నేటి లైవ్ పేజీ అప్డేట్స్ సమాప్తం
నేటి బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్స్ ఇంతటితో ముగిస్తున్నాం.
మళ్లీ రేపు ఉదయం కలుద్దాం.
అంత వరకు సెలవు.
ధన్యవాదాలు!
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మృతుడు అత్యాచారం, హత్య ఆరోపణల్లో నిందితుడిగా ఉన్నాడు. అతడు మరో ఇద్దరు నేరస్తులతో పాటు మంగళవారం నాడు ధాకువాఖానా కోర్టు సమీపంలో పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకుని పారిపోయాడు.
నేటి బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్స్ ఇంతటితో ముగిస్తున్నాం.
మళ్లీ రేపు ఉదయం కలుద్దాం.
అంత వరకు సెలవు.
ధన్యవాదాలు!
అత్యాచారం, హత్య ఆరోపణలున్న ఒక నిందితుడు పోలీసు కస్టడీ నుంచి తప్పించుకోగా, ఆగ్రహించిన గ్రామస్తులు అతడిని పట్టుకుని కొట్టి చంపిన ఘటన అస్సాంలో చోటు చేసుకుంది.
లఖీంపూర్ జిల్లాలోని ధాకువాఖానా వద్ద కిల్కిలి గ్రామంలో గురువారం ఉదయం ఈ సంఘటన జరిగింది.
మృతుడిని 45 ఏళ్ల వయసున్న రాజు బారువా గా గుర్తించారు.
పోలీసుల కథనం ప్రకారం.. మృతుడు అత్యాచారం, హత్య ఆరోపణల్లో నిందితుడిగా ఉన్నాడు. అతడు మరో ఇద్దరు నేరస్తులతో పాటు మంగళవారం నాడు ధాకువాఖానా కోర్టు సమీపంలో పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకుని పారిపోయాడు. అయితే గురువారం తెల్లవారుజామున అతడిని స్థానికులు కొందరు పట్టుకుని తీవ్రంగా కొట్టారు.
ఈ ఘటన సమాచారం తెలిసిన వెంటనే తాము సంఘటన ప్రాంతానికి చేరుకున్నామని పోలీసులు చెప్తున్నారు. అప్పటికే తీవ్రంగా గాయపడిన రాజును కాపాడటానికి తాము ప్రయత్నించామని, కానీ అక్కడ జనం చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారని వారు పేర్కొన్నారు.
రాజును కాపాడటానికి ప్రయత్నించిన ఇద్దరు పోలీసు సిబ్బంది కూడా ఈ ఘటనలో గాయపడ్డారు.
‘‘ఈ సంఘటన గురించి మాకు గురువారం ఉదయం తెలిసింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సమయానికి నిందితుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ అతడు చనిపోయాడు’’ అని లఖీంపూర్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ బి.ఎం.రాజ్ఖోవా మీడియాకు చెప్పారు.
మృతుడు రాజు మీద డజనుకు పైగా దోపిడీ కేసులు, అత్యాచారం, హత్య కేసులు నమోదై ఉన్నాయని ఆయన తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించి గుర్తు తెలియని వ్యక్తుల మీద పోలీసులు హత్య కేసు నమోదు చేశారు.
చైనాలోని సముద్ర తీర నగరం షియామెన్లో ఈ వారం సుమారు 40 కరోనావైరస్ కేసులను గుర్తించటంతో.. నగరంలోని 50 లక్షల మందికి ప్రజలు అందరూ కోవిడ్-19 టెస్టులు చేయించుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.
కేవలం ప్రజలు మాత్రమే కాదు.. కొన్ని రకాల సముద్రజీవులకు కూడా కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని అధికారిక నోటీసు పేర్కొంది.
సముద్రం మీద వేటకు వెళ్లిన మత్స్యకారులు తిరిగి వచ్చినపుడు.. వారికి, వారు పట్టితెచ్చిన చేపలు తదితర జలచరాలకు కూడా కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని షియామెన్ జిమే మారిటైమ్ పాండమిక్ కంట్రోల్ కమిటీ ఇటీవల నోటీసులు జారీ చేసింది.
ఫలితంగా.. బతికున్న చేపలు, పీతలకు కోవిడ్ ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తున్న వీడియోలు చైనాలో టిక్టాక్ తరహా సోషల్ మీడియా వేదిక డోయిన్లో వైరల్ అయ్యాయి.
