ధన్యవాదాలు
ఇక్కడితో నేటి బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టు చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు ప్రకటించింది. ఇమ్రాన్ను విడుదల చేయాలని ఆదేశాలిచ్చింది.
ఇక్కడితో నేటి బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టు చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు ప్రకటించింది. ఇమ్రాన్ను విడుదల చేయాలని ఆదేశాలిచ్చింది.
ఇస్లామాబాద్ హైకోర్టుకు వెళ్లాలని ఇమ్రాన్ ఖాన్కు సుప్రీంకోర్టు సూచించింది. హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అంగీకరించాల్సి ఉంటుందని ఆయనకు తెలిపింది.
అయితే, ఇమ్రాన్ ఖాన్ను ఈ రోజు విడుదల చేయడం లేదు.
ఆయన ఇంకా పోలీస్ లైన్స్ గెస్ట్హౌస్లోనే ఉన్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎవరైనా పది మంది ఆయన్ను కలిసేందుకు అవకాశం కల్పించారు.
ఇమ్రాన్ రేపు ఉదయం ఇస్లామాబాద్ హైకోర్టుకు హాజరుకావాల్సి ఉంది.
తన ఇంటికి వెళ్లే అవకాశమివ్వాలని ఇమ్రాన్ ఖాన్ చేసిన విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. ప్రస్తుతమున్న పోలీస్ గెస్ట్ హౌస్లోనే ఉండాలని సూచించింది.
సుప్రీంకోర్టు పర్యవేక్షణలో పోలీస్ గెస్ట్ హౌస్లోనే ఇమ్రాన్ ఖాన్ ఉండనున్నారు. ఆయనకు రక్షణ కల్పించేందుకే ఈ నిర్ణయమని కోర్టు తెలిపింది.
హైకోర్టుకు హాజరయ్యేందుకు వచ్చిన ఇమ్రాన్ ఖాన్ను మంగళవారం కోర్టు ఆవరణలోనే అవినీతి కేసులో భద్రతా బలగాలు అరెస్టు చేశాయి.
ఇమ్రాన్ అరెస్టు తర్వాత పాకిస్తాన్లో హింస చెలరేగింది.
దేశ రాజధాని దిల్లీ పరిధిలో ప్రభుత్వ యంత్రాంగంపై అధికారం ఎవరిదనే విషయంలో సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు చెప్పింది.
అధికార పరిధి విషయంపై దిల్లీ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య నడుస్తున్న కేసుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది.
నేషనల్ క్యాపిటల్ రీజియన్(ఎన్సీఆర్) పరిధిలోకి వచ్చే అధికార యంత్రాంగంపై దిల్లీ ప్రభుత్వానికే అధికారం ఉంటుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. చట్టాలు చేసే అధికారం కూడా దిల్లీ అసెంబ్లీకి ఉంటుందని తెలిపింది. అయితే శాంతిభద్రతలు, భూములకు సంబంధించిన వ్యవహారాలను ఈ అధికార పరిధి నుంచి మినహాయించింది.
''ప్రభుత్వానికి నియంత్రణాధికారం లేదని అధికారులు భావిస్తే, అది వారి బాధ్యతలను బలహీనపరుస్తుంది. ప్రభుత్వంపైనా ప్రభావం చూపుతుంది. అధికారులు మంత్రులకు నివేదించడం మానేసి, వారి సూచనలను పట్టించుకోకపోతే సమాజం పట్ల బాధ్యతను ప్రభావితం చేస్తుంది'' అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
జస్టిస్ చంద్రచూడ్తోపాటు ఈ ధర్మాసనంలో జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పు చెప్పింది.
శివసేన వివాదంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పు చెప్పింది.
నిరుడు మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్షపై గవర్నర్ నిర్ణయం, విప్ నియామకంపై అసెంబ్లీ స్పీకర్ తీసుకున్న నిర్ణయాలు సరైనవి కావని సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది.
సభలో బలపరీక్ష జరగకుండానే ముఖ్యమంత్రి పదవికి ఉద్దవ్ థాకరే రాజీనామా చేశారని, అందువల్ల అప్పటి మహావికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని పునరుద్ధరించలేమని న్యాయస్థానం తెలిపింది.
ఉద్దవ్ థాకరే తన ఇష్టప్రకారమే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారని, అందువల్ల ప్రభుత్వ పునరుద్ధరణ సాధ్యం కాదని స్పష్టం చేసింది.
