ధన్యవాదాలు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ అప్డేట్స్ ఇంతటితో ముగిస్తున్నాం.
కొత్త అప్డేట్స్తో రేపు ఉదయం కలుద్దాం.
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
సోషల్ మీడియా నెట్వర్క్ ‘ట్విటర్’ కొత్త సీఈవోగా లిండా యాకరినోను ట్విటర్ అధిపతి ఎలాన్ మస్క్ నియమించారు. ఆమె ఆరు వారాల్లో బాధ్యతలు చేపడతారని చెప్పారు.
ధన్యవాదాలు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ అప్డేట్స్ ఇంతటితో ముగిస్తున్నాం.
కొత్త అప్డేట్స్తో రేపు ఉదయం కలుద్దాం.
సోషల్ మీడియా నెట్వర్క్ ‘ట్విటర్’ కొత్త సీఈవోగా లిండా యాకరినోను ట్విటర్ అధిపతి ఎలాన్ మస్క్ నియమించారు. ఆమె ఆరు వారాల్లో బాధ్యతలు చేపడతారని చెప్పారు.
యాకరినో అమెరికా మీడియా సంస్థ ఎన్బీసీయూనివర్సల్లో ప్రకటనల విభాగం మాజీ అధిపతి.
ట్విటర్లో సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్గా ఎలాన్ మస్క్ కొనసాగనున్నారు.
ట్విటర్ను మస్క్ నిరుడు 44 బిలియన్ డాలర్లకు టేకోవర్ చేశారు. ప్రస్తుతం సీఈవోగా ఆయనే వ్యవహరిస్తున్నారు.
అమరేంద్ర యార్లగడ్డ
బీబీసీ ప్రతినిధి
ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో టీడీపీతోపాటు బీజేపీతోనూ కలిసి పోటీ చేస్తామని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రకటించారు.
‘‘గౌరవంగా ఉండి.. అన్ని పద్ధతులు బాగుంటే కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తాం.’’ అని ఆయన చెప్పారు.
శుక్రవారం మంగళగిరిలో జనసేన పార్టీ మండల, డివిజన్ స్థాయి అధ్యక్షుల సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు.
ఆంధ్రపద్రేశ్లో 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ ఏడు శాతం ఓట్లు సాధించిందని, ఈ సారి తన అంచనా ప్రకారం 14 నుంచి 18 శాతం ఓట్లు సాధిస్తుందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని, తమ కూటమి ప్రభుత్వాన్ని గద్దెనెక్కిస్తామన్నారు.
‘‘అలయెన్స్కు సిద్ధమనే చెబుతున్నా. ఇంకా విధివిధానాలు ఖరారు కాలేదు. అలయెన్స్ నిర్ణయాలు నాలుగు గోడల మధ్య తీసుకోం. కూటమిలో ఉండే పార్టీలు కామన్ మినిమమ్ ప్రోగ్రాం తరహాలో ప్రజలు, మీడియా ఎదురుగా కూర్చుని ఒప్పందాలు చేసుకుంటాం. ఆంధ్రప్రదేశ్కు ఏం చేస్తామో చెబుతాం. ఎన్ని ఉద్యోగాలు ఇస్తాం, వెళ్లిపోయిన పెట్టుబడులను ఎలా తిరిగి తీసుకువస్తాం, ఆంధ్రప్రదేశ్ను ఎలా గట్టెక్కిస్తాం ఇలా అన్ని విషయాలూ చెబుతాం’’ అని పవన్ అన్నారు.
వ్యూహం తాను చెబుతానని, క్షేత్రస్థాయిలో అమలు చేసే బాధ్యత నాయకులు తీసుకోవాలని ఆయన తెలిపారు. జూన్ నుంచి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.
ముఖ్యమంత్రి పదవి రావాలంటే తనను ముందుగా సముచిత స్థానంలో గెలిపించాలని పార్టీ శ్రేణులను పవన్ కోరారు.
‘‘మన పార్టీకి కనీస సీట్లు గెలిపించుకోకుండా సీఎం పదవి అడగడం సరికాదు. అది అర్థం చేసుకోవాలి. భావోద్వేగాలతో రాజకీయం చేయడం తగదు. ఆలోచనతో చేయాలి” అని ఆయన సూచించారు.
మండల, డివిజన్ స్థాయి నాయకులు దొంగ ఓట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పవన్ హెచ్చరించారు.
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు ఇస్లామాబాద్ హైకోర్టులో ఊరట లభించింది.
అల్ ఖాదిర్ ట్రస్టు కేసులో ఇమ్రాన్కు హైకోర్టు శుక్రవారం రెండు వారాలపాటు మధ్యంతర బెయిలు ఇచ్చింది.
తదుపరి విచారణలో రెండు పక్షాల వాదనలు విన్న తర్వాత బెయిలు ఇవ్వాలా, వద్దా అన్నది నిర్ణయిస్తామని న్యాయస్థానం చెప్పింది.
