లైవ్ అప్డేట్స్ సమాప్తం
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ అప్డేట్స్ను ఇంతటితో ముగిస్తున్నాం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల అప్డేట్స్తో రేపు ఉదయం కలుద్దాం.
దిల్లీ ఎక్సైజ్ విధానం కేసులో ఏప్రిల్ 16న విచారణకు హాజరు కావాలంటూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు సీబీఐ సమన్లు పంపింది.
లైవ్ అప్డేట్స్ సమాప్తం
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ అప్డేట్స్ను ఇంతటితో ముగిస్తున్నాం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల అప్డేట్స్తో రేపు ఉదయం కలుద్దాం.

ఫొటో సోర్స్, Arvind Kejriwal
దిల్లీ ఎక్సైజ్ విధానం కేసులో ఏప్రిల్ 16న విచారణకు హాజరు కావాలంటూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు సీబీఐ సమన్లు పంపింది.
ఈ విషయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ధ్రువీకరించారు.
ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయారని ఆరోపిస్తూ, సీబీఐ సమన్లతో కేజ్రీవాల్ పోరాటమేమీ ఆగదని సంజయ్ సింగ్ చెప్పారు.
ఏప్రిల్ 16న కేజ్రీవాల్ అరెస్టుకు, ఆయన్ను జైలుకు పంపేందుకు మోదీ ప్రభుత్వం కుట్ర పన్నిందని సంజయ్ సింగ్ ఆరోపించారు. ఈ చర్యలతో కేజ్రీవాల్ గొంతు నొక్కలేరని వ్యాఖ్యానించారు.
ఆదివారం కేజ్రీవాల్ సీబీఐ విచారణకు హాజరవుతారని ఆయన తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
మద్యం విధానం నిబంధనల్లో గోల్మాల్ జరిగిందనే ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేయించాలని దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ గతంలో సిఫారసు చేశారు. దీంతో సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది.

ఫొటో సోర్స్, Getty Images
బాలుడికి ముద్దు వీడియో వివాదంలో బౌద్ధ మతగురువు దలై లామాకు టిబెట్ ప్రభుత్వాధినేత పెన్పా త్సెరింగ్ మద్దతుగా నిలిచారు. దలై లామా చేసిన పనిలో తప్పేమీ లేదని.. అది ఆయన ''ప్రేమపూర్వక ప్రవర్తనను తెలియజేస్తోంది'' అన్నారు.
ఈ ముద్దు వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయన ప్రవర్తనపై నెటిజన్ల నుంచి విమర్శలొచ్చాయి. దీంతో ఈ ఘటనపై దలై లామా కార్యాలయం క్షమాపణలు చెప్పింది.
అయితే, దలై లామా చర్యలను వక్రీకరించారని, ఆ వివాదం ఆయన భక్తులను బాధకు గురిచేసిందని త్సెరింగ్ గురువారం అన్నారు. ''దలై లామా ఎల్లప్పుడూ బ్రహ్మచర్యం, పవిత్రతను పాటిస్తారు. ఏళ్ల తరబడి సాగించిన ఆధ్యాత్మిక సాధన ఆయన్ను ఇంద్రియాల కోరికలను జయించేలా చేసింది.'' అని త్సెరింగ్ చెప్పారు.
ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం వెనక చైనా మద్దతుదారుల హస్తం ఉందని విచారణలో తెలుస్తోందని త్సెరింగ్ చెప్పారు. అయితే అందుకు సంబంధించి ఎలాంటి ఆధారాలను ఆయన బయటపెట్టలేదు. ''ఈ ఘటనలో రాజకీయ కోణాన్ని తోసిపుచ్చలేం'' అని ఆయన అన్నారు.
చిన్నారులతో దలై లామా అసభ్యంగా ప్రవర్తించారంటూ హక్కుల కార్యకర్తల నుంచి అంతర్జాతీయ స్థాయిలో విమర్శలు వచ్చాయి. దాంతో దలై లామా కార్యాలయం బాలుడికి, అతని కుటుంబానికి, అతని స్నేహితులకు క్షమాపణలు చెప్పింది. సరదాగా ఉండడంపై కూడా విమర్శలు వస్తున్నాయని వ్యాఖ్యానిస్తూ, ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసింది.

ఫొటో సోర్స్, ANI
టైమ్ మ్యాగజైన్ ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో బాలీవుడు నటుడు షారుక్ ఖాన్, సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళికి చోటుదక్కింది.
ప్రపంచంలో వంద మంది ప్రభావిత వ్యక్తులతో విడుదల చేసిన ఈ జాబితాలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్, సింగర్ బెయోన్స్ కూడా ఉన్నారు.
రాజమౌళి డైరెక్ట్ చేసిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఇటీవల ఆస్కార్ అవార్డు లభించింది. ఆర్ఆర్ఆర్ సినిమాతో అంతర్జాతీయ వేదికలపై రాజమౌళి గుర్తింపు తెచ్చుకున్నారు.
టైమ్ మ్యాగజైన్లో చోటుదక్కించుకున్న సందర్భంగా షారుక్ ఖాన్ ప్రొఫైల్ను సినీ నటి దీపికా పదుకొనె రాశారు.
'' షారుక్ ఖాన్ని మొదటిసారి కలిసిన క్షణాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇప్పటికి 16 ఏళ్లు అయింది. షారుక్ ఖాన్ ఒక మంచి నటుడిగా అందరికీ తెలుసు. కానీ, ఆయన మనసు చాలా మంచిది. ఆయన దయ, దాతృత్వం ఉన్నవారు. షారుక్ గురించి వివరించాలంటే ఈ 150 పదాలు సరిపోవు'' అని దీపిక రాశారు.

ఫొటో సోర్స్, YSRCONGRESS
వై.ఎస్. వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితుల్లో ఒకరైన ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు.
ఉదయం 5గంటలకు ఆయన్ను అరెస్ట్ చేసినట్లు ఉదయ్ కుమార్ తండ్రి జయప్రకాశ్ రెడ్డికి సీబీఐ అధికారులు సమాచారం ఇచ్చారు.
హైదరాబాదులోని సీబీఐ కోర్టులో హాజరు పరిచేందుకు ఆయన్ను కడప నుంచి తరలించారు. మరోవైపు ఉదయ్ తండ్రి జయప్రకాష్ రెడ్డిని కూడా సీబీఐ అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తోంది.
హత్య జరిగిన రోజు అవినాష్ రెడ్డితో పాటు ఘటన స్థలానికి వెళ్లిన ఉదయ్ అంబులెన్స్, ఫ్రీజర్, డాక్టర్లను రప్పించడంలో కీలక పాత్ర పోషించినట్లు సీబీఐ అధికారులు భావిస్తున్నారు.
గతంలో కూడా సీబీఐ అధికారులు పలుమార్లు అధికారులు ఉదయ్ కుమార్ను విచారించారు.

ఫొటో సోర్స్, CASTRO COUNTY SHERIFF'S OFFICE
టెక్సాస్లోని ఒక డెయిరీ ఫామ్లో జరిగిన జరిగిన పేలుడులో సుమారు 18 వేల ఆవులు చనిపోయాయి. ఈ వారం మొదట్లో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక అధికారులు చెప్పారు.
డిమ్మిట్ పట్టణానికి సమీపంలోని సౌత్ ఫోర్క్ డెయిరీలో జరిగిన ఈ పేలుడులో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది. డెయిరీలోని మిషనరీలో మీథేన్ గ్యాస్ కారణంగా ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
పోలీసులు, అత్యవసర సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. మంటల్లో చిక్కుకున్న ఒక వ్యక్తిని రక్షించి వెంటనే ఆస్పత్రికి తరలించారు.
ఈ ప్రమాదంలో ఎన్ని ఆవులు చనిపోయాయనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. సుమారు 18 వేల ఆవులు చనిపోయి ఉండొచ్చని అంచనా వేస్తున్నట్టు పోలీసులు బీబీసీతో చెప్పారు.
ఆ ప్రాంతమంతా మంటలు వ్యాపించడంతో ఆవులు చనిపోయాయని పోలీస్ అధికారి రివెరా స్థానిక మీడియా సంస్థ కేఎఫ్డీఏకి చెప్పారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల అప్డేట్ల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.