అయితే.. చేపలకు కోవిడ్ పరీక్షలు చేయటం ఇదే మొదటిసారి కాదు.
ఇంతకుముందు కోవిడ్ తీవ్రంగా వ్యాపించిన హైనాన్ నుంచి తాము పాఠాలు నేర్చుకున్నామని.. షియామెన్ మునిసిపల్ ఓషనిక్ డెవలప్మెంట్ బ్యూరో అధికారి ఒకరు సౌత్ చైనా మోర్నింగ్ పోస్ట్ వార్తా పత్రికతో చెప్పారు.
‘‘స్థానిక మత్స్యకారులు, విదేశీ మత్స్యకారుల మధ్య సముద్ర ఉత్పత్తుల లావాదేవీల వల్ల.. మత్స్యకారులకు, వారు పట్టి తెచ్చే జలచరాలకు కోవిడ్ పరీక్షలు నిర్వహించాలనే నిర్ణయం తీసుకుని ఉండవచ్చు’’ అని ఆయన పేర్కొన్నారు.
సముద్రజీవులకు, కరోనావైరస్కు సంబంధం ఉందేమోనని చైనా మీడియా చాలా కాలంగా ఆందోళనలు వ్యక్తం చేస్తోంది. కరోనావైరస్ తొలిసారి వ్యాపించింది కూడా.. సెంట్రల్ చైనా నగరమైన వూహాన్లోని ఒక జంతు, సముద్రజీవుల మార్కెట్లోనే.
సముద్రజీవుల్లో కోవిడ్ వైరస్ జీవించే అవకాశం లేనప్పటికీ.. చైనాలో కోవిడ్ వ్యాప్తి ఉదంతాల్లో చాలా వాటికి ఓడరేవు కార్మికులతో లింకు ఉంది. అంటే కోల్డ్ స్టోరేజీలో సరుకులను నిర్వహించేవారితో లేదా సముద్రజీవుల మార్కెట్లలో పనిచేసే వారితో ఆయా ప్రాంతాల్లో కోవిడ్ వ్యాప్తికి సంబంధం ఉందని భావిస్తున్నారు.
కేవలం చేపలకే కాదు.. గత మే నెలలో జేజియాంగ్లోని హుజో జూ పార్కులో ఒక హిప్పోకు కూడా కోవిడ్ పరీక్షలు నిర్వహించిన వీడియో వైరల్ అయింది.
కుక్కలు, పిల్లులు, కోళ్లు, పాండాలు వంటి ఇతర జంతువులకు పీసీఆర్ పరీక్షలు నిర్వహించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో పోస్టయ్యాయి.
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఎవరితోనో మాట్లాడుతున్న న్యూడ్ వీడియోగా ప్రచారంలో ఉన్న దానిని నిర్ధారిస్తూ అమెరికాకి చెందిన ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చిందని సాగుతున్న ప్రచారం వాస్తవం కాదంటూ ఏపీ సీఐడీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ అన్నారు.
వీడియో కాల్లో మాట్లాడుతున్న ఆ ఇద్దరిలో ఎవరో ఒకరి ఫోన్ నుంచి ఒరిజినల్ వీడియో లభిస్తే తప్ప దానిని నిర్ధారించడం సాధ్యం కాదంటూ అనంతపురం ఎస్పీ ఫకీరప్ప గతంలో చెప్పిన మాటలను సునీల్ కుమార్ మరోసారి గుర్తుచేశారు.
కొంతమంది వ్యక్తులు తప్పుడు రిపోర్ట్ను ప్రచారం చేస్తున్నారనే అంశంపై వివరాలు కోరుతూ ప్రభుత్వం ఆదేశించడంతో తాము అమెరికాలోని ఎక్లిప్స్ ఫోరెన్సిక్స్ ల్యాబ్ను సంప్రదించినట్టు సునీల్ కుమార్ తెలిపారు.
ఆ ల్యాబ్ తరపున జిమ్ స్టాఫర్డ్ పంపించిన ఇ-మెయిల్ను మీడియాకు అందించారు.
ఆ వీడియో కాల్ ఒరిజినల్ అంటూ చెబుతున్న సర్టిఫికెట్ ఒరిజినల్ కాదని తేల్చినట్టు సునీల్ కుమార్ వెల్లడించారు.
ఏ వీడియో అయినా ఒరిజినల్ ఉంటే తప్ప ఏ ఫోరెన్సిక్ ల్యాబ్ లోనూ నిర్ధారణ జరగదన్నారు.
‘ఈ కేసులో పోతిని అనే వ్యక్తి నన్ను రిపోర్ట్ మార్చమని అడిగారు. దానికి సమాధానం ఇవ్వకముందే దాన్ని ప్రచారంలో పెట్టారు’ అని జిమ్ స్టాఫర్డ్ వెల్లడించారని సునీల్ అన్నారు.
నిపుణుల నివేదికను ఏమాత్రం మార్చినా అది చెల్లుబాటు కాదు అని ఆయన అన్నారు. ఐటీ యాక్ట్, ఐపీసీ కింద కొన్ని నేరాలు జరిగినట్టు నిర్ధారణ జరిగింది. వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మహారాష్ట్రలోని హరిహరేశ్వర్ బీచ్లో ఏకే-47 రైఫిళ్లు, బులెట్లు ఉన్న ఒక అనుమానాస్పద బోటును పోలీసులు గుర్తించారు.
ముందు జాగ్రత్త చర్యగా అప్రమత్తత ప్రకటించారు.
గురువారం ఉదయం రాయగడ్ జిల్లాలోని హరిహరేశ్వర్ బీచ్ సమీపంలో సముద్రంలో అనుమానాస్పదంగా ఉన్న బోటును గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఆ బోటులో ఎవరూ లేరు. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో బోటును ఒడ్డుకు తీసుకువచ్చిన పోలీసులు అందులోని ఒక నల్లని పెట్టెలో మూడు ఏకే-47 తుపాకులు, కొన్ని బులెట్లు ఉండటం గుర్తించారు.
దీంతో సీనియర్ అధికారులు కూడా అక్కడికి చేరుకుని గాలింపు ప్రారంభించారు. ఈ బోటు, అందులోని రైఫిళ్ల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్, రాయగడ్ పోలీసులు, కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగి ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాయి.
పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం ఆ బోటు మీద ‘నెప్ట్యూన్ మారీటైమ్ సెక్యూరిటీ’ అని రాసి ఉంది. ఈ బోటు ఒమన్ దేశానికి చెందినదిగా భావిస్తున్నట్లు కేంద్ర దర్యాప్తు సంస్థలకు చెందిన వర్గాలు చెప్తున్నాయి.
గత జూన్ నెలలో ఒమన్కు చెందిన ఒక బోటు నుంచి ఎస్ఓఎస్ మెసేజ్ (ప్రమాదంలో అత్యవసర సహాయ సందేశం) వచ్చింది. ఇప్పుడు రాయ్గడ్ తీరంలో కనిపించిన బోటు అదేనేమో అనే విషయాన్ని తనిఖీ చేస్తున్నారు.
28 ఎకరాల్లో ఉన్న ఈ ద్వీపంలో హెలీప్యాడ్, లైట్ హౌస్, 5 బెడ్ రూంల ఇల్లు, సోలార్ పవర్, సహజ నీటి వనరులు సహా ఎన్నో సౌకర్యాలున్నాయి. కానీ దీని రేటు వింటే, మీరూ కొనేయాలని అనుకుంటారు.
బీజేపీ నేత షానవాజ్ హుస్సేన్ మీద రేప్ కేసు పెట్టాలంటూ దిల్లీ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
తనను రేప్ చేసి చంపేస్తానంటూ బెదిరించాడని షా నవాజ్ హుస్సేన్ మీద 2018లో ఒక మహిళ ఆరోపణలు చేశారు.
బుధవారం రేప్ కేసు నమోదు చేయాల్సిందిగా దిల్లీ హైకోర్టు ఆదేశించింది. కేసు ఎందుకు నమోదు చేయకూడదో పోలీసులు చెప్పలేక పోయారని కోర్టు వ్యాఖ్యానించింది. అలాగే మూడు నెలల్లో విచారణ పూర్తి చేయాల్సిందిగా ఆదేశించింది.
అఫ్గానిస్తాన్ రాజధాని కాబుల్లోని మసీదులో జరిగిన పేలుళ్లలో మృతుల సంఖ్య 21కి పెరిగింది. 33 మంది గాయపడ్డారు.
బుధవారం సాయంత్రం ప్రార్థనలు చేసున్న సమయంలో ఈ పేలుళ్లు జరిగాయి.
మసీదు ఇమామ్ సిద్దిఖీ కూడా చనిపోయినట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఈ దాడి వెనుక ఎవరున్నారో ఇంకా తెలియలేదు.
సుమారు వారం కిందట కాబుల్లోనే తాలిబాన్కు అనుకూలంగా ఉండే మతబోధకుడు ఆత్మాహుతి దాడిలో చనిపోయారు. ఈ దాడి పని తమదేనని ఇస్లామిక్ స్టేట్ నాడు ప్రకటించుకుంది.
ఉడుపిలోని బ్రహ్మగిరి సర్కిల్లో వీర్ సావర్కర్ విగ్రహం పెట్టేందుకు అనుమతి ఇవ్వాలంటూ జిల్లా అధికారులను బీజేపీ ఓబీసీ మోర్చా నేషనల్ జనరల్ సెక్రటరీ యశ్పాల్ సువర్ణ కోరారు.
ఎమ్ఐఎమ్ అధిపతి అసదుద్దీన్ ఓవైసీని కించపరిచేలా కామెంట్లు చేశారనే ఆరోపణలతో అఫ్జల్ గంజ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
భారతీయ జనతా యువ మోర్చా(బీజేవైఎం) హైదరాబాద్ విభాగం ఇంచార్జ్ సాయి రాం యాదవ్ అలియాస్ లడ్డు యాదవ్, అగస్టు 15న అసదుద్దీన్ ఓవైసీని కించపరిచేలా మాట్లాడారంటూ సెక్షన్ 341, 188, 504 కింద కేసు బుక్ చేశారు.
ఉత్తర్ ప్రదేశ్లో మైనర్ బాలికను ఒక ముస్లిం మతబోధకుడు రేప్ చేసినట్లుగా ఆరోపణలు వచ్చాయని వార్తా సంస్థ ఏఎన్ఐ రిపోర్ట్ చేసింది.
‘మతపరమైన కార్యక్రమం పేరుతో ఒక మైనర్ బాలికను రేప్ చేశారనే ఆరోపణలు రావడం వల్ల ఫక్రీ ఆలం అనే మతబోధకున్ని అరెస్ట్ చేశాం. పోస్కో యాక్ట్తోపాటు ఐపీసీ 406, 376 కింద కేసు బుక్ చేశాం.’ అని లఖ్నవూ పోలీస్ కమిషనరేట్ తెలిపింది.
నగ్న వీడియోలు బయటపెడతామంటూ ఒక మహిళను వేధించిన కేసులో ఇద్దరిని అరెస్టు చేసిన మచిలీపట్నం పోలీసులు తెలిపారు.
పోలీసుల ప్రకారం...
రాజమహేంద్రవరం నగరానికి చెందిన ఓ మహిళ భర్తతో విభేదించి ఒంటరిగా జీవిస్తోంది. ఆమె డబ్బులు అవసరం కావడంతో హన్సకుమార్ జైన్ అనే వడ్డీ వ్యాపారిని సంప్రదించింది. తక్కువ వడ్డీకి అప్పు కావాలంటే తాను చెప్పినట్టు చేయాలంటూ అతను షరతు పెట్టాడు.
ఆ షరతు ప్రకారం ఆమె నగ్నంగా వీడియో కాల్ చేసేందుకు అంగీకరించారు. కాల్ చేసేటప్పుడు దానిని రికార్డ్ చేసిన హన్సకుమార్, విజయవాడ సమీపంలోని కానూరికి చెందిన తన మిత్రుడు చందుకి పంపించారు.
చందు తన డివైస్లో ఆ వీడియోను కాపీ చేసేటప్పుడు కొన్ని స్క్రీన్ షాట్స్ తీశాడు. వాటిని అడ్డం పెట్టుకుని అప్పు తీసుకున్న మహిళను వేధించడం మొదలుపెట్టారు.
తాము చెప్పినట్టుగా అన్నింటికీ అంగీకరించాలని లేదంటే పోర్న్ సైట్లలో ఆ వీడియో అప్ లోడ్ చేయడమే కాకుండా, బంధువులందరికీ పంపిస్తామని బెదిరించారు.
కొంతకాలంగా ఈ వేధింపులు తీవ్రం కావడంంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో తాము విచారణ చేపట్టి నిందితులను పట్టుకున్నామని డీఎస్పీ రాజీవ్ బీబీసీకి తెలిపారు.
జీఆరో ఎఫ్ఐఆర్ కింద మచిలీపట్నంలో కేసు నమోదు చేసి (ఎఫ్ఐఆర్ నెం.64/2022) నిందితులను కోర్టులో హాజరుపరిచినట్టు ఆయన వివరించారు.