You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

అనకాపల్లి: ‘కాబోయే భార్య.. కళ్లు మూసుకో, సర్‌ప్రైజ్ ఇస్తానంటూ గొంతు కోసింది’

“మా ఊరు ఒకసారి రావచ్చు కదా అని నాకు కాబోయే భార్య ఫోన్ చేసింది. దాంతో నేను వెళ్లాను. ఇంటికి వెళ్లగానే నాతో మాట్లాడాలంటూ కొండపై ఉన్న సాయిబాబా ఆలయానికి తీసుకుని వెళ్లింది. నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తాను.. కళ్లు మూసుకోమని చెప్పింది. నేను కళ్లు మూసుకున్నాను. వెంటనే ఆమె చాకుతో నా గొంతు కోసింది. గొంతు కోసిన తర్వాత కూడా ఆమె అక్కడే ఉంది.”

లైవ్ కవరేజీ

  1. అనకాపల్లి: ‘కాబోయే భార్య.. సర్‌ప్రైజ్ ఇస్తానంటూ గొంతు కోసింది’, లక్కోజు శ్రీనివాస్, బీబీసీ కోసం

    విశాఖకు చెందిన రామునాయుడు అనే యువకుడు హైదరాబాద్ సీఎస్ఐఆర్ లో సైంటిస్టుగా పనిచేస్తున్నాడు. అతనికి రావికమతం మండలంలోని కొమ్మలపూడి గ్రామానికి చెందిన యువతితో నిశ్చితార్థం అయింది. వచ్చే నెల 29 న వీరికి పెళ్లి చేసేందుకు పెద్దలు నిర్ణయించారు. ఈ క్రమంలో రామునాయుడు ఇటీవల హైదరాబాద్ నుంచి విశాఖకు వచ్చాడు.

    “మా ఊరు ఒకసారి రావచ్చు కదా అని నాకు కాబోయే భార్య ఫోన్ చేసింది. దాంతో నేను కొమ్మలపూడి గ్రామానికి వెళ్లాను. ఇంటికి వెళ్లగానే నాతో మాట్లాడాలంటూ కొండపై ఉన్న సాయిబాబా ఆలయానికి తీసుకుని వెళ్లింది. నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తాను.. కళ్లు మూసుకోమని చెప్పింది. నేను కళ్లు మూసుకున్నాను. వెంటనే ఆమె చాకుతో నా గొంతు కోసింది. గొంతు కోసిన తర్వాత కూడా ఆమె అక్కడే ఉంది. రక్తం కారుతున్నా... అతి కష్టం మీద వెంటనే నేను 108కి ఫోన్ చేశాను. వాళ్లు నన్ను హాస్పిటల్ కి తీసుకుని వచ్చారు” అని రామునాయుడు చెప్పారు.

    అయితే, ఆ యువతి మాత్రం తామిద్దరం బండిపై ప్రయాణిస్తూ కిందపడిపోయామని చెబుతోంది.

    “మేం ఇద్దరం కొండపైకి బండిపై వెళ్లాం. అక్కడ కాసేపు ఉన్నతర్వాత వస్తుండగా...బండి మీద నుంచి పడిపోయాం. దాంతో అతనికి గాయాలయ్యాయని యువతి చెప్పింది. మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాం. ప్రస్తుతానికికైతే యువతిపై ఇంకా కేసు నమోదు చేయలేదు” అని బుచ్చయ్యపేట ఎస్సై రామకృష్ణ బీబీసీతో చెప్పారు.

  2. స్వీడన్‌: ఇస్లాం పవిత్ర గ్రంథం ఖురాన్ ప్రతుల కాల్చివేతకు ప్లాన్: హింసాత్మక అల్లర్లు, 40 మంది అరెస్టు

  3. బాసా: క్యాట్ ఫిష్ వర్గానికి చెందిన ఈ చేప ఆరోగ్యానికి ప్రమాదమా, అన్ని రెస్టారెంట్లలో ఇదే ఎందుకు ఉంటోంది

  4. ‘దిల్లీలో జరిగిన మత ఘర్షణల కేసులో ప్రభుత్వం ఏకపక్షంగా ముస్లింలపై చర్యలు తీసుకుంటోంది’ – అసదుద్దీన్ ఒవైసీ ఆరోపణ

    జహంగీర్‌పురి మత ఘర్షణలకు సంబంధించిన కేసులో దిల్లీ పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆరోపణలు చేశారు.

    ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే, వారిపై చర్యలు తీసుకోవచ్చని, అందుకు అభ్యంతరం లేదని, కానీ, దానికంటూ ఒక చట్టబద్ధమైన పద్ధతిని పాటించాల్సి ఉంటుందన్నారు. కానీ, దిల్లీ పోలీసులు అలా వ్యవహరించట్లేదని ఆరోపించారు.

    దిల్లీ మత ఘర్షణల్లో మోదీ ప్రభుత్వం ముస్లింలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని ఒవైసీ ఆరోపించారు. జహంగీర్‌పురిలో అనుమతి లేకుండా శోభాయాత్ర ఎలా నిర్వహించారని, దీనిని పోలీసులు ఎలా అనుమతించారని దిల్లీ పోలీసు కమిషనర్ రాకేశ్ ఆస్థానాను ఒవైసీ ప్రశ్నించారు.

    అసలు మతపరమైన ఊరేగింపు నిర్వహించేప్పుడు ఆయుధాల అవసరం ఏముంటుందని ఒవైసీ ప్రశ్నించారు. ఆయుధాలు పట్టుకుని రెచ్చగొట్టే నినాదాలు చేయడం ఎందుకని, మసీదు వద్దకు వెళ్లి జెండాను ఎందుకు పెట్టారని ప్రశ్నించారు.

    హనుమాన్ జయంతి సందర్భంగా దిల్లీలోని జహంగీర్‌పురిలో జరిగిన అల్లర్లు హింసాత్మకంగా మారాయి. ఈ కేసులో పోలీసులు 23 మందిని అరెస్ట్ చేశారు.

  5. షాంఘై: చైనాలో పరిస్థితి చేయి దాటుతోందా? కరోనా మరణాలు ఎందుకు పెరుగుతున్నాయి?

  6. బ్రేకింగ్ న్యూస్, లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే: భారత ఆర్మీ చీఫ్‌గా ఇంజనీరు.. తొలిసారి నియామకం

    భారత ఆర్మీ చీఫ్‌ ఆఫ్ స్టాఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే నియమితులయ్యారని ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది.

    ఈయన ఇండియన్ ఆర్మీలో ఇంజనీర్ల విభాగానికి చెందిన వారు.

    ఇండియన్ ఆర్మీ చీఫ్‌గా నియమితులైన తొలి ఇంజనీరు కూడా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే అని ఏఎన్ఐ పేర్కొంది.

  7. మెన్స్ట్రువల్ కప్: నెలసరి సమయంలో దీనిని ఎలా వాడాలి? ఇక శానిటరీ ప్యాడ్‌ల అవసరం ఉండదా? 5 ప్రశ్నలు, సమాధానాలు..

  8. నైజీరియా: 8 ఏళ్లు బోకో హరాం తీవ్రవాదుల చెరలో గడిపి, ఇద్దరు పిల్లలకు తల్లి అయిన అమ్మాయి కథ..

    నైజీరియాలోని చిబాక్‌లో బోకో హరాం తీవ్రవాదుల చేతిలో స్కూలు పిల్లలు అపహరణకు గురై 8 సంవత్సరాలు అయింది.

    బోకో హరాం బందీ నుంచి విడుదల అయిన ఒక అమ్మాయితో నైజీరియా విలేఖరి, నవలా రచయత అడావ్‌బీ ట్రిషియా న్వాబని మాట్లాడారు.

    ఈ అమ్మాయి కంటే ముందు మరి కొంత మంది విద్యార్థినులు విడుదల అయ్యారు.

    అయితే, ప్రభుత్వం తన కంటే ముందు విడుదల అయిన అమ్మాయిలతో పోలిస్తే తన పట్ల పక్షపాత ధోరణి ప్రదర్శిస్తోందని చెప్పారు.

  9. స్పేస్‌లోకి కబాబ్ డెలివరీ.. సాధ్యమైందా, లేదా?

  10. చైనా: కఠిన లాక్‌డౌన్ విధించిన షాంఘై నగరంలో ఏం జరుగుతోంది?

  11. మహారాష్ట్ర: ‘ఆజాన్‌కు పావు గంట ముందు హనుమాన్ చాలీసా ప్లే చేయకూడదు’

    ప్రార్థనా మందిరాల్లో లౌడ్ స్పీకర్ల వినియోగంపై రెండు రోజుల్లో నిబంధనలు రూపొందించనున్నట్లు మహారాష్ట్ర హోంశాఖ మంత్రి దిలీప్ వాల్సే పాటిల్ తెలిపారు.

