You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

తీస్తా సెతల్వాద్, ఆర్‌బీ శ్రీకుమార్‌లకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ

జైలులో అల్లర్ల నిందితులు ఉన్నారని, తన ప్రాణాలకు ముప్పు ఉందని తీస్తా సెతల్వాద్ అన్నారు. జైలులో ఆమె భద్రత గురించి కాసేపట్లో కోర్టు వ్యాఖ్యానించనుంది.

లైవ్ కవరేజీ

  1. నేటి ముఖ్యాంశాలు

    • ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహమ్మద్ జుబైర్‌కు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు.
    • దేశానికి ప్రధానమంత్రిలా కాకుండా తన షావుకారు మిత్రుల కోసం సేల్స్‌మ్యాన్‌‌లా నరేంద్ర మోదీ పనిచేస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు.
    • దిల్లీ నుంచి జబల్‌పూర్ వెళ్తున్న స్పైస్‌జెట్ విమానాన్ని అత్యవసరంగా కిందకు దింపాల్సి వచ్చింది.
    • తీస్తా సెతల్వాద్, ఆర్‌బీ శ్రీకుమార్‌లకు అహ్మదాబాద్ మెట్రోపాలిటన్ కోర్ట్ 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

  2. ఉదయ్‌పూర్‌లో ఇంకా కొనసాగుతున్న ఉద్రిక్తతలు

  3. జస్‌ప్రీత్ బుమ్రా: టెస్టుల్లో ఒకే ఓవర్లో 35 పరుగులు చేసి ప్రపంచ రికార్డు, యువరాజ్ సింగ్‌తో పోలుస్తూ ఫ్యాన్స్ ట్వీట్లు

  4. మహమ్మద్ జుబైర్‌కు బెయిల్ నిరాకరణ... ఆయనకు పాకిస్తాన్, సిరియా నుంచి విరాళాలు అందాయా?

  5. ఉదయ్‌పుర్: కన్నయ్యలాల్ హత్య కేసులో పాకిస్తాన్‌లోని 'దావత్-ఎ-ఇస్లామ్' పేరు ఎందుకు వినిపిస్తోంది?

  6. తీస్తా సెతల్వాద్, ఆర్‌బీ శ్రీకుమార్‌లకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ

    తీస్తా సెతల్వాద్, ఆర్‌బీ శ్రీకుమార్‌లకు అహ్మదాబాద్ మెట్రోపాలిటన్ కోర్ట్ 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

    ‘‘పోలీసులు తీస్తా సెతల్వాద్, ఆర్‌బీ శ్రీకుమార్‌ల రిమాండ్‌ను పొడిగించాలని కోరలేదు. వారిని జ్యుడీషియల్ కస్టడీలో ఉంచాలని అడిగారు. కోర్టు వారికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించింది’’ అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ అమిత్ పటేల్ చెప్పినట్లు వార్తా సంస్థ ఏఎన్ఐ పేర్కొంది.

    జైలులో అల్లర్ల నిందితులు ఉన్నారని, తన ప్రాణాలకుముప్పు ఉందని తీస్తా సెతల్వాద్ అన్నారు. జైలులో ఆమె భద్రత గురించి కాసేపట్లో కోర్టు వ్యాఖ్యానించనుంది.

    తన వాంగ్మూలాన్ని సీఆర్‌పీసీ 164 కింద నమోదు చేయాలని ఆర్‌బీ శ్రీకుమార్ కోర్టును కోరారు.

  7. మహమ్మద్ జుబైర్ బెయిల్ పిటిషన్ తిరస్కరణ, 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ

    ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహమ్మద్ జుబైర్‌కు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు.

    శనివారం ఆయనను మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరిచారు.

    దిల్లీ పోలీసుల తరపున సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అతుల్ శ్రీవాస్తవ, జుబైర్‌ను విచారించేందుకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ కావాలని కోర్టును కోరారు.

