You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

మూడువైపుల నుంచి యుక్రెయిన్‌పై రష్యా దాడులు, ఆరు విమానాలను కూల్చేశామన్న యుక్రెయిన్

యుక్రెయిన్‌పై రష్యా భారీ సైనిక చర్యకు దిగింది. రష్యా దాడుల్లో ఏడుగురు చనిపోయారని, 19 మంది ఆచూకీ తెలియడం లేదని యుక్రెయిన్ పోలీసులు చెబుతున్నారు. రష్యా దురాక్రమణను యూరప్‌లో భారీ యుద్ధానికి నాందిగా యుక్రెయిన్ అధ్యక్షుడు అభివర్ణించారు.

లైవ్ కవరేజీ

  1. యుక్రెయిన్‌పై రష్యా దాడి: ఇప్పటి వరకు ఏం జరిగింది?

    యుక్రెయిన్‌లో గందరగోళమైన, వేగంగా మారిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటివరకు అక్కడ ఏం జరిగిందో చూద్దాం.

    యుక్రెయిన్‌పై రష్యా భారీ సైనిక చర్యకు దిగింది. మూడువైపుల నుంచి యుక్రెయిన్‌పై దాడులు చేసింది. ప్రధాన నగరాల్లో బాంబు దాడులు, క్షిపణి దాడులు చేసింది.

    యుక్రెయిన్ రాజధాని కీవ్‌లో రోజంతా పేలుళ్ల శబ్ధాలు, వైమానిక దాడుల సైరన్‌ శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయి. రష్యా బలగాలు కీవ్‌ నగరానికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయని బీబీసీ ప్రతినిధి చెప్పారు. రష్యా దాడులను తిప్పికొడుతున్నామని యుక్రెయిన్ చెబుతోంది. ఆరు రష్యా విమానాలను కూల్చేశామని అంటోంది.

    యుక్రెయిన్‌లోని అనేక ప్రాంతాల్లో దాడులు జరిగాయి. క్రిమియా నుంచి రష్యా సైనిక బలగాలు యుక్రెయిన్‌లోకి ప్రవేశించాయని యుక్రెయిన్ బోర్డర్ గార్డ్స్ వెల్లడించింది.

    యుక్రెయిన్‌పై సైనిక చర్య మినహా మరో మార్గం లేదని రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్పారు. తాము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని యుక్రెయిన్ అధ్యక్షుడు ప్రకటించారు. రష్యా చెర్నోబిల్‌ను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇది యూరప్‌పై యుద్ధం ప్రకటించడమేనని అన్నారు.

    రష్యా సైనిక చర్యను యూరప్ దేశాలు ఖండించాయి.

    యుక్రెయిన్‌ నుంచి పారిపోయి పొరుగున ఉన్న దేశాల్లో తలదాచుకునేందుకు స్థానిక ప్రజలు ప్రయత్నిస్తున్నారు.

    ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్‌డేట్స్. యుక్రెయిన్‌పై రష్యా దాడులకు సంబంధించిన తాజా సమాచారం బీబీసీ న్యూస్ లైవ్‌పేజీలో చూడొచ్చు. ధన్యవాదాలు

  2. యుక్రెయిన్ వీధుల్లోని అనిశ్చితి, భయం

    యుక్రెయిన్‌పై రష్యా భీకర దాడి చేయడంతో అక్కడి ప్రమాదకర పరిస్థితుల్లో ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. వారి వ్యథలను ప్రతిబింబించే కొన్ని చిత్రాలివి

  3. యుక్రెయిన్‌పై రష్యా సైనిక దాడులను ఎందుకు మొదలుపెట్టింది?

    రష్యా సైనిక దాడులు ఎందుకు మొదలుపెట్టింది? ఈ సంక్షోభానికి కారణాలు ఏమిటి? రష్యా వినిపిస్తున్న వాదన ఏమిటి? యూరోపియన్ నాయకులు ఏమంటున్నారు? ఈ అంశాలపై బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ కింది వీడియోలో చూడండి.

