You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

కొరియన్ ఓపెన్ టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించిన సాత్విక్-చిరాగ్ జోడీ

భారత బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్-చిరాగ్ కొరియన్ ఓపెన్ టైటిల్ సాధించారు. ఒక భారత జోడీ ఈ కప్ కొట్టడం ఇదే తొలిసారి.

లైవ్ కవరేజీ

  1. లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

  2. దిల్లీ: మళ్లీ ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్న యమున, హైఅలర్ట్

    దిల్లీలో యమునా నీటిమట్టం ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు మళ్లీ గరిష్ట స్థాయి 206.35 మీటర్లకు చేరుకుంది.

    యమునా నది ప్రమాదకర స్థాయి 205.33 మీటర్లను దాటి ప్రస్తుతం ప్రవహిస్తోంది.

    ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తుండటంతో హత్నీ కుండ్ బ్యారేజ్ నుంచి నీటిని విడుదల చేశారు.

    దీంతో ఆదివారం మరోసారి యమునా నది ప్రమాదకర స్థాయిని దాటిందని పీటీఐ రిపోర్ట్ చేసింది. యమునా నది నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.

    నీటిమట్టం పెరుగుతుండటంతో వరద ప్రభావానికి గురవుతోన్న లోతట్టు ప్రాంతాల వారికి సహాయక చర్యలు అందించడం సమస్యగా మారవచ్చని అధికారులు చెప్పినట్లు పీటీఐ తెలిపింది.

    హత్నీకుండ్ బ్యారేజ్ నుంచి రెండు లక్షల క్యూసెకుల నీటిని విడుదల చేయడంతో దిల్లీ ప్రభుత్వం హైఅలర్ట్‌ను ప్రకటించింది.

    ఈ నెల 13న కూడా యమునా నీటిమట్టం అత్యధికంగా 208.66 మీటర్లకు చేరుకుంది. ఆ సమయంలో ఐటీఓ, సుప్రీంకోర్ట్, రాజ్‌ఘట్, కశ్మీర్ గేట్ వద్దకు వరద నీరు చేరింది.

    జూలై 25 వరకు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం అంచనావేస్తోంది.

  3. విరాట్ కోహ్లీని హత్తుకున్న వెస్టిండీస్ క్రికెటర్ తల్లి, ఈ వీడియోపై సోషల్ మీడియాలో చర్చ ఏంటి?

  4. బ్యాడ్మింటన్: కొరియన్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్న సాత్విక్, చిరాగ్ జోడీ

    భారత బ్యాడ్మింటన్ డబుల్స్ జోడీ సాత్విక్‌ సాయిరాజ్ రెడ్డి, చిరాగ్ శెట్టిలు కొరియన్ ఓపెన్ 500 బ్యాడ్మింటన్ టైటిల్‌ను కైవసం చేసుకున్నారు.

    ఒక భారత జోడీ ఈ టైటిల్ గెలుచుకోవడం ఇదే తొలిసారి.

    ఆదివారం ఇండోనేషియా టాప్ జోడీ ఫజర్ అల్ఫియాన్, మహ్మద్ రియాన్ ఆర్డియాంటోలను 17-21, 21-13, 21-14 తేడాతో ఓడించారు.

    శనివారం సాత్విక్, చిరాగ్ జోడి ప్రపంచ నంబర్ టూ లియాంగ్ వీ కెంగ్, వాంగ్ చాంగ్ జోడీని కూడా ఓడించారు.

    ఈ ఏడాది ఇండోనేషియా సూపర్ 1,000, స్విస్ ఓపెన్ సూపర్ 500 టైటిళ్లను కూడా వీరిద్దరూ గెలుచుకున్నారు.

  5. పబ్ జీ ప్రేమకథ: రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరిన సీమా హైదర్

    భారత యువకుడు సచిన్ మీనాను ప్రేమించి, నేపాల్ గుండా భారత్‌ చేరుకున్న పాకిస్తాన్ మహిళ సీమా హైదర్ క్షమాభిక్ష కోరుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పిటిషన్ పెట్టుకున్నారు.

    తన నలుగురు పిల్లలతో కలిసి గ్రేటర్ నోయిడాలో నివసించేందుకు తనకు, తన బాయ్‌ఫ్రెండ్ సచిన్ మీనాకు అనుమతి ఇవ్వాలని రాష్ట్రపతిని సీమా కోరారు.

    ఆమె తరపున సుప్రీంకోర్టు న్యాయవాది ఏపీ సింగ్ ఈ పిటిషన్‌ను శుక్రవారం రాష్ట్రపతి కార్యాలయంలో అందజేసినట్లు పీటీఐ వార్తాసంస్థ తెలిపింది.

    తాను సచిన్‌ను ప్రేమిస్తున్నానని, ఆయనతో కలిసి బతికేందుకే తాను పాకిస్తాన్ నుంచి భారత్‌కు వచ్చేశానని ఈ పిటిషన్‌లో సీమా చెప్పారు.

    తాను ఇస్లాం నుంచి హిందూ మతంలోకి మారానని, నేపాల్‌ కఠ్మాండులోని పశుపతినాథ్ ఆలయంలో హిందూ సంప్రదాయం ప్రకారం సచిన్‌ను పెళ్లి చేసుకున్నానని ఆమె చెబుతున్నారు.

    మేలో భారత్ చేరుకున్న సీమాతోపాటు సచిన్ మీనాను జులై 4న ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. జులై 7న వీరిద్దరికి స్థానిక కోర్టు బెయిలు మంజూరు చేసింది.

    సీమా అంశంపై భారత్, పాకిస్తాన్‌లలో కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది.