You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

రాహుల్ గాంధీ: ‘టీఆర్ఎస్‌కు రెండుసార్లు అవకాశం ఇచ్చారు.. కాంగ్రెస్‌కు ఒక్క అవకాశం ఇవ్వండి’

తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోసం తమ కన్నీళ్లు, రక్తం చిందించారని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటై 8 ఏళ్లు గడుస్తున్నాయని, తెలంగాణ కల ఏమైందని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.

లైవ్ కవరేజీ

  1. నేటి ముఖ్యాంశాలు

    నల్ల సముద్రపు రేవును మూసివేయడంతో యుక్రెయిన్ నుంచి 2.5 కోట్ల టన్నుల ధాన్యపు ఎగుమతులు నిలిచిపోయినట్లు ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌‌ఏఓ) తెలిపింది.

    రైతు సంఘర్షణపేరుతో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన వరంగల్‌లో పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ ప్రసంగించారు.తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీతో కాంగ్రెస్ ఎలాంటి పొత్తూ పెట్టుకోదని రాహుల్ గాంధీ ప్రకటించారు. తమకు అవకాశం ఇస్తే తెలంగాణ కలను నెరవేరుస్తామని, పేద ప్రజలు, రైతులకు అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

    రైతు సంఘర్షణపేరుతో కాంగ్రెస్ పార్టీ వరంగల్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రైతు సమస్యల పై వరంగల్ డిక్లరేషన్ ప్రకటించారు.

    లౌడ్ స్పీకర్ల పై అజాన్ చేయడం ప్రాథమిక హక్కుల పరిధిలోకి రాదని అలహాబాద్ హైకోర్టు శుక్రవారం పేర్కొంది.

    సీనియర్ టీడీపీ నాయకుడు,మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి శుక్రవారం మరణించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గానికి శాసనసభ్యునిగా ఆయన ఐదు సార్లు ఎన్నికయ్యారు.

    మద్యపానం చేసే మహిళల సంఖ్య ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలో ఎక్కువగా ఉన్నట్లు 5వ జాతీయ ఆరోగ్య కుటుంబ సర్వే తెలిపింది.

    ఆంధ్రప్రదేశ్‌లోని నర్సీపట్నంలో ఆరేళ్ల బాలికను కిడ్నాప్ చేసి, రేప్ చేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి. నిందితుడు పరారీలో ఉన్నాడని, అతన్ని పట్టుకునేందుకు మూడు బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.

    మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కుమార్తె ఖతీజా రెహమాన్ పెళ్లి చేసుకున్నారు. రియాస్దీన్ షేక్ మహ్మద్‌తో పోయిన ఏడాది డిసెంబరులో ఖతీజాకు ఎంగేజ్‌మెంట్ కాగా గురువారం వివాహం జరిగింది.

    ఎల్‌ఐసీ ఐపీఓకు మంచి స్పందన వచ్చింది. మూడు రోజుల్లోనే అది ఫుల్‌గా సబ్‌స్క్రైబ్ అయింది. మొత్తం మీద ఇప్పటి వరకు 1.12 రెట్లు ఎక్కువ స్పందన కనిపించింది.

    గుజరాత్‌లోని ముదార్దా గ్రామానికి చెందిన 40 ఏళ్ల వ్యక్తిని గుడిలో మైకు పెట్టినందుకు కొట్టి చంపారనే వార్తలు వచ్చాయి. ఈ కేసుకు సంబంధించి ఆరుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

    భక్తుల కోసం కేదార్‌నాథ్ దేవాలయాన్ని తెరచారు. ఈ సందర్భంగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ పూజలు చేశారు.

    ఇంతటితో బీబీసీ లైవ్ ముగిస్తున్నాం.

  2. ఏసీల కరెంటు బిల్లు తగ్గించేందుకు 8 మార్గాలు..

  3. హైదరాబాద్ దళిత యువకుడి హత్య: ‘నడిరోడ్డుపై చంపుతుంటే 30 మందిలో ఒక్కరూ అడ్డుకోలేదు’

  4. లక్షల టన్నుల యుక్రెయిన్ ధాన్యం ఎగుమతుల నిలిపివేత

    నల్ల సముద్రపు రేవును మూసివేయడంతో యుక్రెయిన్ నుంచి 2.5 కోట్ల టన్నుల ధాన్యపు ఎగుమతులు నిలిచిపోయినట్లు ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌‌ఏఓ) తెలిపింది.

    సుమారు 700,000 టన్నుల ధాన్యం కనిపించకుండా పోయిందని ఎఫ్‌‌ఏఓ డిప్యూటీడైరెక్టర్ జోసెఫ్ స్మిడ్ హ్యూబర్ చెప్పారు.

    ఈ ధాన్యాన్ని, వ్యవసాయ పరికరాలను రష్యన్ సేనలు దొంగలిస్తున్నాయని సోషల్ మీడియాలో లభించిన నివేదికల ఆధారంగా తెలిసిందన్నారు.

    ధాన్యం కొరతతో ప్రపంచ వ్యాప్తంగా ఆహార పదార్ధాల ధరలు పెరుగుతున్నాయి.యుక్రెయిన్, రష్యా నుంచి వచ్చే దిగుమతులు, ఇతర మానవతా ఆహార సరఫరా పైన ఆధారపడ్డ చాలా దేశాలు ఆహార అభద్రత, కరవుతో బాధపడుతున్నట్లు

    యూఎన్ సహాయక సంస్థలు హెచ్చరిస్తున్నాయి.

  5. రాహుల్ గాంధీ: ‘టీఆర్ఎస్‌కు రెండుసార్లు అవకాశం ఇచ్చారు.. కాంగ్రెస్‌కు ఒక్క అవకాశం ఇవ్వండి’

    తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత టీఆర్ఎస్‌కు రెండుసార్లు అవకాశం ఇచ్చారని, వాళ్లు మాత్రం మోసం చేశారని రాహుల్ గాంధీ అన్నారు.

    తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని రాహుల్ కోరారు.

    తమకు అవకాశం ఇస్తే తెలంగాణ కలను నెరవేరుస్తామని, పేద ప్రజలు, రైతులకు అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

  6. రాహుల్ గాంధీ: ‘కేసీఆర్‌పై సీబీఐ, ఈడీ దాడులు ఎందుకు జరగవు?’

    తెలంగాణ ముఖ్యమంత్రి ఎన్ని వేల కోట్లు దోచుకుంటున్నా ఆయనపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సీబీఐ చేత కానీ, ఈడీ చేత కానీ దాడులు ఎందుకు చేయించట్లేదు అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.

    టీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య అవగాహన ఉందని చెప్పడానికి ఇదే పెద్ద నిదర్శనమని రాహుల్ అన్నారు.

  7. రాహుల్ గాంధీ: ‘బీజేపీకి తెలంగాణలో రిమోట్ కంట్రోల్ టీఆర్ఎస్’

    టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో బీజేపీకి రిమోట్ కంట్రోల్ లాగా పనిచేస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు.

    తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శక్తి బీజేపీకి లేదని, ఈ విషయం ఆ పార్టీకి కూడా తెలుసునన్నారు. అందుకే తాము చెప్పినట్లు నడుచుకునే రిమోట్ కంట్రోల్ ప్రభుత్వం తెలంగాణలో ఉండాలని బీజేపీ కోరుకుంటోందన్నారు.

  8. రాహుల్ గాంధీ: ‘టీఆర్ఎస్‌తో పొత్తు ఉండదు.. ఆ పార్టీతో పోరాడుతాం, ఓడిస్తాం’

    తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీతో కాంగ్రెస్ ఎలాంటి పొత్తూ పెట్టుకోదని రాహుల్ గాంధీ ప్రకటించారు.

    ఎన్నికల్లో టీఆర్ఎస్‌తో తాము పోరాడతామని, ఆ పార్టీని ఓడిస్తామని అన్నారు.

    టీఆర్ఎస్‌తో కాంగ్రెస్ నాయకులు సంబంధాలు పెట్టుకుంటే వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించారు.

  9. రాహుల్ గాంధీ: ‘తెలంగాణ కోసం ప్రజలు రక్తం చిందించారు.. ఈ 8 ఏళ్లలో తెలంగాణ కల ఏమైంది?’

    రైతు సంఘర్షణపేరుతో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన వరంగల్‌లో పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ ప్రసంగించారు.

    ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు:

    "తెలంగాణ అంత సులభంగా రాలేదు. ఎందరో త్యాగాలతో తెలంగాణ వచ్చింది. గత 8 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధి చెందిందా" అని ప్రశ్నించారు.

    "మీ కలలు నెరవేర్చుకునేందుకు మీ కన్నీళ్లను, రక్తాన్ని త్యాగం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణను ఇచ్చారు.

    ఇది మాకెంతో నష్టాన్ని చేకూర్చింది. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజల వైపు నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది".

