రైతులకు మార్గదర్శి గుజరాత్ గెనభాయి పటేల్
గుజరాత్లోని బనాస్కాంఠా జిల్లాలోని రైతులకు 15 కిందటి వరకు దానిమ్మ ఎలా సాగు చేయాలో చెప్పిన వారే లేరు. కానీ, ఇప్పుడు అదే ప్రాంతం దానిమ్మ తోటలతో కళకళలాడుతోంది. విదేశాలకు నాణ్యమైన పండ్లను ఎగుమతి చేసే స్థాయికి చేరింది.
ఇంతటి మార్పు తెచ్చిన ఘనత ఈ యాభై మూడేళ్ల రైతు, పద్మశ్రీ గెనభాయి పటేల్దే.
చిన్నతనంలోనే గెనభాయిని పోలియో మహమ్మారి కాటేసింది. కాళ్లపై నడవలేకున్నా వ్యవసాయంలో అనుసరించాల్సిన మెలకువలన్నీ నేర్చుకున్నారు.
ఈ క్రమంలోనే తరతరాలుగా సాగు చేస్తున్న ఒకేవిధమైన సంప్రదాయ పంటలు లాభదాయకంగా ఉండటంలేవని గుర్తించారు. అందుకు ప్రత్యామ్నాయ పంటల గురించి ఆలోచించారు.
తమ ప్రాంతంలో వాతావరణ పరిస్థితులు దానిమ్మ తోటలకు చాలా అనుకూలంగా ఉన్నాయని తెలుసుకున్నారు. 2004లో మహారాష్ట్ర వెళ్లి దానిమ్మ మొక్కలను తెచ్చి నాటించారు గెనభాయి.
అప్పట్లో ఇతను చేస్తున్నది "బుద్ధిమాలిన ప్రయత్నం" అంటూ కొందరు రైతులు విమర్శించేవారట. కానీ, పంట దిగుబడి మొదలయ్యాక అంతా షాకయ్యారు.
తొలి పంటను స్థానికంగా ఉన్న ఓ కంపెనీ కిలోకి రూ.42 చొప్పున చెల్లించి కొనుగోలు చేసింది. దాంతో గెనభాయికి మంచి ఆదాయమే వచ్చింది.
తర్వాత ఇంటర్నెట్ ద్వారా ఇతర ప్రాంతాల్లోని పెద్ద వ్యాపారులనూ సంప్రదించారు. 80 టన్నుల దానిమ్మ పండ్లను 55 రూపాయలకు కిలో చొప్పున అమ్మితే రూ. 40 లక్షలు వచ్చాయి.
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)