You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

గొటాబయ రాజపక్షకు వ్యతిరేకంగా మాల్దీవుల్లో శ్రీలంక జాతీయుల నిరసన

శ్రీలంక అధ్యక్షుడు గోటాబయ రాజపక్షకు మాల్దీవ్స్ ఆశ్రయం ఇవ్వడంపై అక్కడ శ్రీలంక జాతీయులు నిరసనలకు దిగారు.

లైవ్ కవరేజీ

  1. గోటాబయ రాజపక్షకు వ్యతిరేకంగా మాల్దీవుల్లో శ్రీలంక జాతీయుల నిరసన

    శ్రీలంక అధ్యక్షుడు గోటాబయ రాజపక్షకు మాల్దీవ్స్ ఆశ్రయం ఇవ్వడంపై అక్కడ శ్రీలంక జాతీయులు నిరసనలకు దిగారు.

    గోటాబయకు సాయం చేయడాన్ని ఆపాలని మాల్దీవుల ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు.

    గోటాబయ రాజపక్షకు వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని మాల్దీవుల వీధుల్లో వారు ఆందోళనకు చేపట్టారు.

    అయితే మాల్దీవుల్లో రాజపక్ష ఉండాలని అనుకోవడం లేదని, మరొక దేశానికి వెళ్లాలని భావిస్తున్నట్లు కొందరు బీబీసీకి తెలిపారు.

  2. కడెం ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద, ప్రవీణ్ శుభం, బీబీసీ కోసం

    నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్ట్‌కు వరద కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో చివరిసారి ప్రాజెక్ట్ అధికారుల నుంచి వరద వివరాలు అందాయి. ఆ తర్వాత వారి నుంచి ఎలాంటి కమ్యూనికేషన్ లేదు.

    ఉదయం 5 లక్షల క్యూసెక్కుల మేర వరద వచ్చిన నేపథ్యంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రాజెక్ట్ వద్దకు చేరుకుని పరిస్థితి సమీక్షించారు. భారీ వరద నేపథ్యంలో ప్రాజెక్ట్ దగ్గర నుంచి అధికారులు బయటకు వచ్చారని, 3 వేల కుటుంబాల ను పునరావాస కేంద్రాలకు తరలించామని మంత్రి మీడియాకు తెలిపారు.

    గతంలో 1995వ సంవత్సరంలో ఇంత భారీ స్థాయిలో వరద వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. ఎగువ ప్రాంతంలో ఉన్న ఇచ్చోడ, బోథ్ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో ఈ పరిస్థితి తలెత్తింది.

  3. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఎటు చూసినా నీరే-వరద చిత్రాలు

  4. శ్రీలంక పార్లమెంటును ముట్టడించేందుకు ప్రయత్నిస్తున్న నిరసనకారులు

    పార్లమెంటును ముట్టడించేందుకు వేలమంది ఆందోళనకారులు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.

    పార్లమెంటు మెయిన్ గేట్ వద్ద భారీ ఎత్తున బారికేడ్లను ఏర్పాటు చేసి వారు లోపలికి వెళ్లకుండా నిరోధించారు.

    అయితే, నిరసనకారులు వాటిని అడ్డుతొలగించుకుని పార్లమెంటు వైపు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు పలుమార్లు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ ఘర్షణలో పలువురు మహిళలు సహా అనేకమంది గాయపడ్డారు.

    తాము ఇక్కడ సమావేశమయ్యేందుకు మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రయత్నిస్తున్నామని ఒక నిరసనకారుడు వెల్లడించారు.

    ఆందోళనలు జరిగే ప్రాంతానికి పార్లమెంటు భవనం రెండు కిలోమీటర్ల దూరంలో ఉండగా, ఈ ప్రాంతం పరిపాలనా రాజధాని జయవర్ధనెపుర నగరానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది.