    తెలంగాణ కల కోసం ప్రజలు రక్తాన్ని చిందించారు. మరి ఈ 8 ఏళ్లలో తెలంగాణ కల నెరవేరిందా?

    ప్రజల ప్రభుత్వం, రైతుల, కార్మికుల, పేద, బలహీన వర్గాల ప్రజల ప్రభుత్వం ఏర్పడుతుందని మీరనుకున్నారు. కానీ, నేటి తెలంగాణాలో ఒక ముఖ్యమంత్రి కాకుండా ఒక రాజు రాష్ట్రాన్ని పాలిస్తున్నట్లుగా ఉంది.

    ముఖ్యమంత్రి ప్రజల గొంతును వింటారు. రాజు తనకు నచ్చిందే చేస్తారు. ముఖ్యమంత్రి ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు. రాజుకు ప్రజల అభిప్రాయాలతో పని లేదు.

    ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఎన్నికలకు ముందు మేం ఆ రాష్ట్రంలోని రైతుల రుణాలను మాఫీ చేస్తామని, వరి పంటకు కనీస మద్దతు ధర రూ. 2500 ఇస్తామని హామీ ఇచ్చాం. మేమిచ్చిన హామీలను అమలు చేశాం.

    తెలంగాణ రైతులు కూడా మిర్చి, వరి కోసం సరైన గిట్టుబాటు ధరను అడుగుతున్నారు.రుణ మాఫీ చేయమని అడుగుతున్నారు.

    వరంగల్ డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇస్తున్న హామీ. ప్రతీ రైతు ఈ డిక్లరేషన్ చదవాలి. రైతు సంక్షేమం జరిగినప్పుడే తెలంగాణ కల సాకారమవుతుంది.

    తెలంగాణను మోసం చేసిన, నష్టం కలిగించిన పార్టీతో కాంగ్రెస్‌కు ఎటువంటి సంబంధం లేదు. రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీతో నేరుగా పోటీ పడతాం.

    "ప్రజల కోసం పోరాడే నేతలకు మాత్రమే ఎన్నికల్లో టికెట్లను ఇస్తాం".

    "నేను తెలంగాణకు అన్ని విధాలా సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. ఇది తెలంగాణ రైతుల, యువత పోరాటం కాదు.

    ఈ పోరాటం కాంగ్రెస్ పార్టీతో పాటు నాది కూడా" అని అన్నారు.

    ఆదివాసీలకు 10శాతం రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ పోరాటం చేస్తుంది.

    "కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశమివ్వండి" అని కోరారు.

  10. వరంగల్ డిక్లరేషన్ ప్రకటించిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

    రైతు సంఘర్షణపేరుతో కాంగ్రెస్ పార్టీ వరంగల్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ ఈ సభలో పాల్గొంటున్నారు.

    పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రైతు సమస్యల పై వరంగల్ డిక్లరేషన్ ప్రకటించారు.

    "తెలంగాణ అంటే నినాదం కాదు, ఎన్నికల ముడిసరుకు కాదు, పేగు బంధం, ఆత్మ గౌరవం" అంటూ రేవంత్ రెడ్డి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. "రైతును రాజును చేయడమే మా లక్ష్యం" అని అన్నారు.

    కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తీరుతుందని రేవంత్ రెడ్డి అన్నారు.

    కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ ముఖ్యాంశాలు ఇవీ..

    • రైతులకు 2 లక్షల రూ, రుణ మాఫీ.
    • ఇందిరమ్మ రైతు పథకం ద్వారా ప్రతి ఎకరాకు ఏడాదికి రూ.15,000 పెట్టుబడి సాయం.
    • భూమి లేని కూలీలకు రూ.12,000 ఆర్ధిక సహాయం.
    • రైతులు పండించిన పంటలకు మెరుగైన గిట్టుబాటు ధర ఇచ్చి పంటలను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. పత్తికి రూ. 6500 గిట్టుబాటు ధర.
    • మూత పడిన చెరకు కర్మాగారాలను తెరుస్తాం.
    • మెరుగైన పంటల కోసం రైతులకు భీమా పథకం ప్రవేశం. రైతు కూలీలు, భూమి లేని వారికి కూడా రైతు భీమా పథకం వర్తింపు.
    • ధరణి పోర్టల్ రద్దు.
    • అన్ని వర్గాల ప్రజల భూములకు రక్షణ కల్పించేలా వ్యవస్థను సరళీకృతం చేస్తాం.
    • వరంగల్, ఖమ్మం నకిలీ విత్తనాల బెడద రైతుల ఆత్మహత్యలకు దారి తీస్తోంది. వీటి నియంత్రణకు కఠినమైన చట్టాలు తెస్తాం.
    • నిర్దిష్ట సమయ ప్రణాళికతో పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి. చివరి ఎకరా వరకు నీరు.
    • రైతుల హక్కుల పరిరక్షణ కోసం రైతు కమీషన్ ఏర్పాటు.
    • భూముల స్వభావం, వాతావరణ పరిస్థితుల కనుగుణంగా నూతన వ్యవసాయ విధానం.
  11. "లౌడ్ స్పీకర్ల పై అజాన్ చేయడం ప్రాథమిక హక్కు కాదు" - అలహాబాద్ హై కోర్టు

