ధన్యవాదాలు
బీబీసీ తెలుగు లైవ్ పేజ్ ఇంతటితో సమాప్తం.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం....గుడ్ నైట్
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని(సీడబ్ల్యూసీ) పునర్వ్యవస్ఠీకరించింది. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే 84 మంది పేర్లతో ఒక జాబితా విడుదల చేశారు.
బీబీసీ తెలుగు లైవ్ పేజ్ ఇంతటితో సమాప్తం.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం....గుడ్ నైట్
2023 మహిళల ఫుట్బాల్ ప్రపంచకప్ను స్పెయిన్ గెలుచుకుంది. ఫైనల్లో ఆ జట్టు 1-0 తేడాతో ఇంగ్లండ్ జట్టును ఓడించింది.
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో గోల్ కొట్టడం ద్వారా ఓల్గా కార్మోనా స్పెయిన్కు విజయాన్ని అందించింది.
సెమీ-ఫైనల్స్లో కూడా స్వీడన్ పై కార్మోనాయే విన్నింగ్ గోల్ చేసింది.
ఈ విజయంలో స్పెయిన్ జట్టు తొలిసారి మహిళల ఫుట్బాల్ ప్రపంచకప్ను కైవసం చేసుకుంది. ఫుట్బాల్ ప్రపంచకప్ గెలిచిన ఐదో జట్టుగా స్పెయిన్ నిలిచింది. మహిళల ఫుట్బాల్ ప్రపంచకప్లో ఇది 9వ ఎడిషన్ కాగా, స్పెయిన్ జట్టు తొలిసారి గెలుపొందింది. ఇంతకు ముందు అమెరికా నాలుగుసార్లు, జర్మనీ రెండుసార్లు, నార్వే, జపాన్లు ఒకసారి గెలుపొందాయి.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని(సీడబ్ల్యూసీ) పునర్వ్యవస్ఠీకరించింది. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే 84 మంది పేర్లతో ఒక జాబితా విడుదల చేశారు.
అందులో 39 మంది సభ్యులు కాగా 18 మంది శాశ్వత ఆహ్వానితులు. మరో 14 మంది ఇంచార్జులు, 9 మంది ప్రత్యేక ఆహ్వానితులు, నలుగురు ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు.
తెలుగు నేతలు ఎవరంటే..
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు నేతలకు చోటు దక్కింది.
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, ఏపీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డికి 39 మంది సీడబ్ల్యూసీ సభ్యులలో ఒకరిగాస్థానం కల్పించారు.
శాశ్వత ఆహ్వానితులుగా టి.సుబ్బరామిరెడ్డి, కొప్పుల రాజు, దామోదర రాజనర్సింహలకు అవకాశం కల్పించారు.
ప్రత్యేక ఆహ్వానితులుగా కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు, వంశీచంద్ రెడ్డిలకు అవకాశం దక్కింది.
మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాధ్రా, అధిర్ రంజన్ చౌధరి, చిదంబరం, దిగ్విజయ్ సింగ్, శశిథరూర్ తదితర ముఖ్య నేతలందరినీ సీడబ్ల్యూసీ సభ్యులుగా ఎంపిక చేశారు.
రష్యా ప్రయోగించిన లూనా-25 చంద్రుని మీదకు ల్యాండ్ అవడానికి ముందు 'ప్రీ-ల్యాండింగ్' కక్ష్యలోకి ప్రవేశించే సమయంలో ‘అసాధారణ పరిస్థితులు’ఎదురయ్యాయని, అందులోని ఆటోమేటిక్ స్టేషన్ నియంత్రణ విఫలమైందని రష్యా జాతీయ స్పేస్ ఏజెన్సీ రాస్కాస్మోస్ తెలిపిందని రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది.
రష్యా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా దాదాపు 50 ఏళ్ళ తరువాత ప్రయోగించిన లూనా-25 ఈ సాంకేతిక వైఫల్యం కారణంగా ముందుగా నిర్దేశించిన ప్రీ-ల్యాండింగ్ కక్ష్యలోకి వెళ్ళలేకపోయింది.
ఈ రష్యా వ్యోమనౌక చంద్రుడి దక్షిణ ధ్రువం మీద సోమవారం ల్యాండ్ కావాల్సి ఉంది. ఈ ప్రయోగం విజయవంతమైతే చంద్రుని మీద ఘనీభవించిన నీటి జాడలను, విలువైన మూలకాలను గుర్తించవచ్చని శాస్త్రవేత్తలు భావించారు.
“ఆపరేషన్ సమయంలో అంతరిక్ష నౌకలో అసాధారణ పరిస్థితులు ఎదురయ్యాయి. దానితో, అందులోని ఆటోమేటిక్ స్టేషన్ను నిర్దిష్టంగా నియంత్రించడం సాధ్యం కాలేద”అని రాస్కాస్మోస్ సంక్షిప్తంగా ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే, నిపుణులు ఈ పరిస్థితిని పరిశీలిస్తున్నారని ఈ సంస్థ తెలిపింది. చంద్రుడి మీద జీమన్ లోయ ఫోటోలను కూడా ఈ సంస్థ విడుదల చేసింది. చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో ఈ లోయ 190 కిలోమీటర్ల వెడల్పు, ఎనిమిది కిలోమీటర్ల లోతు ఉన్నట్లు వెల్లడించింది.
ఈ సాంకేతిక లోపం వల్ల లూనా-25 ఆగస్ట్ 21న చంద్రుడి మీద ల్యాండ్ కాకపోవచ్చనే వార్తలు వస్తున్నాయి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 షెడ్యూల్ ప్రకారం ఆగస్ట్ 23న చంద్రుడి మీద ల్యాండ్ కావల్సి ఉంది. ఇప్పుడు, చంద్రయాన్ ల్యాండరే ముందుగా చంద్రుడి దక్షిణ ధ్రువం మీదకు దిగుతుందా అనే ఉత్కంఠ మొదలైంది.