  5. శ్రీలంక సంక్షోభం: ప్రజలు శాంతియుతంగా ఉండాలంటూ ఆర్మీ పిలుపు

    ప్రజలు శాంతియుతంగా ఉండాలంటూ పిలుపునిచ్చారు శ్రీలంక చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ షవేంద్ర సిల్వ. శాంతి భద్రతలను కాపాడేందుకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

    కొత్త అధ్యక్షున్ని ఎన్నుకునే లోపు ప్రభుత్వం ఎలా నడవాలో ఒక కార్యాచరణను నిర్ణయించేందుకు అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ రోజు సాయంత్రంలోపు సైన్యానికి, ప్రజలకు ఆ ప్రణాళిక వెల్లడించాలని శ్రీలంక పార్లమెంట్ స్పీకర్‌ను కోరారు.

    దేశంలో పోలీసులు, సైన్యం రాజ్యాంగం ప్రకారం నడచుకుంటాయని జనరల్ షవేంద్ర సిల్వ స్పష్టం చేశారు.

  6. శ్రీలంక: ‘అశాంతిని సైన్యం చక్క దిద్దుతుంది’

    దేశంలో నెలకొన్న అశాంతి పరిస్థితులను సైన్యం చక్కబెడుతుందని శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే తెలిపారు.

    అధ్యక్ష, ప్రధాని నివాసాలతోపాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న నిరసనకారులు వెంటనే వాటిని ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆయన పిలుపునిచ్చారు.

    ఆయన టీవీ ద్వారా శ్రీలంక ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

    రణిల్ విక్రమసింఘే చేసిన ఈ వ్యాఖ్యలతో రాజధాని కొలంబోలో ఇకపై శాంతి భద్రతలను సైన్యం చూసుకుంటదనేది అర్థమవుతోంది.

  7. శ్రీలంకకు సైన్యాన్ని పంపుతోంది, గొటబయా పారిపోవడానికి సాయం చేసిందనే వదంతులు భారత్‌పై ఎందుకు వస్తున్నాయి

  8. జాహ్నవి దంగేటి: అచ్చం చంద్రుడిపై ఉండే వాతావరణంలో గడిపిన తెలుగమ్మాయి

  9. తెలంగాణలో ఈ నెల 16 వరకు స్కూళ్లకు సెలవు

    భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవులను ఈ నెల 16వ తేదీ వరకు పొడిగించారు.

    ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో వాగులు, వంకలు, రిజర్వాయర్లు, నదులు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో పరిస్థితిని సీఎం కేసీఆర్ సమీక్షించారు.

    వరదలవల్ల కలిగే ఆస్తి, ప్రాణ నష్టాలను తగ్గించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు.

  10. తెలంగాణ వరదలు: ‘మనకు సమయం లేదు వెంటనే ఖాళీ చేయించండి’

    గోదావరికి వరద భారీగా పెరుగుతున్నందున వెంటనే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కొత్తగూడెం కలెక్టర్ ఆదేశించారు.

    ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వస్తోందని, గోదావరి నీటి మట్టం భారీగా పెరుగుతోందని అందుకు సిద్ధమవ్వాలని సూచించారు.

    ‘భద్రాచలం టౌన్‌ ప్రజలను వెంటనే ఖాళీ చేయించాలి. దుమ్ముగూడెం, చేర్ల మండలాల్లో ఇంకా అప్రమత్తంగా ఉండాలి. మిగతా గ్రామాల నుంచి ప్రజలను పూర్తిగా ఖాళీ చేయించండి. ఏది ఏమైనా ఈ రోజే ఈ ప్రక్రియ పూర్తి కావాలి.’ అని తెలిపారు.

  11. ‘భార్య తాళిబొట్టును విసిరికొట్టడం వల్ల కలిగిన మనోవేదన’ అనే కారణం చెప్పి భర్త విడాకులు పొందవచ్చా

  12. ఆ చిన్నారి మెడ 90 డిగ్రీలు వంగిపోయింది, 12 ఏళ్ల నరకయాతన నుంచి చివరకు ఎలా బైటపడింది

  13. చిత్రాల్లో శ్రీలంక నిరసనలు

    శ్రీలంకలో నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. నిరసనకారులు ప్రధాని మంత్రి కార్యాలయాన్ని చుట్టుముట్టారు.

    అధ్యక్షుడు గోటాబయ రాజపక్ష శ్రీలంక విడిచి పారిపోవడంతో ప్రజల్లో మరింత ఆగ్రహం చెలరేగింది.

    గోటాబయ రాజపక్ష నేడు రాజీనామా లేఖ పంపుతారని శ్రీలంక పార్లమెంటు స్పీకర్ తెలిపారు.