    లౌడ్ స్పీకర్ల పై అజాన్ చేయడం ప్రాథమిక హక్కుల పరిధిలోకి రాదని అలహాబాద్ హైకోర్టు శుక్రవారం పేర్కొంది.

    బదౌన్ నివాసి ఇర్ఫాన్ నూరీ మసీదులో లౌడ్ స్పీకర్ల ద్వారా అజాన్ నిర్వహించడానికి అనుమతి కోరుతూ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను పరిశీలించిన కోర్టు వ్యాఖ్యలు చేసింది.

    “చట్టం ప్రకారం, మసీదులో లౌడ్ స్పీకర్లను ఉపయోగించడం ప్రాథమిక హక్కు కాదు" అని అంటూ ఆ పిటిషన్‌ను

    తిరస్కరించింది.

    అజాన్ ఇస్లాంలో అంతర్భాగమైనప్పటికీ, మసీదులో లౌడ్ స్పీకర్లను ఉపయోగించడం ప్రాథమిక హక్కు కాదని కోర్టు పేర్కొంది.

  12. టంగ్-టై అంటే ఏంటి? పిల్లల్లో పెరుగుతున్న ఈ కొత్త సమస్యను గుర్తించడం ఎలా?

  13. సీనియర్ టీడీపీ నాయకుడు,మాజీ మంత్రి బొజ్జల గోపాల కృష్ణా రెడ్డి మృతి

    సీనియర్ టీడీపీ నాయకుడు,మాజీ మంత్రి బొజ్జల గోపాల కృష్ణా రెడ్డి శుక్రవారం మరణించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గానికి శాసనసభ్యునిగా ఆయన ఐదు సార్లు ఎన్నికయ్యారు.

    ఆయన మృతి పట్ల పలువురు నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.

    తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బొజ్జల కుమారుడు సుధీర్, ఇతర కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడి పరామర్శించారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

    ఇటీవల జరిగిన బొజ్జల పుట్టినరోజు వేడుకలకు కూడా చంద్రబాబు హాజరయ్యారు.

    బొజ్జల మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటు అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. గోపాల కృష్ణా రెడ్డి ఐటి, అటవీ, పర్యావరణ, ఆర్ అండ్ బి, సహకార శాఖల మంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో పాటువిభజిత రాష్ట్రానికి కూడా సేవలందించారని అన్నారు.

    "ఆంధ్రప్రదేశ్ మాజీమంత్రి శ్రీ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు పరమపదించారని తెలిసి విచారించాను. వారు ఎంతో సౌమ్యులు, సచ్చీలురు, మిత్రశీలి. నాకు బాల్యం నుంచి వారు మంచి మిత్రులు. ఆరోజుల్లో తిరుపతి ఆటలపోటీల్లో, సమావేశాల్లో తరచుగా కలుసుకునే వాళ్ళం" అని అంటూ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్వీట్ చేశారు.

    "ఆయనశాసనసభ్యునిగా ప్రజాసమస్యలపై దృష్టి కేంద్రీకరించి, అనేక సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. వారి క్రమశిక్షణ, పని పట్ల నిబద్ధత ఆదర్శనీయమైనవి. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతున్నాను" అని వెంకయ్య నాయుడు ట్వీట్ చేశారు.

  14. అశోక‌వ‌నంలో అర్జున క‌ల్యాణం రివ్యూ: విశ్వక్ సేన్ రూటు మార్చాడు.. హిట్టు కొట్టాడా?

  15. భారత్‌లో పిల్లలను కనడం తగ్గింది

    మద్యపానం చేసే మహిళల సంఖ్య ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలో ఎక్కువగా ఉన్నట్లు 5వ జాతీయ ఆరోగ్య కుటుంబ సర్వే తెలిపింది.