అప్పుడు మహారాష్ట్ర గవర్నర్గా భగత్ సింగ్ కోష్యారీ ఉన్నారు.
ఉద్ధవ్ థాకరే రాజీనామా తర్వాత బీజేపీ మద్దతుతో శివసేన 'రెబల్' నాయకుడు ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రి అయ్యారు.
అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం ప్రాంగణంలో బుధవారం అర్థరాత్రి మరో పేలుడు సంభవించింది. అయితే, ప్రాణనష్టం జరిగినట్టు సమాచారం లేదు.
గడచిన ఆరు రోజుల్లో స్వర్ణ దేవాలయం సమీపంలో ఇది మూడో పేలుడు.
తాజా పేలుడు తక్కువ తీవ్రతతో కూడినదని పంజాబ్ డీసీపీ గౌరవ్ యాదవ్ చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి, అయిదుగురిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. పేలుడు స్థలాన్ని సీజ్ చేశారు.
"అజాద్వీర్ సింగ్, అమ్రీక్ సింగ్, సాహిబ్ సింగ్, హర్జీత్ సింగ్, ధర్మేంద్ర సింగ్ అనే అయిదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నాం, వీరిలో ముగ్గురు పేలుడు పదార్థాలను సేకరించడంలో భాగం పంచుకున్నారు. ఒక మహిళను కూడా విచారిస్తున్నాం" అని డీజీపీ ట్వీట్ చేశారు.
గడచిన ఆరు రోజుల్లో అమృత్సర్లో ఇది మూడో పేలుడు. మొదటి రెండు పేలుళ్లు స్వర్ణ దేవాలయం పరిసరాల్లో జరిగాయి.
మే 6, శనివారం హెరిటేజ్ కారిడార్లో మొదటి పేలుడు జరిగింది. ఈ పేలుడులో ఓ వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి.
మే 8, సోమవారం రెండో పేలుడు కూడా హెరిటేజ్ కారిడార్లోనే జరిగింది. ఈ రెండు పేలుళ్లు కూడా తక్కువ తీవ్రత కలిగినవని డీజీపీ తెలిపారు.
కాగా, తాజా పేలుడు స్వర్ణ దేవాలయం ప్రాంగణంలోని గురు రాందాస్ సరన్ వెనుక భాగంలో ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో జరిగింది.
గురువారం తెల్లవారుజామున గాజా స్ట్రిప్లోని అపార్ట్మెంట్పై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ (పీఐజే) టాప్ కమాండర్ మరణించారు.
పీఐజే క్షిపణి విభాగం అధిపతి అలీ హసన్ ఘాలి అలియాస్ అబూ ముహమ్మద్ గురువారం ఉదయం దాడిలో మరణించినట్లు ఆ సంస్థ సాయుధ విభాగం ధృవీకరించింది.
హమద్ రెసిడెన్షియల్ సిటీలోని భవనంలో అయిదవ అంతస్తులో ఉన్న ఈ అపార్ట్మెంట్పై ఇజ్రాయెల్ యుద్ధ విమానం దాడి చేసింది. ఈ దాడిలో మరో వ్యక్తి కూడా మరణించారు.
బుధవారం గాజాలో పాలస్తీనా మిలిటెంట్లు 460కి పైగా రాకెట్లను ఇజ్రాయెల్పై ప్రయోగించారు.
ఇజ్రాయెల్ కూడా గాజాలోని 130 మిలిటెంట్ స్థావరాలపై దాడి చేసింది.
గాజాలో గత తొమ్మిది నెలల్లో ఇదే అతిపెద్ద యుద్ధమని అంటున్నారు.
ఈ యుద్ధంలో 24 మందికి పైగా మరణించారని, అందులో మరో ముగ్గురు పీఐజే కమాండర్లు కూడా ఉన్నారని పాలస్తీనా ఆరోగ్య అధికారులు చెబుతున్నారు.
గాజా నుంచి కురిసిన రాకెట్ల వర్షంలో చాలామంది ఇజ్రాయెల్ పౌరులు గాయపడ్డారు.
గాజాలో హమస్ తరువాత రెండవ పెద్ద మిలిటెంట్ గ్రూప్ పీఐజే. పాలస్తీనియన్ల మరణాలకు ప్రతీకారం తీర్చుకుంటానని ప్రమాణం చేసింది.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల అప్డేట్ల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.