  4. రష్యా చెర్నోబిల్‌ను స్వాధీనం చేసుకోవాలనుకుంటోంది - యుక్రెయిన్ అధ్యక్షుడు

    చెర్నోబిల్ అణు కేంద్రాన్ని స్వాధీనం చేసుకునేందుకు రష్యా ఆక్రమణదారులు ప్రయత్నిస్తున్నారని యుక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమర్ జెలెన్‌స్కీ చెప్పారు. కానీ యుక్రెయిన్ సైనికులు వారికి దీటుగా సవాలు విసురుతున్నారని ఆయన అన్నారు.

    ‘‘చెర్నోబిల్‌ను ఆక్రమించేందుకు రష్యా ఆర్మీ ప్రయత్నిస్తోంది. 1986 నాటి విషాదం మళ్లీ జరగకుండా నివారించడం కోసం మా యోధులు రష్యాపై పోరాడుతున్నారు. స్వీడన్ ప్రధానికి దీని గురించి సమాచారం ఇచ్చాను. ఇది ఐరోపాకు వ్యతిరేకంగా ప్రకటించిన యుద్ధం’’ అని ఆయన ట్వీట్ చేశారు.

    మానవ చరిత్రలో అతిపెద్ద అణు ప్రమాదం, సోవియట్ యూనియన్ హయాంలో 1986లో చెర్నోబిల్‌లో జరిగింది. 1986 ఏప్రిల్ 26న చెర్నోబిల్‌లోని అణురియాక్టర్ పేలింది.

    దీని కారణంగా వేలాది మంది క్యాన్సర్ బారిన పడ్డారు. రద్దీగా ఉండే ఆ ప్రాంతం ఒక సమయంలో నిర్మానుష్యంగా మారిపోయింది. ఈ ప్రమాదం కారణంగా చెర్నోబిల్ అణుప్లాంట్ చుట్టూ 2600 చదరపు కిలోమీటర్ల పరిధిలో మానవ రాకపోకలను నిషేధించారు.

  5. యుక్రెయిన్‌లో ఏం జరుగుతోంది?

    యుక్రెయిన్‌లో చాలా గందరగోళమైన, వేగంగా మారిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటివరకు అక్కడ ఏం జరిగిందో చూద్దాం.

    రష్యా దళాలు యుక్రెయిన్‌పై అనేక దిశల నుంచి దాడి చేశాయి. తూర్పున ఉన్న డాన్‌బాస్‌లోని వేర్పాటువాద ప్రాంతాల నుంచి, ఉత్తరాన బెలారస్ నుంచి, దక్షిణ క్రిమియా నుంచి రష్యా దళాలు యుక్రెయిన్‌ను చుట్టుముట్టాయి.

    ఈ దాడి చాలావరకు తూర్పు యుక్రెయిన్‌పైనే కేంద్రీకృతమై ఉన్నట్లు తెలుస్తోంది.

    యుక్రెయిన్, రష్యా మిలిటరీ దళాల ఎదురుకాల్పులు, నిరంతర పేలుళ్ల కారణంగా అపార్ట్‌మెంట్‌లలోని కిటికీలు షేక్ అవుతున్నాయని యుక్రెయిన్‌లోని రెండో అతిపెద్ద నగరమైన ఖార్కివ్ వాసులు చెబుతున్నారు.

    ఉత్తరాన రాజధాని కీవ్‌తో పాటు దక్షిణాన సముద్రతీర నగరాలైన ఒడెషా, మరిపోల్‌ చుట్టూ కూడా ఘర్షణలు జరుగుతున్నాయి.

    యుక్రెయిన్ మిలిటరీ స్థావరాలు, విమానాశ్రయాలే లక్ష్యంగా రష్యా వైమానిక దాడులు చేస్తోంది. కీవ్‌కు సమీపంలోని కీలక విమానాశ్రయం చుట్టూ కూడా భీకర పోరాటం జరిగినట్లు కథనాలు వస్తున్నాయి. రష్యాకు చెందిన కనీసం ఆరు విమానాలను కూల్చివేసినట్లు యుక్రెయిన్ సైన్యం పేర్కొంది. 40 మంది తమ సైనికులను కోల్పోయినట్లు చెప్పింది.