మే 9 తర్వాత నమోదైన ఏ కేసులోనూ ఇమ్రాన్ ఖాన్ను అరెస్టు చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలు మే 17 వరకు అమల్లో ఉండనున్నాయి.
అల్ ఖాదిర్ ట్రస్టు కేసులో మే 9న ఇమ్రాన్ ఖాన్ అరెస్టయ్యారు.
ఈ కేసులో ఇమ్రాన్ అరెస్టు చట్ట విరుద్దమని సుప్రీంకోర్టు గురువారం తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇమ్రాన్ ఇంకా విడుదల కాలేదు. పోలీస్ గెస్ట్ హౌజ్లోనే ఉండాలని కోర్టు ఆయనకు సూచించింది.
ఈ కేసు విచారణకు ఇస్లామాబాద్ హైకోర్టుకు వెళ్లాలని ఇమ్రాన్ ఖాన్ను సుప్రీంకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అంగీకరించాల్సి ఉంటుందని ఆయనకు సూచించింది.
డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ను సిట్ విచారించింది. ఆయన వాగ్మూలం తీసుకుని, కొన్ని పత్రాలు చూపించమని కోరింది.
బ్రిజ్ భూషణ్ శరణ్పై మహిళా రెజ్లర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆరు పోలీసు బృందాలతో సిట్ను ఏర్పాటు చేశారు. ఇందులో నలుగురు మహిళా పోలీసు అధికారులు కూడా ఉన్నారు. మహిళా డీసీపీ ఆధ్వర్యంలో పది మందితో కూడిన బృందాన్ని ఏర్పాటు చేశారని దిల్లీ పోలీసులు తెలిపారు.
కాగా, బ్రిజ్ భూషణ్ తనపై వచ్చిన ఆరోపణలను తిరస్కరించారు.
లక్కోజు శ్రీనివాస్, బీబీసీ కోసం
పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలం కాట్రగడ సమీపంలో విద్యుత్ తగిలి నాలుగు ఏనుగులు మృతి చెందాయి. పొలాల్లో ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్లను రాత్రి సమయంలో ఏనుగులు తాకడంతో చనిపోయినట్లు పార్వతీపురం మన్యం జిల్లా అటవీశాఖాధికారి ప్రసూన బీబీసీతో చెప్పారు.
ఈ ప్రమాదానికి సంబంధించి డీఎఫ్ఓ ప్రసూన అందించిన వివరాలు ప్రకారం...
"మొత్తం ఆరు ఏనుగులు ఈ ప్రాంతంలో సంచరిస్తున్నాయి. చనిపోయిన నాలుగు ఏనుగులు కాకుండా మరో రెండు ఏనుగులు సమీపంలో ఉన్న తివ్వాకొండపైకి వెళ్లిపోయి ఉంటాయని భావిస్తున్నాం.
కొండపై ఉన్న గ్రామాల్లో ఏనుగుల అరుపులు వినిపించాయని గ్రామస్థులు చెప్పారు. నిన్న అర్థరాత్రి ఈ ప్రమాదం జరిగింది.
సాధారణంగా ఏనుగులు తొండంతో ఎదురుగా ఉన్న వస్తువులను తాకుతాయి. అలాగే ఒక ఏనుగు ఈ ట్రాన్ఫార్మర్ను తాకడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ఇక్కడ పరిస్థితిని చూస్తే అర్థమవుతోంది.
అంతే కాకుండా ఏనుగులు గుంపుగా, ఒకదాని పక్కన మరొకటి వెళ్తూంటాయి. అందుకే ఒక ఏనుగుకి విద్యుత్ షాక్ తగలగానే మిగతా ఏనుగులు కూడా ప్రమాదానికి గురై ఉంటాయి.
స్థానికుల ద్వారా ఏనుగులు మృతి సమాచారం తెలిసింది. దీనిపై భామిని పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వీరితో పాటు అటవీ శాఖ అధికారులు కూడా ఇక్కడ ఏం జరిగిందనే విషయంలో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు."
ప్రస్తుతం ఏనుగులకు ఇక్కడే పోస్ట్ మార్టం నిర్వహించి, పాతిపెడతామని.. ఏనుగులను పాతిపెట్టే స్థలం ఇచ్చేందుకు ఒక రైతు అంగీకరించారని ఆమె చెప్పారు.
గత 15 ఏళ్లకు పైగా ఈ ప్రాంతంలో సంచరిస్తున్న ఏనుగులను తిరిగి అరణ్యంలోకి పంపించేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయని, కాకపోతే విజయం సాధించలేకపోయామన్నారు.
2006 నుంచి ఇప్పటివరకు మొత్తం ఎనిమిది ఏనుగులు మరణించగా.. ఏనుగుల దాడిలో 20 మందికి పైగా వ్యక్తులు మరణించారని, అందులో అటవీశాఖలో పని చేసే ట్రాకర్లు కూడా ఉన్నారని డీఎఫ్ఓ ప్రసూన చెప్పారు.