    శాంతి భద్రతలకు భంగం కలిగించేలా ఎవరైనా ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

    ఇక లౌడ్ స్పీకర్లు వినియోగించే ప్రార్థనా మందిరాలు మే నెల 3లోపు అనుమతులు తీసుకోవాలని నాసిక్ పోలీస్ కమిషనర్ దీపక్ పాండే ఆదేశించారు.

    నిబంధనలు పాటించని వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

    హనుమాన్ చాలీసా, భజనలు ప్లే చేయడానికి కూడా అనుమతి తీసుకోవాలని దీపక్ పాండే తెలిపారు.

    శాంతి భద్రతల రక్షణ కోసం ముస్లింల ఆజాన్‌కు 15 నిమిషాల ముందు కానీ ఆ తరువాత కానీ హానుమాన్ చాలీసా లేదా భజనలు ప్లే చేయడానికి లేదని వెల్లడించారు. అలాగే మసీదులకు 100 మీటర్ల లోపు ప్లే చేయడానికి లేదని వివరించారు.

  12. యుక్రెయిన్: ‘లీవ్యూ మీద రాకెట్ దాడిలో ఏడుకు పెరిగిన మరణాలు’

    యుక్రెయిన్‌లోని లీవ్యూ మీద జరిగిన రాకెట్ దాడిలో మృతుల సంఖ్య ఏడుకు పెరిగినట్లు ఆ ప్రాంత గవర్నర్ మాక్జిం కొజితస్కీ తెలిపారు.

    నాలుగు రాకెట్లు దాడి చేసినట్లు ఆయన వెల్లడించారు. వీటిలో మూడు రాకెట్లు గోడౌన్లను ఢీ కొట్టగా నాలుగోది ఒక కార్ల గ్యారేజీని ఢీ కొట్టింది.

  13. తెలంగాణ జీవనరేఖ ప్రాణహిత.. ఈ నది ప్రాముఖ్యం, చారిత్రక విశేషాలు ఏంటంటే..?

    తెలంగాణ జీవనరేఖగా ప్రాణహిత నదిని భావిస్తారు. ఇక్కడి తాగు, సాగు నీరుకు ప్రధాన వనరుల్లో ప్రాణహిత ఒకటి. దక్షిణ గంగగా పిలిచే గోదావరికి ప్రధాన ఉపనది ప్రాణహిత.

    గోదావరిలో ప్రవహించే నీటిలో మూడో వంతు నీరు ప్రాణహిత నుంచి వచ్చి చేరుతుంది. తనతో పాటు మోసుకొచ్చే నీటితో గోదావరికి నిండు రూపం ఇచ్చి అఖండ గోదావరిగా మారుస్తుంది. ఇంకా ఈ నది విశేషాలేంటో చూద్దాం..

  14. దిల్లీ జహంగీర్‌పురీలో పోలీసుల బందోబస్తు, 23 మంది అరెస్టు

    దిల్లీలోని జహంగీర్‌పురీలో సోమవారం కూడా రాళ్లు రువ్వుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే దిల్లీ పోలీసులు వీటిని ఖండించారు. చాలా చిన్న విషయాన్ని మీడియాలో పెద్దదిగా చేసి చూపుతున్నారని, అలాంటి వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

    హనుమాన్ జయంతి సందర్భంగా జహంగీర్‌పురీలో మత కలహాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

    పరిస్థితిని నియంత్రించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని దిల్లీ పోలీసు కమిషనర్ రాకేశ్ ఆస్తానా తెలిపారు. ఇప్పటి వరకు 23 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.

    ఈ అల్లర్లలో ఒక పోలీసుతో సహా తొమ్మిది మంది గాయపడ్డారు.

    సోషల్ మీడియా ద్వారా అశాంతిని రాజేసే వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మొద్దని రాకేశ్ ఆస్తానా కోరారు.

  15. జహంగీర్‌పురి అల్లర్లు: మళ్లీ రాళ్లు రువ్వుకున్నారన్న వార్తలు ఖండించిన దిల్లీ పోలీసులు

    హనుమాన్ జయంతి సందర్భంగా దిల్లీలో అల్లర్లు చెలరేగిన జహంగీర్‌పురీలో భారీగా పోలీసులు మోహరించారు.