    మరోవైపు యుక్రెయిన్‌కు చెందిన 70 కంటే ఎక్కువ సైనిక స్థావరాలను ధ్వంసం చేసినట్లు రష్యా తెలిపింది.

    చాలామంది యుక్రేనియన్లు సురక్షితమైన ప్రాంతాల కోసం వెతుకుతున్నారు. వేలాదిమంది కీవ్ నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారు.

  6. కొత్త మార్గదర్శకాలను విడుదల చేసిన భారత రాయబార కార్యాలయం

    యుక్రెయిన్‌లో నివసిస్తోన్న భారతీయుల కోసం గురువారం భారత రాయబార కార్యాలయం మార్గదర్శకాలను జారీ చేసింది.

    ఎక్కడున్నవారు అక్కడే సురక్షితంగా ఉండాలని ఈ మార్గదర్శకాల్లో భారతీయ పౌరులకు సూచించింది.

    ‘‘యుక్రెయిన్‌లో మార్షల్ లా అమల్లో ఉన్నట్లు మీకు తెలుసు. దాని కారణంగానే రవాణా కష్టంగా మారింది.

    కీవ్‌ నగరంలో చిక్కుకుపోయిన, భద్రత లేని ప్రదేశాల్లో ఉన్న విద్యార్థులు అందరికీ ఆశ్రయం కల్పించాల్సిందిగా అక్కడి ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతున్నాం.

    కొన్ని ప్రాంతాల్లో వైమానిక దాడులతో పాటు బాంబు పేలుళ్లు జరిగే అవకాశం ఉన్నట్లు మాకు తెలిసింది. అలాంటి ప్రదేశాల్లో మీరు ఉన్నట్లయితే గూగుల్ మ్యాప్స్‌లో మీకు సమీపంలో ఉన్న బాంబ్ షెల్టర్ల గురించి వెదకండి. అవి భూగర్భంలో నిర్మించి ఉంటాయి’’ అని భారత రాయబార కార్యాలయం పేర్కొంది.

    కీవ్‌ నగరంలో ఉన్నవారి కోసం కీవ్ సిటీ అడ్మినిస్ట్రేషన్‌కు సంబంధించిన లింక్‌ను కూడా షేర్ చేసింది. ఆ లింక్‌ను కింద ఇచ్చిన ట్వీట్‌లో చూడవచ్చు.

    ‘‘ప్రస్తుత పరిస్థితులకు తగిన పరిష్కారం దొరికేంత వరకు, మీ చుట్టూ ఉన్న పరిస్థితుల్ని గమనించుకుంటూ సురక్షితంగా ఉండండి. అత్యవసరం అయితే తప్ప ఇళ్లను వదిలి బయటకు రావొద్దు. ఎల్లప్పుడు మీ పత్రాలను మీ వెంటే ఉంచుకోండి. అందరూ కలిసికట్టుగా ఉండండి’’ అని భారత రాయబార కార్యాలయం కోరింది.

    యుక్రెయిన్‌లో భారత రాయబారి పార్థ సత్పతి మాట్లాడుతూ...‘‘యుక్రెయిన్‌లో నివసించే భారతీయ పౌరుల భద్రత కోసం భారత రాయబార కార్యాలయం నిరంతరం పనిచేస్తోంది. ఎవరైనా కీవ్ నగరంలో చిక్కుకుపోయి ఉంటే మీ స్నేహితులను, కుటుంబాలను, అక్కడి భారత కమ్యూనిటీలను లేదా భారత రాయబార కార్యాలయం సహాయాన్ని కోరండి’’ అని అన్నారు.

    భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ గతంలో కూడా యుక్రెయిన్‌లో నివసిస్తోన్న విద్యార్థులతో పాటు ఇతర భారతీయ పౌరులను ఉద్దేశించి మార్గదర్శకాలను జారీ చేసింది.

    వీలైనంత త్వరగా యుక్రెయిన్ వదిలిపెట్టాలని ఆ మార్గదర్శకాల్లో కోరింది.

    ఇది మాత్రమే కాకుండా కొన్ని రోజుల క్రితం ప్రత్యేక విమానాల ద్వారా యుక్రెయిన్ నుంచి భారత పౌరులను ఇండియాకు తరలించింది.