  14. బ్రేకింగ్ న్యూస్, ‘నేడు రాజీనామా లేఖ పంపనున్న గోటాబయ రాజపక్ష’

    శ్రీలంక నుంచి పారిపోయిన అధ్యక్షుడు గోటాబయ రాజపక్ష నేడు రాజీనామా పంపిస్తారని ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ ప్రకటించారు.

    శ్రీలంక బయట ఉన్న గోటాబయ రాజపక్ష తనకు ఫోన్ చేసి మాట్లాడారని, ఇంతకు ముందు హామీ ఇచ్చినట్లుగానే రాజీనామా లేఖ పంపుతున్నట్లు తెలిపారని స్పీకర్ చెప్పుకొచ్చారు.

    గోటాబయ రాజపక్ష రాజీనామా చేసిన తరువాత నెల రోజులపాటు ఎవరో ఒకరు తాత్కాలిక అధ్యక్షునిగా బాధ్యతలు చేపడతారు. ఆ తరువాత ఎన్నికలు నిర్వహించి అధ్యక్షున్ని ఎన్నుకుంటారు.

  15. ఊరు బయట పొలాల్లో ఐపీఎల్ ఆడతారు, రష్యన్లతో బెట్టింగ్‌ చేసి లక్షల రూపాయలు కొట్టేస్తారు

  16. తెలంగాణ వరదలు: భారీ వర్షాలతో కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్‌కు భారీగా ఇన్‌ఫ్లో

    తెలంగాణలో భారీ వర్షాల ధాటి కొనసాగుతోంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అయిదో రోజు విస్తారంగా వర్షాలు కురిశాయి. నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్, ములుగు, ఆసిఫాబాద్, భూపాలపల్లి జిల్లాల్లో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.

    నిర్మల్ జిల్లా కడెం జలాశయానికి సామర్థ్యాన్ని మించి ఇన్ ఫ్లో వస్తోంది. దీంతో ప్రాజెక్ట్ ప్రమాదంలో ఉందన్న వార్తలు వచ్చాయి.జిల్లా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, అధికారులతో కలిసి ప్రాజెక్ట్‌ను సందర్శించారు.ప్రస్తుతం ప్రాజెక్ట్‌కు వచ్చిన ప్రమాదం ఏమీ లేదని, గేట్లు అన్నీ పనిచేస్తున్నాయని ప్రాజెక్ట్ అధికారి సుశీల్ మీడియాకు తెలిపారు. ఎగువ బోథ్ ప్రాంతంలో భారీ వానలతో4 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతోంది. దిగువ ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నిర్మల్ జిల్లాలో 18 సె.మీ సగటు వర్షపాతం నమోదైంది.

    కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్‌కు ప్రాణహిత, గోదావరి పరివాహక ప్రాంతాల నుంచి భారీ ఇన్ ఫ్లో వస్తోంది. దీంతో 81 గేట్లను పైకి ఎత్తి 12 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు.

    నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ మహారాష్ట్ర నుంచి వరద కొనసాగుతోంది. మంగళవారం నుంచి ప్రాజెక్ట్ లెవల్‌ను 76 టీఎంసీల వద్ద స్థిరంగా ఉంచి మిగులు జలాలను దిగువకు వదులుతున్నారు.

    రాజన్నసిరిసిల్ల జిల్లాలో అప్పర్ మానేరు డ్యామ్ పొంగిపొర్లుతోంది.

    కడెం ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేయడంతో దిగువన గోదావరిపై ఉన్న పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు భారీ వరద చేరింది. 45 గేట్లు ఎత్తి 9 లక్షల పైచిలుకు క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.

    చెన్నూరు, మంచిర్యాల మధ్య రాకపోకలు ఆగిపోయాయి.

    ఆసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షాలకు కొమురం భీమ్ ప్రాజెక్ట్ గేట్లను ఎత్తేసారు. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

    భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షాలతో 15 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి నిర్వాసితులకు భోజన వసతి కల్పించారు.

    జగిత్యాల జిల్లా రాయికల్ వద్ద రామోజీవాగులో నిన్న కారుతో సహా గల్లంతైన ఎన్టీవీ జర్నలిస్ట్ జమీర్ ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.