    రాపిడ్ యాక్షన్ ఫోర్స్, పోలీసులు పహారా కాస్తున్నారు.

    మళ్లీ రాళ్లు రువ్వుకున్నారా అని పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు, ‘ముందు అసలు పరిస్థితి ఏమిటో నన్ను చూడనివ్వండి’ అంటూ అడిషనల్ డీసీపీ మయాంక్ బన్సాల్ సమాధానం ఇచ్చారని వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది.

    మళ్లీ రాళ్లు రువ్వుకున్నారంటూ మీడియాలో వస్తున్న వార్తలను దిల్లీ పోలీసులు ఖండించారు. చిన్న విషయాన్ని పెద్దగా చేసి చెబుతున్నారని, దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

  16. అక్షతా మూర్తి బ్రిటన్ రాణి కంటే ధనవంతురాలా, ఆమెపై రాజకీయ దుమారం ఎందుకు?

    అక్షతా మూర్తి... గత కొద్ది రోజులుగా ఈ పేరు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోంది. బ్రిటన్‌లో ఆమె చుట్టూ రాజకీయ దుమారం రేగుతోంది. ఏం జరిగింది? అక్షతా మూర్తి బ్రిటన్ మహారాణి కంటే ధనవంతురాలు ఎలా అయ్యారు?

  17. దిల్లీలో మత కలహాలపై మోదీని ప్రశ్నించిన మార్టినా నవ్రతిలోవా

    దిల్లీలో హనుమాన్ జయంతి సందర్భంగా జహంగీర్‌పురీలో జరిగిన హింసపై ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ మార్టినా నవ్రతిలోవా స్పందించారు.

    దిల్లీలో మత కలహాలు జరిగాయంటూ జర్నలిస్ట్ రాణా ఆయుబ్ చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ ఇలా జరగడం సరైనదేనా అంటూ నవ్రతిలోవా భారత ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించారు?

  18. ఉడుమును రేప్ చేశారనే ఆరోపణలతో మహారాష్ట్రలో నలుగురి అరెస్ట్, ఇంతకీ ఏం జరిగింది

  19. మహారాష్ట్ర: ప్రార్థన మందిరాల్లో లౌడ్ స్పీకర్ల వాడకంపై ఆంక్షలు

    ప్రార్థనా మందిరాల్లో లౌడ్ స్పీకర్ల వాడంకపై మహారాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ప్రార్థనా మందిరాల్లో లౌడ్ స్పీకర్లు వాడాలంటే ముందుగా అనుమతి తీసుకోవాలని ఆ రాష్ట్ర హోంశాఖ వెల్లడించింది.

    మహారాష్ట్రలో మసీదుల నుంచి లౌడ్ స్పీకర్లను తొలగించాలంటూ గత కొద్ది రోజులుగా మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన డిమాండ్ చేస్తూ వస్తోంది.

    మే 3లోగా మసీదుల నుంచి లౌడ్ స్పీకర్లు తొలగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లేదంటే తామే తొలగిస్తామని మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన సారథి రాజ్ ఠాకరే హెచ్చరించిన నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

    ‘మహారాష్ట్రలో అల్లర్లు జరగాలని మేం కోరుకోవడం లేదు. ప్రార్థనలు చేసుకోవడాన్ని ఎవరూ అడ్డుకోవడం లేదు. అక్రమంగా మసీదుల పెట్టిన లౌడ్ స్పీకర్లను తొలగించాలని కోరుతున్నాం. మీరు తొలగించకుంటే మేం కూడా లౌడ్ స్పీకర్లు పెడతాం. చట్టం కంటే మతం గొప్పది కాదని ముస్లింలు అర్థం చేసుకోవాలి.’ అని రాజ్ ఠాకరే అన్నారు.

    మే 3 తరువాత లౌడ్ స్పీకర్లు తొలగించని మసీదుల ముందు హనుమాన్ చాలీసా ప్లే చేయాలని దేశవ్యాప్తంగా ఉండే హిందువులకు ఆయన పిలుపునిచ్చారు.

  20. పాకిస్తాన్ ప్రధాని ఇద్దరి భార్యల్లో ‘ఫస్ట్ లేడీ’ హోదా ఎవరికి దక్కనుంది