    యుక్రెయిన్‌లోని భారతీయ విద్యార్థులకు, పౌరులకు సహాయం చేయడానికి దిల్లీలో నిరంతరం పనిచేసే కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది.

  7. ప్లీజ్, మోదీజీ, మీరు చెబితే పుతిన్ వింటారు - యుక్రెయిన్

    మోదీజీ చెబితే రష్యా అధ్యక్షుడు పుతిన్ వింటారని, ఆయన జోక్యం చేసుకోవాలని యుక్రెయిన్‌ రాయబారి డాక్టర్‌ ఇగోర్‌ పోలిఖా అర్థించారు. శక్తిమంతమైన ప్రపంచ నేతల్లో మోదీ ఒకరని ఆయన చెప్పారు.ఆయన ఇంకా ఏమన్నారో కింది వీడియోలో చూడండి.

  8. రష్యాపై ఆంక్షల విధింపులో ఈయూలో సఖ్యత లేదు

    జెస్సికా పార్కర్

    బీబీసీ బ్రస్సెల్స్ ప్రతినిధి

    రష్యాపై ఆంక్షలు విధిస్తున్నట్లు బుధవారం మధ్యాహ్నమే యూరోపియన్ యూనియన్ (ఈయూ) సంతకం చేసింది.

    తాజా పరిణామాల నేపథ్యంలో రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించేందుకు ఈయూ ప్రణాళికలు రచిస్తోంది.

    ఈయూ విధించే ఈ ఆర్థిక ఆంక్షలు చాలా తీవ్రమైనవి, భారీగా ఉంటాయని వర్ణిస్తున్నారు.

    నిజానికి ఈ విషయంలో ఈయూ సభ్యదేశాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

    జర్మనీ, ఇటలీ దేశాలు కఠినమైన చర్యలు తీసుకుంటాయనే నమ్మకం లేదని దౌత్యవేత్తలు అంటున్నారు. అదే సమయంలో లిథువేనియా, పోలండ్ దేశాలు ఆంక్షల విషయంలో తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నట్లుగా కనిపిస్తోంది.

    ఎందుకంటే రష్యాకు హాని కలిగించే చర్యల వల్ల యూరప్‌కు కూడా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నది నిజం. వ్యాపారం, ఇంధన సరఫరాల పరంగా యూరప్‌కు నష్టం కలగవచ్చు.

  9. ‘యుక్రెయిన్ శరణార్థులను ఆదుకోండి’- యూఎన్

    యుక్రెయిన్‌లో పరిస్థితులు వేగంగా దిగజారిపోతున్నాయని ఐక్యరాజ్యసమితి శరణార్థుల ఏజెన్సీ పేర్కొంది.

    శరణార్థుల కోసం సరిహద్దులు తెరిచి ఉంచాలని యుక్రెయిన్ పొరుగుదేశాలను కోరింది.

    ‘‘చాలామంది క్షతగాత్రులు అయినట్లు నివేదికలు చెబుతున్నాయి. భయంతో ఇళ్లను వదిలి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లడం ప్రారంభించారు’’ అని యూఎన్ రెఫ్యూజీ హైకమిషనర్ ఫిలిప్పో గ్రాండి అన్నారు.

    యుక్రెయిన్ నుంచి పారిపోయి వచ్చేవారి కోసం పలు యూరప్ దేశాలు సన్నాహాలు చేసుకుంటున్నాయి.

    సరిహధ్దుల వద్ద రిసెప్షన్ పాయింట్లను ఏర్పాటు చేస్తున్నట్లు పోలండ్ ఆరోగ్యమంత్రి చెప్పారు. గాయాలతో వచ్చేవారి కోసం పడకలతో కూడిన ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.

    శరణార్థులకు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నట్లు హంగరీ, స్లోవేకియా చెప్పాయి. ‘‘శరణార్థుల పట్ల దయతో అవగాహనతో వ్యవహరించండి’’ అని స్లోవేకియా ప్రధాని ఎడ్వర్డ్ హెగెర్ అన్నారు.

    యుక్రెయిన్‌ సరిహద్దు దేశాలకు మానవతా సహాయం అందించేందుకు జర్మనీ కూడా ముందుకొచ్చింది.

  10. తూర్పు యుక్రెయిన్ మిలిటరీ ఎయిర్‌ఫీల్డ్ నుంచి పొగలు

    యుక్రెయిన్‌పై రష్యా సైనిక దాడులు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఈ ఘటనలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను జర్నలిస్టులు, ప్రత్యక్ష సాక్షులు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు.

    ఇలాంటి ఒక వీడియాలో తూర్పు యుక్రెయిన్‌లోని ఖార్కివ్ రీజియన్‌కు చెందిన చుగ్యువ్ మిలిటరీ ఎయిర్‌ఫీల్డ్ నుంచి పొగలు వెలువడటం కనిపిస్తోంది. ఆ వీడియోలోని ఫుటేజీ నిజమేనని ధ్రువీకరించారు. కానీ ఆ వీడియోను పోస్ట్ చేసిన వ్యక్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.

  11. పుతిన్ యూరప్‌లో యుద్ధజ్వాలలు రగిలించారు- బోరిస్ జాన్సన్

    ఆఖరికి అందరూ భయపడినట్లే జరిగిందనిబ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ వ్యాఖ్యానించారు. రష్యా దాడి గురించి అందరూ ఊహించిందే నిజమైందని అన్నారు.

    ‘‘పుతిన్, యూరప్‌లో యుద్ధజ్వాలలు రగిలించారు. ఎలాంటి కవ్వింపులు లేకుండానే ఒక స్నేహపూర్వకమైన దేశంపై దాడికి దిగారు. అమాయక ప్రజలపై బాంబుల వర్షం కురుస్తోంది. భూమి, ఆకాశం, సముద్రతలాల్లో భారీ దాడులు కొనసాగుతున్నాయి. ఐరోపాలో రెండో పెద్దదేశం యుక్రెయిన్. ఇక్కడ ఏళ్ల తరబడి ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ మనుగడలో ఉంది’’ అని ఆయన వివరించారు.

    ‘‘ఇక్కడ స్వేచ్ఛను హరించడానికి మేం అనుమతించం. యుక్రెయిన్‌కు సహాయం చేసిన యూరోపియన్ దేశాల్లో బ్రిటన్ కూడా ఉంది. తర్వాత మిగతా మిత్రదేశాలు కూడా సహాయం అందించాయి. రాబోయే రోజుల్లో బ్రిటన్ మరింత సహకారం అందిస్తుంది. మిత్రదేశాలతో కలిసి రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధిస్తాం’’ అని ఆయన అన్నారు.

    ‘పుతిన్ చర్య అనాగరికమైనది, హేయమైనది. ఇది విఫలం అవుతుంది’ అని బోరిస్ జాన్సన్ వ్యాఖ్యానించారు.

  12. యుక్రెయిన్‌పై సైనిక చర్య గురించి రష్యా ఏం చెప్పిందంటే...

    యుక్రెయిన్‌పై సైనిక చర్య స్వభావాన్ని తెలుపుతూ, దాన్ని సమర్థించుకునేందుకు అనేక వాదనలు చేస్తూ రష్యా మిలిటరీ ఒక ప్రకటన విడుదల చేసింది.

    ఆ ప్రకటనలో, డాన్‌బాస్‌లోని రష్యా అండ ఉన్న వేర్పాటువాదులకు చెందిన ప్రాంతాలను రక్షించడానికే యుక్రెయిన్‌పై దాడిని ప్రారంభించామనే వాదనను రష్యా పునరావృతం చేసింది. ఈ ప్రాంతాల్లో యుక్రెయిన్ మిలిటరీ దాడి చేస్తోందని రష్యా చెబుతోంది.

    రష్యా చేస్తోన్న ఈ వాదన పూర్తి అబద్ధమని నిపుణులు అంటున్నారు.

    యుక్రెయిన్‌పై దాడిని సమర్థించుకునేందుకు రష్యా ఏదో ఒక సాకును చూపిస్తుందని గత కొన్ని వారాలుగా పాశ్చాత్య దేశాలు హెచ్చరిస్తూనే ఉన్నాయి.

    అత్యంత కచ్చితత్వంతో, కేవలం మిలిటరీ సదుపాయాలే లక్ష్యంగా తమ దాడులు జరుగుతున్నాయని రష్యా చెప్పింది.

    ఒడెస్సా నౌకాశ్రయం సమీపంలో క్షిపణి దాడిలో కనీసం 18 మంది మరణించినట్లు, మొత్తం 30 మంది యుక్రెయిన్ పౌరులు చనిపోయినట్లు వార్తా కథనాలు చెబుతున్నాయి.

    యుక్రెయిన్ సాయుధ బలగాలు తమ ఆయుధాలు, స్థావరాలను విడిచిపెట్టి మూకుమ్మడిగా పారిపోతున్నట్లు రష్యా మిలిటరీ చెబుతోంది.

    అయితే, దాదాపు 50 మంది రష్యన్ చొరబాటుదారులను హతమార్చినట్లు, రష్యన్ విమానాలను కూల్చివేసినట్లు యుక్రెయిన్ చెప్పింది. దీన్ని అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. దేశం కోసం ఎవరైనా ఆయుధాలు పట్టొచ్చని యుక్రెయిన్ ప్రభుత్వం సూచించింది.

  13. రష్యా చర్యను ‘దాడి’గా ఒప్పుకోని చైనా

    యుక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యను ‘దాడి’గా అభివర్ణించడానికి చైనా నిరాకరించింది.

    ‘యుక్రెయిన్ సమస్య చాలా క్లిష్టమైనది, చారిత్రక నేపథ్యమున్నది’ అని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి హువా చునియంగ్ అన్నారు.

    అనేక వాస్తవ చర్యల ఫలితమే ఈ సంక్షోభం అని ఆయన వ్యాఖ్యానించారు.

    సాధారణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ‘‘చైనాకు, పాశ్చాత్య దేశాల ప్రజలకు మధ్య ఉన్న వ్యత్యాసం ఇదే కావొచ్చు. మేం అంత తొందరగా ఒక నిర్ధారణకు రాలేం’’ అని అన్నారు.

    రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్‌తో ఫోన్ కాల్ సందర్భంగా... చైనా ఎల్లప్పుడూ మిగతా అన్ని దేశాల సమగ్రతను, సార్వభౌమత్వాన్ని గౌరవిస్తుందని విదేశాంగ మంత్రి వాంగ్ యి పేర్కొన్నారు.

    యుక్రెయిన్ కేసు కాస్త క్లిష్టమైనదని, రష్యా చట్టబద్ధమైన భద్రతా ఆందోళనలను చైనా అర్థం చేసుకుంటుందని ఆయన వివరించారు.

    యుక్రెయిన్‌ తాజా పరిస్థితిని తాము గమనిస్తున్నామని, అన్ని వర్గాలవారు సంయమనం పాటించాలని ఆయన కోరారు.

  14. యుక్రెయిన్ సంక్షోభం గురించి ఈయూ అధికారితో చర్చించాం: ఎస్. జయశంకర్

    యుక్రెయిన్ సంక్షోభంపై యూరోపియన్ యూనియన్ (ఈయూ) సీనియర్ అధికారితో మాట్లాడినట్లు భారత విదేశాంగ మంత్రి ఎస్. జయశంకర్ చెప్పారు.

    ‘‘ఈయూ హెచ్‌ఆర్‌వీపీ జోసెఫ్ బోరెల్ ఫాంటెల్స్ నుంచి ఫోన్ వచ్చింది. యుక్రెయిన్ ఉద్రిక్తతల గురించి ఫోన్‌లో చర్చించాం. ఉద్రిక్తతలను తగ్గించడానికి చేస్తోన్న ప్రయత్నాలకు సంబంధించి భారత పాత్రపై కూడా చర్చ జరిగింది’’ అని ఆయన ట్వీట్ చేశారు.

    దీనితో పాటు భారత్‌లో యుక్రెయిన్ రాయబారి ఇగోర్ పోలిఖా కూడా ఈ అంశంలో భారత్ జోక్యం చేసుకోవాలని కోరారు.

  15. రష్యా సైనిక చర్య తర్వాత యుక్రెయిన్‌లో పరిస్థితి ఇది

    యుక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యను ప్రారంభించిన తర్వాత చాలా నగరాల్లో పేలుళ్లు సంభవించినట్లు వార్తలు వచ్చాయి.

    తూర్పు యుక్రెయిన్‌లోని చాలా నగరాల్లో పరిస్థితులు గందరగోళంగా తయారయ్యాయి. చాలా నగరాల్లోని ఏటీఎంలు, పెట్రోల్ బంకుల వద్ద ప్రజలు బారులు తీరారు.

    యుక్రెయిన్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఈ ఫొటోల్లో చూడండి.

  16. మేం సిగ్గుపడుతున్నాం.. విషాదంలో మునిగిపోయాం: రష్యా నోబెల్ శాంతి బహుమతి విజేత

    యుక్రెయిన్ మీద రష్యా దండయాత్ర పట్ల తాను, తన సహచరులు తీవ్ర విషాదంలో మునిగిపోయామని.. రష్యా పాత్రికేయుడు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత దిమిత్రీ మురాటోవ్ చెప్పారు.

    రష్యాలో మిగిలివున్న అతికొద్ది స్వతంత్ర పత్రికల్లో ఒకటైన నొవాయా గజెటా వార్తాపత్రిక సంపాదకుడు దిమిత్రీ మురాటోవ్.

    ‘‘విషాదంతో పాటు మేం సిగ్గు పడుతున్నాం కూడా’’ అని ఆయన చెప్పారు.

    రష్యా అధ్యక్షుడు పుతిన్.. ‘‘అణ్వస్త్ర మీటతో అదేదో ఖరీదైన కారు కీచెయిన్‌ లాగా ఆడుకుంటున్నార’’ని ఆయన ఆరోపించారు.

    ‘‘తర్వాత ఏమిటి? అణు దాడేనా?’’ అని ప్రశ్నించారు.

    ‘‘ప్రాయశ్చిత్త ఆయుధం’ గురించి వ్లాదిమిర్ పుతిన్ మాటలకు మరో వివరణ నాకు కనిపించటం లేదు’’ అని దిమిత్రీ మురాటోవ్ వ్యాఖ్యానించారు.

    రష్యాలో భావ ప్రకటనా స్వాతంత్ర్యం కోసం చేసిన పోరాటానికి గాను దిమిత్రీ మురాటోవ్ 2022లో నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు.

  17. యుక్రెయిన్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ కార్యాలయం పక్కన పొగలు

    యుక్రెయిన్ రాజధాని కీవ్ నగరంలోని ఆ దేశ రక్షణ నిఘా విభాగం ప్రధానకార్యాలయం నుంచి నల్లని పొగ ఎగసిపడుతోందని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.

    ఈ కార్యాలయంపై బాంబు దాడి జరిగిందని ముందుగా అనుమానించారు. అయితే, యుక్రెయిన్ రక్షణ నిఘా విభాగం ప్రధానకార్యాలయం పక్క నుంచి పొగలు వచ్చాయని తర్వాత తెలిసింది. ఈ కార్యాలయానికి కూడా ఏమీ కాలేదు.

  18. రష్యా – యుక్రెయిన్ సంక్షోభం.. ప్రాధమికాంశాలు

    యుక్రెయిన్ మీద రష్యా సైనిక చర్య చేపట్టిన నేటి పరణామాల దిగ్భ్రాంతి నుంచి ప్రపంచం నెమ్మదిగా తేరుకుంటోంది. ఈ సంక్షోభానికి సంబంధించిన కొన్ని ప్రాధమిక అంశాలివీ...

    యూరప్‌కు రష్యాతో ఉన్న తూర్పు సరిహద్దులో ఉంది యుక్రెయిన్.

    భూవిస్తీర్ణం రీత్యా యూరప్‌లో రెండో అతి పెద్ద దేశం యుక్రెయిన్. దాని మీద ప్రపంచంలో అతి పెద్ద దేశమైన రష్యా దండెత్తింది.

    యుక్రెయిన్‌ జనాభా సుమారు 4.4 కోట్ల మంది కాగా.. రష్యా జనాభా 14.4 కోట్ల మంది.