    నిజామాబాద్, మెదక్ జిల్లాల్లోనూ ఇదే రకమైన పరిస్థితులు నెలకొన్నాయి.

    కామారెడ్డి బీడీ వర్కర్స్ కాలనీలో బట్టలు ఆరేసే క్రమంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మంగళవారం మృత్యువాత పడ్డారు.

    ఈరోజు మధ్యాహ్నం 1 గంట నుంచి రేపు ఉదయం 8:30 గంటల వరకు ఆసిఫాబాద్, ములుగు, మంచిర్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి, పెద్దపల్లి, వరంగల్, జనగామ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావారణ శాఖ హెచ్చరించింది.

  17. శ్రీలంక: ప్రధానమంత్రి కార్యాలయ ముట్టడికి నిరసనకారుల ప్రయత్నం, ఆపద్ధర్మ అధ్యక్షునిగా రణిల్

    శ్రీలంక ప్రధానమంత్రి కార్యాలయంలోకి బలవంతంగా ప్రవేశించేందుకు వేలాదిమంది నిరసనకారులు ప్రయత్నిస్తున్నారు.

    కొంతమంది కార్యాలయ గేట్లను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించగా, మరికొంతమంది లోపలికి వెళ్లేందుకు గేట్లు ఎక్కారు.

    వారిని అడ్డుకుంటోన్న పోలీసులపైకి నిరసనకారులు బాటిళ్లను విసిరికొట్టారు.

    ప్రధాని కార్యాలయం వద్ద భారీగా భద్రతా బలగాలను మోహరించారు. అక్కడికి వస్తోన్న నిరసనకారుల సంఖ్య పెరుగుతూ ఉంది. నిరసన ప్రదర్శనలు తీవ్రంగా మారుతున్నాయి.

    నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు, టియర్ గ్యాస్ షెల్స్‌ను వాడుతున్నారు.

    మరోవైపు అధ్యక్షుడు దేశం వదిలి పారిపోవడంతో ఆయన స్థానంలో రణిల్ విక్రమసింఘే ఆపద్ధర్మ అధ్యక్షుడు అయ్యారు. దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించారు.

    శ్రీలంక రాజ్యాంగం ప్రకారం, రణిల్ 30 రోజుల పాటు తాత్కాలిక అధ్యక్షునిగా వ్యవహరిస్తారు.

    రణిల్-గొటాబయ ప్రభుత్వానికి తాము వ్యతిరేకమని, వారు వెంటనే రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు.

    ‘‘ఈ సాయంత్రం లోగా వారిద్దరూ రాజీనామా చేయకపోతే, మేం మళ్లీ సమావేశమై పార్లమెంట్, ఇతర ప్రభుత్వ భవనాలను ముట్టడిస్తాం’’ అని వార్తా సంస్థ రాయిటర్స్‌తో ఒక నిరసనకారుడు అన్నారు.

  18. బ్రేకింగ్ న్యూస్, శ్రీలంకలో ఎమర్జెన్సీ విధించిన ప్రధాని

    శ్రీలంకలో రాజకీయ అస్థిరత, అశాంతి నెలకొన్న నేపథ్యంలో ప్రధాని రణిల్ విక్రమసింఘే దేశంలో ఎమర్జెన్సీని విధించారు.

    ప్రధానమంత్రి కార్యాలయ ప్రతినిధి ఈ సమాచారాన్ని అందించారు.

    పశ్చిమ ప్రావిన్సులో కర్ఫ్యూ కూడా విధించినట్లు ఆయన చెప్పారు.

    మరోవైపు, ఈరోజు తన పదవికి రాజీనామా చేస్తానని చెప్పిన శ్రీలంక అధ్యక్షుడు దేశం వదిలి పారిపోయారు.

    అఖిల పక్ష ప్రభుత్వ ఏర్పాటుకు వీలుగా రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రధాని రణిల్ విక్రమసింఘే కూడా ప్రకటించారు.

    అయితే, బుధవారం నిరసనకారులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ ప్రధానమంత్రి కార్యాలయం వద్ద ప్రదర్శన చేశారు.

    ప్రధానమంత్రి కార్యాలయం నుంచి నిరసనకారులు చెదరగొట్టేందుకు పోలీసులు వారిపై టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు.