సాధారణ దుస్తులలో వచ్చిన పోలీసులు రాత్రిపూట తన కూతుర్ని అపహరించి తీసుకెళ్లారని పోలీసులపై పాకిస్తాన్ మాజీ మంత్రి షిరీన్ మజారీ తీవ్ర ఆరోపణలు చేశారు.
‘‘మఫ్టీలో వచ్చిన మహిళా పోలీసులు, కొందరు వ్యక్తులు నా ఇంటి తలుపుల్ని పగలగొట్టి నా కూతుర్ని తీసుకెళ్లారు. మా ఇంటి సెక్యూరిటీ కెమెరాలను, ల్యాప్టాప్ను, నా కూతురి ఫోన్ను లాక్కెళ్లారు.
నా ఇంటి మొత్తాన్ని సోదా చేశారు. ఆ సమయంలో నా కూతురు నైట్ డ్రస్లో ఉంది. డ్రస్ మార్చుకుంటానని నా కూతురు చెప్పింది. కానీ, వారు దానికి అంగీకరించకుండా తనని లాక్కొని వెళ్లారు. వారి వద్ద ఎలాంటి వారంట్ లేదు. ఏ చట్టపరమైన ప్రక్రియను వారు అనుసరించలేదు.
ఇది నిరంకుశ ప్రభుత్వం. వారు తలుపులు బద్దలు కొట్టుకుని ఇంట్లోకి వచ్చినప్పుడు మేమిద్దరం మహిళలమే ఉన్నాం. ఇది కచ్చితంగా అపహరణే’’ అని షిరీన్ మజారీ అన్నారు.
పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ తర్వాత మే 9న పాకిస్తాన్లో హింస చెలరేగింది. ఈ హింసాత్మక ఘటనలు చెలరేగిన తర్వాత మజారీని పలుసార్లు అరెస్ట్ చేశారు.
దీంతో షిరీన్ మజారీ పార్టీ, రాజకీయాలు రెండూ వదిలేశారు.
యుక్రెయిన్లోని చెర్నిహివ్ నగరంలోని ఓ థియేటర్పై ఆదివారం ఉదయం రష్యా జరిపిన క్షిపణి దాడిలో ఆరేళ్ల పాప సహా ఏడుగురు మరణించారు. 144 మంది గాయాలు పాలయ్యారు.
గాయాలు పాలైన వారిలో 50 మంది చిన్నారులు ఉన్నారని పోలీసులు తెలిపారు.
ఈ దాడిలో యూనివర్సిటీ భవంతి కూడా దెబ్బతిందని పోలీసులు చెప్పారు.
రష్యా జరిపిన ఈ దాడిని ఐక్యరాజ్య సమితి ‘‘హేయమైన చర్య’’గా పేర్కొంది.
ఈ ఉగ్రదాడికి యుక్రెయిన్ సైనికులు గట్టిగా సమాధానం చెబుతారని యుక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ అన్నారు.
బెలారస్తో ఉన్న యుక్రెయిన్ సరిహద్దుకి దక్షిణంగా 50 కి.మీల దూరంలో చెర్నిహివ్ నగరం ఉంది.
2022 ఫిబ్రవరిలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, యుక్రెయిన్పై పూర్తి స్థాయిలో దాడి ప్రారంభించినప్పుడు తొలుత రష్యా సైనికులు దీన్నే ముట్టడించారు.
రష్యా క్షిపణి దాడి జరిగిన ప్రాంతానికి దగ్గర్లో ఉన్న ఇతర భవంతులు కూడా దెబ్బతిన్నాయి.
భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందని లద్దాఖ్లో మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు.
‘‘చైనా ఆర్మీ భారత భూభాగంలోకి ప్రవేశించి, అంతకుముందు స్థానికులు వాడుకునే భూమిని లాగేసుకుందని ఇక్కడ ప్రతిఒక్కరూ చెబుతున్నారు. కానీ, ప్రధానమంత్రి ఇంచి భూమిని కూడా చైనా తీసుకోలేదని చెబుతున్నారు. ప్రధాని చెప్పేదంతా నిజం కాదు. మీరు ఇక్కడ అడగండి. అసలు నిజమేంటో వారు చెబుతారు’’ అని రాహుల్ గాంధీ అన్నారు.
భారత్ జోడో యాత్రలో భాగంగా తాము లద్దాఖ్ రావాలనుకున్నామని, కానీ, కొన్ని పరిస్థితుల కారణంగా రాలేకపోయామని తెలిపారు. ‘‘కొంచెం సమయం తీసుకుని లద్దాఖ్ సందర్శించాలని నేను అనుకున్నాను. మేం పాంగాంగ్ వరకూ వచ్చాం. కార్గిల్ కూడా వెళ్తాం. అక్కడ ప్రజల మనస్సులో ఏముందో తెలుసుకుంటాం’ అని రాహుల్ చెప్పారు.
శనివారం రాహుల్ గాంధీ లద్దాఖ్ చేరుకున్నారు. తన తండ్రి రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా పాంగాంగ్ సరస్సు వద్ద తండ్రికి నివాళి అర్పించారు.
బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సమాచారంతో పాటు జాతీయ, అంతర్జాతీయ వార్తలను మీకు అందిస్తుంది బీబీసీ తెలుగు లైవ్ పేజీ.
నిన్నటి లైవ్ పేజీకోసం ఇక్కడ క్లిక్ చేయండి.