    అదే సమయంలో జుబైర్ తరఫు న్యాయవాది వృందా గ్రోవర్, తన క్లయింట్‌కు బెయిల్ ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఈ పిటిషన్‌ను తిరస్కరించిన కోర్టు ఆయనను 14 రోజుల కస్టడీకి పంపాలని నిర్ణయించింది.

  8. బీజేపీ ‘ఆపరేషన్ తెలంగాణ’ విజయవంతం అవుతుందా... ఉత్తరాది వ్యూహాలు దక్షిణాదిలో పనిచేస్తాయా?

  9. సూరత్‌లో ప్రజల మనసుల్ని దోచుకుంటున్న మిస్టర్ చాయ్ బైక్

  10. కేసీఆర్: ‘దేశానికి ప్రధానిలా కాకుండా మిత్రుల కోసం సేల్స్‌మ్యాన్‌లా మోదీ పనిచేస్తున్నారు’

    దేశానికి ప్రధానమంత్రిలా కాకుండా తన షావుకారు మిత్రుల కోసం సేల్స్‌మ్యాన్‌‌లా నరేంద్ర మోదీ పనిచేస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు.

    విప‌క్షాల రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి య‌శ్వంత్ సిన్హాకు మ‌ద్ధ‌తుగా సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న జ‌ల‌విహార్‌లో స‌భ‌ను నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాట్లాడుతూ..మోదీ పాల‌నలో అంతా తిరోగ‌మ‌న‌మే అని, ఏ ఒక్క‌రూ సంతోషంగా లేర‌ని అన్నారు.

    మోదీ ప్ర‌ధానిగా కాకుండా దేశానికి సేల్స్‌మెన్‌గా ప‌నిచేస్తున్నార‌ని మండిప‌డ్డారు. దేశంలో స‌రిప‌డా బొగ్గు నిల్వ‌లు ఉన్నా.. విదేశాల‌నుంచి బొగ్గు కొనాల‌ని రాష్ట్రాలకు కేంద్రం హుకుం జారీచేస్తోందని అన్నారు.

    మోదీ తీరుతో శ్రీలంక‌లో ప్ర‌జ‌లు నిర‌స‌న‌లు తెలిపార‌ని గుర్తుచేశారు. శ్రీలంక చేసిన ఆరోప‌ణ‌లపై ప్ర‌ధాని మౌన‌మెందుకు వ‌హిస్తున్నార‌ని సీఎం కేసీఆర్ ప్ర‌శ్నించారు.

    మోదీ ఎనిమిదేళ్ల పాల‌న‌లో ద్ర‌వ్యోల్బ‌ణం పెరిగిపోయింద‌ని, సామాన్యుడు బ‌తుక‌లేని ప‌రిస్థితి నెల‌కొంద‌ని ఆందోళన వ్యక్తం చేశారు.

    వికాసం పేరుతో దేశాన్ని నాశ‌నం చేశార‌ని మండిప‌డ్డారు. ప్ర‌ధాని మోదీ అవినీతిర‌హిత భార‌త్ అని పెద్ద‌పెద్ద మాట‌లు చెప్పార‌ని, ఎంత న‌ల్ల‌ధ‌నం వెన‌క్కి తీసుకొచ్చారో చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

    మోదీపాల‌న‌లో అవినీతిప‌రులు పెరిగిపోయార‌న్నారు. న‌ల్ల‌ధ‌నం నియంత్ర‌ణ కాదు.. రెట్టింపైంది.. ఇదేనా వికాసం? అని ప్ర‌శ్నించారు.

    ప్ర‌భుత్వ వ్య‌వ‌స్థ‌ల‌ను ప్ర‌ధాని మోదీ దుర్వినియోగం చేశార‌ని మండిప‌డ్డారు.

    విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా గురించి మాట్లాడుతూ... ‘‘య‌శ్వంత్ సిన్హా ఉన్న‌త వ్య‌క్తిత్వం గల వారు. న్యాయ‌వాదిగా కెరీర్‌ను ప్రారంభించి వివిధ హోదాల్లో దేశానికి అత్యుత్త‌మ‌ సేవ‌లందించారు. ఆర్థిక మంత్రిగా ప‌నిచేశారు. ఆయ‌న‌కు అన్ని రంగాల్లో విశేష అనుభ‌వ‌ం ఉంది. భార‌త రాజ‌కీయాల్లో య‌శ్వంత్‌సిన్హాది కీల‌క‌పాత్ర’’ అని అన్నారు.

    అనంతరం యశ్వంత్ సిన్హా మాట్లాడారు. దేశానికి కేసీఆర్‌ లాంటి నేత అవసరమని అన్నారు. సీఎం కేసీఆర్‌ అడిగిన ఏ ఒక్క ప్రశ్నకు మోదీ సమాధానం చెప్పలేరని వ్యాఖ్యానించారు.

    టీఆర్‌ఎస్‌ పార్టీ తనకు సంపూర్ణ మద్దతిస్తున్నందుకుగాను సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

    ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

    ఎంఐఎం కూడా యశ్వంత్‌కు మద్దతు ప్రకటించింది.

    తిరిగి సాయంత్రం నాలుగు గంటలకు ఆయన బెంగళూరు బయల్దేరి వెళతారు.

    అయితే, యశ్వంత్ సిన్హాకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ మద్దతిచ్చినప్పటికీ, హైదరాబాదులో మాత్రం కాంగ్రెస్ నాయకులు యశ్వంత్‌ను కలవడం లేదు. టీఆర్ఎస్ ఆహ్వానం మేరకు యశ్వంత్ ఇక్కడకు రావడమే అందుకు కారణం.

    యశ్వంత్ నామినేషన్ పత్రాలపై స్వయంగా రేవంత్ రెడ్డి సంతకం చేశారు. అయినప్పటికీ, ఆయన్ను హైదరాబాదులో కలవకూడదని ఆ పార్టీ నిర్ణయించుకుంది.

    అయితే ఈ విషయంలో కాంగ్రెస్‌లోనే భిన్నాభిప్రాయాలు వచ్చాయి. ఆయన్ను కలవాల్సిందని కాంగ్రెస్ నాయకులు జగ్గారెడ్డి మీడియా ముందు అభిప్రాయపడ్డారు.

  11. మహ్మద్ జుబైర్‌పై మరిన్ని కేసులు మోపిన దిల్లీ పోలీసులు

    ఫేక్ న్యూస్ ఇన్వెస్టిగేషన్ వెబ్‌సైట్ ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహ్మద్ జుబైర్ నాలుగు రోజుల జ్యుడీషియల్ కస్టడీ శనివారంతో ముగిసింది.

    ఆ తరువాత, పాటియాలా హౌస్ కోర్టులోని చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ స్నిగ్ధ సర్వరియా కోర్టులో హాజరుపరిచారు.

    దిల్లీ పోలీసుల తరఫున సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అతుల్ శ్రీవాస్తవ మహ్మద్, జుబేర్‌ను విచారించేందుకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీని కోరారు.

    కోర్టు ఈ కేసును రిజర్వ్ చేసింది. ఈరోజు మధ్యాహ్నం 2.00 గంటల తరువాత తీర్పు వెలువడనుంది.

    మహ్మద్ జుబైర్ కేసులో అనేక కొత్త విషయాలు తెరపైకి వచ్చాయని శ్రీవాస్తవ కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో, దిల్లీ పోలీసులు ఆయనపై మరిన్ని అరోపణలు మోపారని చెప్పారు.

    ఐపీసీలోని రెండు సెక్షన్లు 120-B (నేరపూరిత కుట్ర), 201 (సాక్ష్యాన్ని చెరిపేయడం)తో పాటు విదేశీ విరాళాల (నియంత్రణ) చట్టంలోని సెక్షన్ 35 కింద కూడా దిల్లీ పోలీసులు కేసులు మోపారు.

    అయితే, జుబైర్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేస్తున్నట్లు ఆయన తరఫు న్యాయవాది బృందా గ్రోవర్ తెలిపారు.

    సోషల్ మీడియా పోస్ట్ ద్వారా మతపరమైన మనోభావాలను దెబ్బతీశారనే ఆరోపణలతో మహ్మద్ జుబైర్‌ను జూన్ 27న అరెస్టు చేశారు.

  12. దిల్లీ నుంచి జబల్‌పూర్ వెళ్తున్న స్పైస్‌జెట్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

    దిల్లీ నుంచి జబల్‌పూర్ వెళ్తున్న స్పైస్‌జెట్ విమానాన్ని అత్యవసరంగా కిందకు దింపాల్సి వచ్చింది.

    శనివారం ఉదయం ఈ విమానం దిల్లీ నుంచి జబల్‌పూర్‌కు బయలుదేరింది. పైకి ఎగురుతున్న సమయంలో క్యాబిన్‌లో పొగలు ఆవరించడంతో దిల్లీ విమానాశ్రయంలోనే ఎమర్జెన్సీ ల్యాండిగ్ చేశారు.

    ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్టు స్పైస్‌జెట్ ప్రతినిధి వెల్లడించారని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

  13. హైదరాబాద్: ప్రారంభమైన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం

    భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ప్రారంభమైంది.

    బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ సమావేశాన్ని ప్రారంభించారు.

    రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో మోదీ, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ తదితర ముఖ్యనాయకులు అంతా పాల్గొంటున్నారు.

    బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఏం చేస్తారు?

  14. హైదరాబాద్‌లో యశ్వంత్ సిన్హా పర్యటన.. విమానాశ్రయానికి వెళ్లి స్వాగతం పలికిన కేసీఆర్

    రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్ష పార్టీల తరపున పోటీ చేస్తున్న యశ్వంత్ సిన్హా హైదరాబాద్‌లో పర్యటిస్తున్నారు.

    రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని ఆయన దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు వెళ్లి ఆయా పార్టీల నాయకులను కలుస్తున్నారు.

    యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ మద్దతు పలికింది.

    కాగా, బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమైన రోజే యశ్వంత్ సిన్హా హైదరాబాద్ పర్యటన చేపట్టడం ఆసక్తికరంగా మారింది.

    బేగంపేట విమానాశ్రయంలో యశ్వంత్ సిన్హాకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వాగతం పలికారు.

    జల్ విహార్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలతో యశ్వంత్ సిన్హా భేటీ అవుతున్నారు.

    కాగా, హైదరాబాద్‌లో యశ్వంత్ సిన్హాను కలవకూడదని కాంగ్రెస్ పార్టీ నేతలు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. వాస్తవానికి ఆయన అభ్యర్ధిత్వానికి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు పలికింది.

    కేసీఆర్‌పై విమర్శలు

    ప్రధాన మంత్రి రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విమానాశ్రయానికి వెళ్లి ప్రధానికి స్వాగతం పలకడం ఆనవాయితీగా వస్తోంది.

    అయితే, రాజకీయంగా బీజేపీతో టీఆర్ఎస్ విబేధిస్తున్న నేపథ్యంలో గత ఆరు నెలల కాలంలో ఒక్కసారి కూడా కేసీఆర్ మోదీకి స్వాగతం పలకలేదు.

    ప్రధానికి స్వాగతం పలకకపోవడం, పెద్దలను గౌరవించకపోవడం తెలుగు సంప్రదాయం కాదని బీజేపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు.

    ప్రధాని మోదీ శనివారం హైదరాబాద్ వెళ్లనున్నారు. అయితే, ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ స్వాగతం పలకనున్నారు.

  15. బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీ చూస్తూ ఉండండి.