  19. గోదావరి వరదలు: ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటిన ప్రవాహం

    గోదావరి వరద ఉధృతి ప్రభావం పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి వరద ప్రవాహం సాగుతోంది. బుధవారం మధ్యాహ్నం 12గంటల సమయానికి కాటన్ బ్యారేజ్ నుంచి 15.3 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో కోనసీమలోని అనేక లంక గ్రామాలు, గోదావరి తీర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వేల ఎకరాల పంట నీటిపాలైంది. వందల ఇళ్లు జలమయం అయ్యాయి.

    పోలవరం ప్రాజెక్టు వద్ద స్పిల్ వే ద్వారా 15లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్టు మేఘ సంస్థ వెల్లడించింది. ఇంత పెద్ద మొత్తంలో వరద నీటిని ఆరంభంలోనే 48 గేట్ల ద్వారా పంపించడం అరుదైన విషయమని చెబుతోంది.

    గోదావరి వరదల కారణంగా పోలవరం నిర్వాసితులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే నాలుగు రోజులుగా వరద నీటిలో నానుతున్న గ్రామాలు ఎగువన పెరుగుతున్న వరద తాకిడి మూలంగా మరింత కలవరపడుతున్నాయి.

    ఇప్పటికే కాళేశ్వరం, పేరూరు వంటి చోట్ల నీటిమట్టం పెరుగుతున్న తరుణంలో భద్రాచలం వద్ద మరోసారి మూడో ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తద్వారా కూనవరం, వీఆర్ పురం, చింతూరు, దేవీపట్నం, పోలవరం మండలాల్లో ప్రజలు వరద ముప్పును ఎదుర్కోవాల్సి వస్తోంది.

    సహజంగా ఏటా ఆగస్టులో గోదావరికి భారీ వరదలు వస్తాయి. కానీ వందేళ్లలో ఎన్నడూ లేని రీతిలో జూలైలోనే ఇంత పెద్ద స్థాయిలో వరదలు రావడం అనూహ్యమని గోదావరి హెడ్ వర్క్స్ ఈఈ విశ్వశ్వరరావు బీబీసీతో అన్నారు. వరదలకు అనుగుణంగా అన్ని రకాలుగా అప్రమత్తమయ్యాయమని చెప్పారు.

    ఇప్పటికే 18 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు రెవెన్యూ అధికారులు వెల్లడించారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ కూడా భారీ వర్షాలు, వరదల ప్రభావంపై అధికారులతో సమీక్ష జరిపారు. వరదల్లో చిక్కుకున్న వారికి కుటుంబానికి రూ. 2వేల చొప్పున అందించాలని అధికారులను ఆదేశించారు.

  20. ‘రాజపక్ష దేశం దాటడంలో భారత్ ఎలాంటి సహాయం చేయలేదు’- భారత హై కమిషన్

    శ్రీలంక అధ్యక్షుడు గొటాబయ రాజపక్ష, మాజీ ఆర్థిక మంత్రి బాసిల్ రాజపక్షలను దేశాన్ని దాటించడంలో భారత్ సహాయం చేసిందని వస్తోన్న మీడియా కథనాలను శ్రీలంకలోని భారత హై కమిషన్ ఖండించింది.

    ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.

    శ్రీలంక ప్రజలకు సహాయం చేయడాన్ని కొనసాగిస్తామని పునరుద్ఘాటించింది.

    తీవ్ర నిరసనల మధ్య శ్రీలంక అధ్యక్షుడు గొటాబయ రాజపక్ష మిలిటరీ జెట్‌లో దేశం నుంచి పారిపోయారు.

    73 ఏళ్ల గోటబయ రాజపక్ష మాల్దీవుల రాజధాని మాలే చేరుకున్నట్లు తెలిసింది.

    జూలై 13న అంటే ఈరోజు తన పదవికి రాజీనామా చేస్తానని గోటాబయ గతంలో ప్రకటించారు.

    భారత్ తన సైన్యాన్ని శ్రీలంకకు పంపుతున్నట్లు సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతోన్న వార్తలను ఖండిస్తూ జూలై 10వ తేదీన భారత హైకమిషన్ ఒక ప్రకటన విడుదల చేసింది.