    యుక్రెయిన్‌ను నిస్సైనికీకరణ చేయటం తన లక్ష్యమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చెప్తున్నారు.

    యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ.. తమ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేస్తామని ప్రతినబూనారు. ‘‘మేం బలంగా ఉన్నాం. మేం దేనికైనా సిద్ధంగా ఉన్నాం’’ అన్నారాయన.

    మాజీ సోవియట్ రిపబ్లిక్ అయిన యుక్రెయిన్‌కు.. రష్యాతో లోతైన సామాజిక, సాంస్కృతిక సంబంధాలున్నాయి. ఈ దేశంలో రష్యన్ భాషను విస్తృతంగా మాట్లాడతారు.

    యుక్రెయిన్‌లో రష్యా అనుకూల అధ్యక్షుడిని 2014లో పదవీచ్యుతిని చేసినపుడు.. యుక్రెయిన్ భూభాగంలో కొంత భాగాన్ని రష్యా తమ దేశంలో కలుపుకుంది.

    అప్పటి నుంచీ యుక్రెయిన్ యూరప్ సంస్థలైన యూరోపియన్ యూనియన్, సైనిక కూటమి నాటోల వైపు మళ్లింది.

    ఆ సంస్థలతో యుక్రెయిన్ మరింతగా కలిసిపోకుండా నిరోధించటం పుతిన్ లక్ష్యం.

  19. యుక్రెయిన్ గగనతలం ఎలా ఉందంటే...

    యుక్రెయిన్‌లో సంక్షోభం ముదిరిపోవటంతో ఆ దేశ గగనతలానికి విమానయాన సంస్థలు దూరంగా ఉండటంతో.. యూరోప్ విమానయానం మీద ప్రభావం ఎలా ఉందో ఈ చిత్రం చూపుతోంది.

    యుక్రెయిన్ మీద రష్యా సైనిక చర్య ప్రారంభించటంతో యుక్రెయిన్ తమ గగనతలాన్ని పౌర విమానయానానికి మూసివేసింది.

    ‘‘రాత్రికి రాత్రి భయానక పరిణామాలు సంభవించటంతో’’ విమానయాన సంస్థలు యుక్రెయిన్ గగనతలానికి దూరంగా ఉండాలని బ్రిటన్ రవాణా మంత్రి గ్రాంట్ షాప్స్ సివిల్ ఏవియేషన్ అథారిటీకి నిర్దేశించారు.

  20. చాలా మంది జనం వెళ్లిపోతున్నారు: కీవ్ యువతి

    రష్యా సైనిక దాడి చేస్తోందన్న దిగ్భ్రాంతి నుంచి నెమ్మదిగా తేరుకుంటున్న కీవ్ ప్రజలు మీడియాతో మాట్లాడుతున్నారు.

    ‘‘ఉదయం 5 గంటల సమయంలో పేలుళ్ల శబ్దంతో మాకు మెలకువ వచ్చింది. ఈ రోజు మాకు అలా మొదలైంది’’ అని కీవ్ నివాసి తెతియానా కష్తానోవా చెప్పారు.

    ‘‘జనం చాలా మంది నగరం విడిచి వెళ్లటానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్‌లు అవుతున్నాయి’’ అని తెలిపారు.

    ఏం జరుగుతుందో తనకు తెలీదని, నగరం విడిచి వెళ్లటం ప్రమాదకరమని తనకు అనిపిస్తోందని ఆమె పేర్కొన్నారు.

    అయితే ‘‘ఈ దేశం వదిలి పశ్చిమ దేశాలకు వెళ్లే అవకాశం ఉంటే మేం దానిని స్వీకరిస్తాం’’ అన్నారామె.

    ఆమె తొలుత ఒక భూగర్భ కార్ పార్కింగ్‌లో తలదాచుకున్నారు. కానీ ఇప్పుడు తన ఫ్లాట్‌కు తిరిగి వచ్చారు.

    ‘‘మేం మా స్నేహితులతో మాట్లాడుతున్నాం. అందరినీ ఆందోళన చెందకుండా శాంతంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నాం’’ అని చెప్పారు.

    ‘‘మా సైన్యాన్ని మేం నమ్ముతున్నాం’’ అన్నారు.