బహుభార్యత్వాన్ని నిషేధించే ప్రతిపాదనను పరిశీలించేందుకు అస్సాం ప్రభుత్వం నలుగురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.
ఈ కమిటీకి రిటైర్డ్ జడ్జి రూమీ ఫుకన్ నేతృత్వం వహిస్తారు.
కమిటీ నివేదికను 60 రోజుల్లో సమర్పిస్తుందని ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు.
రాష్ట్రంలో బహుభార్యత్వాన్ని నిషేధించే హక్కు శాసనసభకు ఉందో లేదో కమిటీ పరిశీలిస్తుంది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో అస్సాం ప్రభుత్వం బాల్య వివాహాలను నిరోధించేందుకు పూనుకుంది. ఆ దిశలో వేలాది మందిని అరెస్టు చేసింది.
బాల్య వివాహాల నిషేధంపై కొనసాగుతున్న చర్యలను మరింత ఉధృతం చేస్తామని శర్మ అంతకుముందు చెప్పారు.
2026 నాటికి అస్సాంలో బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల కఠిన చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు.
కాగా, 2026లో అస్సాం శాసనసభకు తదుపరి ఎన్నికలు జరగనున్నాయి. దానికి అనుగుణంగా రాష్ట్రం ఈ చర్యలు తీసుకుంటోందంటూ, దీన్ని రాజకీయాలతో ముడిపెట్టి చూస్తున్నారు కొందరు విశ్లేషకులు.
ట్విట్టర్కు త్వరలో కొత్త సీఈఓ వస్తారని ఎలాన్ మస్క్ తెలిపారు. కొత్త సీఈఓ ఒక మహిళ అని ఆయన ట్వీట్ ద్వారా తెలుస్తోంది.
ఆమె పేరును మస్క్ ఇంకా ప్రకటించలేదు. మరో ఆరు వారాల్లో ఆమె బాధ్యతలు స్వీకరిస్తారని వెల్లడించారు.
సీఈఓ పదవి నుంచి తప్పుకున్నాక మస్క్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. తద్వారా ప్రొడక్షన్పై దృష్టి పెట్టనున్నారు.
మస్క్ గత ఏడాది 44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్ని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
అయితే, కిందటి ఏడాది ఆన్లైన్ పోల్లో మస్క్ సీఈవో పదవి నుంచి వైదొలగాలని ట్విట్టర్ వినియోగదారులు కోరారు.
మస్క్ తాజా ప్రకటన తరువాత ఆయన కంపెనీ టెస్లా షేర్ ధరలు పెరిగాయి.
ట్విటర్ కొనుగోలు తర్వాత మస్క్ టెస్లాపై సరిగ్గా దృష్టి పెట్టడంలేదని వాటాదారులు ఆరోపించారు. దానివల్ల ఈ కార్ల కంపెనీ బ్రాండ్ విలువ కొంత పడిపోయింది.
అల్-ఖాదిర్ ట్రస్ట్ కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈరోజు (శుక్రవారం) ఇస్లామాబాద్ హైకోర్టుకు హాజరుకానున్నారు.
శుక్రవారం 11 గంటలకు ఆయన కోర్టులో హాజరవుతారు.
ఈ కేసులో ఇమ్రాన్ ఖాన్ అరెస్టు చట్టవిరుద్ధమని పేర్కొంటూ, నేడు ఇస్లామాబాద్ హైకోర్టుకు హాజరుకావాలని పాకిస్తాన్ సుప్రీంకోర్టు గురువారం కోరింది.
ఇమ్రాన్ఖాన్ను అరెస్టు చేయడం చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు ప్రకటించినప్పటికీ, ఆయన ఇంటికి వెళ్లేందుకు అనుమతించలేదు.
ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ తరువాత, పాకిస్తాన్లో భీకర హింస, నిరసనలు చోటుచేసుకున్నాయి. భద్రత దృష్ట్యా శుక్రవారం ఇస్లామాబాద్ హైకోర్టుకు హాజరయ్యే వరకు ఇమ్రాన్ ఖాన్ కోర్టు పర్యవేక్షణలో, పోలీసు రక్షణలో ఉండాలని సుప్రీంకోర్టు పేర్కొంది.
అలాగే, ఆయన్ను పోలీసు లైన్ హెడ్క్వార్టర్స్లో కలవాలనుకునే బంధువులు, న్యాయవాదుల పేర్ల జాబితాను ముందే ఇవ్వాలని సూచించింది.
ఇంటికి వెళ్లే అవకాశమివ్వాలని ఇమ్రాన్ ఖాన్ చేసిన విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. ప్రస్తుతమున్న పోలీస్ గెస్ట్ హౌస్లోనే ఉండాలని సూచించింది.