    2019-20కి సంబంధించిన ఈ సర్వే ప్రకారం ఆంధ్రాలో 15 సంవత్సరాలు అంత కంటే ఎక్కువ వయసు గల గ్రామీణ మహిళల్లో 0.6శాతం మద్యం సేవిస్తున్నారు. పట్టణాల్లో అయితే ఇది 0.3శాతంగా ఉంది.

    పురుషుల విషయంలో ఇది పట్టణాల్లో 20.5శాతం, గ్రామాల్లో 24.5శాతంగా ఉంది.

    ఇక తెలంగాణ విషయానికి వస్తే అర్బన్‌లో 9శాతం మహిళలు మద్యపానం చేస్తుంటే గ్రామాల్లో 2.6శాతం మంది మద్యం సేవిస్తున్నట్లు సర్వే గణాంకాలు చెబుతున్నాయి.

    అలాగే గ్రామాల్లో 49శాతం, పట్టణాల్లో 33.9శాతం మంది పురుషులు మద్యం సేవిస్తున్నారు.

    భారత్‌లో పిల్లలు కనడం తగ్గినట్లు కూడా సర్వే తెలిపింది. గతంలో పిల్లలను కనే రేటు 2.2గా ఉండే ప్రస్తుతం అది 2కు పడిపోయినట్లు వెల్లడించింది.

    అయితే పిల్లలను కనే రేటు బిహార్‌(2.98), మేఘాలయ(2.91), ఉత్తర్ ప్రదేశ్(2.53), జార్ఖండ్(2.26)లలో ఎక్కువగా ఉంది.

    పిల్లలను కనే రేటు తెలంగాణలో 1.8, ఆంధ్రాలో 1.8 నుంచి 1.7కు తగ్గింది.

    మొత్తం మీద గర్భనిరోధక పద్ధతులు వాడే రేటు 54శాతం నుంచి 67శాతానికి పెరిగింది. ఆసుపత్రుల్లో జరిగే జననాలు కూడా 79శాతం నుంచి 89శాతానికి పెరిగాయి.

    గ్రామాల్లో 87శాతం, పట్టణాల్లో 94శాతం పిల్లలు ఆసుపత్రుల్లో పుడుతున్నారు.

    ఇక సిజేరియన్ డెలివరీలు కూడా తెలుగు రాష్ట్రాల్లో పెరిగాయి. 2015-16లో తెలంగాణంలో 57.7శాతం డెలివరీలు సిజేరియన్ రూపంలో జరగ్గా 2019-20 నాటికి అది 60.7శాతానికి పెరిగింది.

    ఆంధ్రప్రదేశ్‌లో సీ సెక్షన్ డెలివరీలు 40.1శాతం నుంచి 42.4 శాతానికి పెరిగాయి.

  16. ఆంధ్రప్రదేశ్: ‘ఆరేళ్ల బాలిక రేప్’

    ఆంధ్రప్రదేశ్‌లోని నర్సీపట్నంలో ఆరేళ్ల బాలికను కిడ్నాప్ చేసి, రేప్ చేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి. నిందితుడు పరారీలో ఉన్నాడని, అతన్ని పట్టుకునేందుకు మూడు బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.

    పక్కింట్లో ఉండే సాయి అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడినట్లు బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

  17. వడదెబ్బను ప్రకృతి విపత్తుగా చూస్తారా? చనిపోతే నష్టపరిహారం ఇస్తారా?

  18. ఏఆర్ రెహమాన్ కుమార్తె పెళ్లి

    మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కుమార్తె ఖతీజా రెహమాన్ పెళ్లి చేసుకున్నారు. రియాస్దీన్ షేక్ మహ్మద్‌తో పోయిన ఏడాది డిసెంబరులో ఖతీజాకు ఎంగేజ్‌మెంట్ కాగా గురువారం వివాహం జరిగింది.

    పెళ్లికి సంబంధించిన ఫొటోలను ఏఆర్ రెహమాన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

    మ్యూజిషియన్ అయిన ఖతీజా చాలా లో ప్రొఫైల్‌ను మెయింటైన్ చేస్తుంటారు.

  19. పాకిస్తాన్ నుంచి భారత్ సరిహద్దులోకి భారీ సొరంగం... కనిపెట్టిన బీఎస్ఎఫ్

  20. గిరగిరా తిరుగుతూ రైలు కింద పడిపోయిన కానిస్టేబుల్