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాలను భారత్ సూచించింది’’ అని ఆమె తెలిపారు.
అణ్వాయుధాలను అసలు ఉపయోగించకూడదు- జీ20 డిక్లరేషన్
యుక్రెయిన్ యుద్ధం గురించి ప్రస్తావనలో అణ్వాయుధాల గురించి కూడా స్పందించారు.
‘‘ఐక్యరాజ్యసమితి నిబంధనలు అన్ని దేశాలు అనుసరించాలి. ఇతర దేశాల సార్వభౌమాధికారం, రాజకీయ స్వతంత్రత, ప్రాదేశిక సమగ్రతలను గౌరవించాలి. ఇక్కడ ఎలాంటి బలప్రయోగాలకూ దిగకూడదు’’ అని పేర్కొన్నారు.
అయితే, ఇక్కడ ఏ దేశం పేరునూ నేరుగా ప్రస్తావించలేదు. కాబట్టి ఎవరికి నచ్చినట్లు వారు భాష్యం చెప్పుకోవచ్చు.
అయితే, అణ్వాయుధాలను అసలు ఉపయోగించకూడదని తర్వాత పేరాలో పునరుద్ఘాటించారు. ఇవి పరోక్షంగా రష్యాను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలని విదేశాంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలి? ఆ బాక్స్లో ఏమేం ఉండాలి?
జాయింట్ డిక్లరేషన్లో ఏముంది?
జాయింట్ డిక్లరేషన్ను విదేశాంగ శాఖ వెబ్సైట్లో విడుదల చేశారు. దీనిలో వివాదాస్పద అంశాలను మొదట చూద్దాం. యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన అంశాల్లో ఎలా ఏకాభిప్రాయం కుదిరిందో మొదట తెలుసుకుందాం.
‘‘ప్రపంచంలోని భిన్న ప్రాంతాల్లో యుద్ధాల వల్ల ప్రజలు అనుభవించే తీవ్రమైన బాధ, ప్రతికూల ప్రభావాలపై మేం ఆందోళన చెందుతున్నాం’’ అని మొదటి లైన్లో పేర్కొన్నారు.
అయితే, ఇక్కడ యుద్ధానికి బాధ్యత వహించాల్సింది రష్యానేనని ఎక్కడా పేర్కొనలేదు. కానీ, యుద్ధం వల్ల ప్రజలు పడే ఇబ్బందుల గురించి స్పందించారు. దీనిపై రష్యా, పశ్చిమ దేశాలు తమకు నచ్చినట్లుగా భాష్యం చెప్పుకోవచ్చు.
